Thursday, June 16, 2022

ప్రేమించి పెళ్ళి చేసుకున్న నిత్యం గొడవపడే యువ జంట సంతోషంగా ఉండాలంటే ఏంచెయ్యాలి? గురువు సలహా (మంచి కథ)

గురువు సలహా (మంచి కథ)

ఆ ఊరుకి ఎక్కడి నుండో ఒక స్వామీజీ వచ్చాడు. ఆయన వెనుక ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఊరి బయటున్న గుడి ప్రాంగణంలో నివాసం ఏర్పాటు చేసుకుని, గుడికి వచ్చే భక్తులకు మంచి విషయాలను బోధించేవాడు గురువు. ఆధ్యాత్మిక సందేహాలు అడిగినా , సమస్యలు చెప్పుకున్నా తగిన సలహాలిచ్చి పంపేవాడు స్వామీజీ.
ఒకరోజు పొద్దున్నే ఒక యువజంట వచ్చింది. గురువుకి నమస్కరించి “మాది ప్రేమ వివాహం. అన్యోన్యంగా వుండాలనుకున్నా ఉండలేక పోతున్నాము. నాకు కోపం వస్తే ఆయనని తిడుతున్నాను. అది భరించలేక అతడు నన్ను కొడుతున్నాడు. మేం సంతోషంగా ఉండాలంటే ఏంచెయ్యాలి?” అని అడిగింది యువతి.
వాళ్ళని పరీక్షగా చూసి ‘ అమ్మా! నీకు భర్తని తిట్టాలనిపిస్తే అతడిలో మీ నాన్నని ఊహించుకో” అని చెప్పాడు. ఈసారి యువకుడితో “బాబూ ! నీకు భార్యని కొట్టాలనిపిస్తే ఆమెలో మీ అమ్మని ఊహించుకో” అని చెప్పి పంపించాడు స్వామీజీ.

“పాలూ నీరు, పూలూ దారంలా అన్యోన్యంగా కలసి జీవించమని చెబుతారనుకుంటే ఇలా చేసారేమిటి?” అని ఒక శిష్యుడు అంటే రెండోవాడు కల్పించుకుని “ అవును. వద్దని చెప్పాలి కానీ తిట్టుకోమని, కొట్టుకోమని సలహా ఇస్తారా?” అన్నాడు .

స్వామీజీ మౌనంగా నవ్వాడు తప్ప జవాబివ్వలేదు.
పదిరోజుల తరువాత యువజంట మళ్ళీ వచ్చింది.

వాళ్ళని చూడగానే ‘మనమనుకున్నట్టే గురువు గారిచ్చిన సలహా వికటించి ఉంటుంది’ అని మనసులోనే అనుకున్నారు శిష్యులు.

ఆ జంట స్వామీజీ కాళ్ళ మీద పడి “మా కాపురం చక్కబడింది” అన్నారు. వాళ్ళని “అన్యోన్యంగా జీవించమని’ దీవించాడు స్వామీజీ.

ఈసారి ఆశ్చర్యపోవడం శిష్యుల వంతయింది. “మాకేం అర్ధం కాలేదు గురువు గారూ!. గతసారి సలహాతో సరిపుచ్చి పంపారు. ఇప్పుడేమో దీవించారు” అన్నారు శిష్యులు.

స్వామీజీ చిన్నగా నవ్వి “ఆ రోజు జంటను చూడగానే గొడవలకు అలవాటు పడ్డ వాళ్ళుగా గ్రహించాను. ఎలాగూ జరిగేది ఆపలేను కాబట్టి ప్రయోగం చేయాలనుకుని అలాంటి సలహా ఇచ్చాను. అది ఫలితం ఇచ్చింది” అన్నాడు స్వామీజీ. మరింత వివరంగా చెప్పమని శిష్యులు అడగడంతో ఇలా చెప్పాడు స్వామీజీ.

“సాధారణంగా అమ్మాయిలకి అమ్మ కంటే నాన్న మీద ప్రేమ, గౌరవం ఎక్కువ ఉంటాయి. అది గుర్తు పెట్టుకునే తిట్టేముందు భర్త స్థానంలో ఆమె నాన్నని వూహించుకోమన్నాను. అతడిలో నాన్నని ఊహించుకుని తిట్టలేకపోయింది యువతి. ఆవిడ తిట్టనప్పుడు యువకుడు కొట్టడం లేదు కదా. అలా సమస్య తగ్గిపోయింది. ఒకవేళ ఆమె ఎపుడైనా తిట్టిందే అనుకుందాం. అప్పుడా యువకుడు ఆమె స్థానంలో అమ్మను ఊహించుకుంటాడు. కాబట్టి కొడుకులకు అమ్మ మీద ఉండే ప్రేమ, అభిమానం, అనురాగం వలన కొట్టడానికి చెయ్యి ఎత్తలేడు. అదే జరిగింది వాళ్ళ విషయంలో. అందువలన గొడవలు తగ్గాయి. అందుకే అన్యోన్యంగా ఉండమని దీవించాను”.

స్వామీజీ చెప్పింది విని ఆయన పాదాల మీద పడ్డారు శిష్యులు.
జీవిత సారాన్ని కాచి వడబోసినందు వల్లనే వచ్చే సందర్శకుల మానసిక స్థితిని ఊహించి అందుకు అనువైన సలహాలిచ్చి స్వామీజీ మెప్పు పొందుతున్నారని మనస్పూర్తిగా శిష్యులు నమ్మారు.

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment