Thursday, August 3, 2023

హైదరాబాద్ లోని ప్రాంతాలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకోగలరు

 *హైదరాబాద్ లోని ప్రాంతాలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకోగలరు*:-

బేగం పేట:-
6వ నిజాం మహబూబ్ ఆలీ కుమార్తె బ‌షీర్ ఉన్నిసా బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. కూతురికి క‌ట్నం కింద‌ ఒక స్థలాన్ని  కట్నంగా  ఇచ్చాడు. ఆ స్థలానికి  బషీర్ ఉన్నిసా బేగం  పేరు  మీదగా  బేగంపేట  అని  పేరు వచ్చింది. 

చార్మినార్:-
కులికుతుబ్ షా  కట్టిన  ఈ కట్టడానికి  ప్రధాన  ఆకర్షణ నాలుగు స్థంబాలు. 
ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు. వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వ‌చ్చింది.

సికింద్రాబాద్:-
మూడో  నిజాం  సికిందర్ ఝా  పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్  అనే  పేరు  వచ్చింది . అంతకుముందు  సికింద్రాబాద్ ని  లష్కర్  అని  పిలిచే వారు.

ఖైరతాబాద్:-
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.

శంషాబాద్:-
షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వ‌చ్చింది. ష‌మ్స్ అంటే సూర్యుడు. 
దీని అర్థం ప్ర‌భువుల యందు సూర్యుడిలాంటి వాడని,
ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు క‌ల‌దు.

నాంపల్లి:-
నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్ అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్-నామ్-పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.

హిమయత్ నగర్:-
1933 లో ఏడవ నిజాం ఉస్మాన్  అలీఖాన్ యొక్క పెద్ద కుమారుడు   హిమాయత్  అలీ ఖాన్  ఆస‌ఫ్ జా పేరు మీద ఆ స్థలానికి  హిమాయత్ నగర్ అని పేరు వచ్చింది.

అబిడ్స్:-
ఆరో నిజాం కాలంలో అల్‌బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా  యూదువ్యాపారి  ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత  కొంతకాలానికి ఆల్బర్డ్ అబిడ్  ఇంగ్లాండ్ కి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిర‌ప‌డిపోయింది. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.

సోమాజిగూడ:-
నిజాం కాలంలోని రెవెన్యూ  డిపార్ట్మెంట్  అధికారైన సోనాజీకి  కొన్ని  భూములుండేవి.  
సోనాజీ కాస్త సోమాజి  అయింది.  గూడ అంటే చిన్న గూడెం లేదా ప్రాంతం అని అర్ధం. రెండు క‌లిపి సోమాజిగూడ అయ్యింది.

మాసబ్ ట్యాంక్:-
6వ కుతుబ్ షాహ్ భార్య హ‌యత్  భ‌క్షి భేగంను మాసాహెబా అని  పిలిచే వారు. మాసాహెబా పల్లె భూములకు సాగు నీరు ఇవ్వడానికి  ఒక ట్యాంక్  నిర్మించింది.  
ఆ ట్యాంక్ పేరు మాసాహెబా తలాబ్ అని పిలిచేవారు. చివరకు  ఆ పేరు మాసబ్ ట్యాంక్ అయింది.

హైదరాబాద్:-
కులీ కుతుబ్ షా భార్య భాగమతి  వివాహం తర్వాత తన పేరుని  హైదర్ మహల్ గా మార్చుకున్నారు. హైదర్ మహల్  అంటే హైద్రా నగరం అని అర్ధం. తర్వాత ఆ పేరు మీద  హైదరాబాద్ గా మారింది.

మలక్ పేట్:-
గోల్కొండ రాజు అబ్దుల్ కుతుబ్ షా  యొక్క సేవకుడు మాలిక్ యాకుబ్  పేరు  మీదగా ఈ ప్రదేశానికి మలక్ పేట్ అనే పేరు వచ్చింది.

బషీర్ బాగ్:-
బసిరుద్దౌలాకు హైద్రాబాద్ లో ఒక ప్యాలెస్ ఉండేది. ఆ ప్యాలెస్  దగ్గర  పెద్ద గార్డెన్ ఉండేది. బసిరుద్దౌలా  పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్ బాగ్  అనే  పేరు వచ్చింది. బాగ్ అంటే  గార్డెన్ అని అర్ధం.

ఫలక్ నుమా:-
ఫలక్ అంటే ఆకాశం, నామ అంటే  అద్దం. ఈ ప్రదేశం అంతా  కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది. కాబట్టి ఆకాశానికి అద్దం అనే అర్థం  వచ్చేలా ఫలక్ నామ అని పేరు  పెట్టారు. ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది.

సరూర్ నగర్:-
రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు నాలుగు మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.

లంగర్ హౌజ్:-
గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ మారింది. 
గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.

చెంచల్‌ గూడ:-
చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.

కార్వాన్:-
ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.

కవాడిగూడ:-
ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.

దోమలగూడ:-
దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ. పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.

బేగం బజారు:-
హైదరాబాద్ వ్యాపారుల పై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.

అఫ్జల్ గంజ్:-
ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది.

హైదర్ గూడ:-
మొదటి తాలుఖ్ దార్ (జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.

తార్నాక:-
తార్నాక అసలు పేరు తార్ నాకా. తార్ అంటే ముళ్లకంచె. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.

శాలి బండ:-
శాలి బండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు. కాలక్రమంలో అది శాలిబండగా మారింది.

హబ్సిగూడ:- 
నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను పిలుస్తున్నారు.

మదీనా:-
ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.

చిక్కడపల్లి:-
చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది. బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.

నౌబత్ పహాడ్:-
నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.

బాగ్‌లింగంపల్లి:-
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.

అడిక్‌మెట్:- 
అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.

మీరాలంమండి:-
సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్.

బార్కాస్:-
నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్ అని పిలుస్తున్నారు.

తాడబండ్:-
తాడబండ్ అసలు పేరు తాడ్-బన్. తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్‌బండ్‌ గా మారిపోయింది.

ఎర్రమంజిల్‌:-
ఎర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్‌ గా స్థిరపడింది. ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.

కాచిగూడ:-
కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది.

లాడ్‌ బజార్:-
మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్‌ బజార్ లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.

ముషీరాబాద్:-
హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785 లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.

ఫతే మైదాన్:-
ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు. 
ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్. ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.

పబ్లిక్ గార్డెన్స్:-
పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు.. బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్.

చాదర్ ఘాట్:-
మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.

ఆస్మాన్ గఢ్:-
1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్  పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది.

ఉమ్దా బజార్:-
నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.

గౌలిగూడ:-
గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.

లల్లాగూడ:-
రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది. 

సుల్తాన్ బజార్:-
1933 కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, 
ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.

రికాబ్ గంజ్:-
రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్. మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.

డబిర్ పురా:-
నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి. డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.

అంబర్‌ పేట:-
అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్‌ పేటగా స్థిరపడిపోయింది.

చాంద్రాయణ గుట్ట:-
చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణ గుట్టగా మారిపోయింది.

చిలకలగూడ:-
చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకలగూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి.

మంగళ్ హాట్:-
మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్. మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.

సైదాబాద్:-
1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.

టప్పాచబుత్ర:-
టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.

తుకారాం గేట్:-
లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు.ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.

యాఖుత్ పురా:- 
హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు.

No comments:

Post a Comment