Monday, August 10, 2026

 *శ్రీకృష్ణుడి కోరికపై మయుడు ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభ ముహూర్తాన పాండవులు అందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభలకంటే, బ్రహ్మసభ కంటే మయనిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో పాండురాజాదులు యమసభలో ఉన్నారని, హరిశ్చంద్రుడు ఇంద్ర సభలో ఉన్నాడనీ నారదుడు ప్రస్తావించాడు.*

*పరమ ధర్మాత్ముడైన పాండురాజు యమ సభలో ఉండడానికీ, హరిశ్చంద్రుడు ఇంద్ర సభలో ఉండడానికీ కారణమేమిటని ధర్మరాజు నారదుని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పసాగాడు.*

*త్రిశంకు మహారాజు కుమారుడైన హరిశ్చంద్రుడు పేరుకెక్కిన సత్యసంధుడు. యజ్ఞంలో, ధైర్యంలో, శాస్త్రంలో, ధర్మంలో, ఎంతో ఆసక్తి కలవాడు. అయోధ్యా నగరానికి ప్రభువు. సూర్యవంశం మొత్తానికి అలంకారమైనవాడు.*

*విద్యా పరమార్థాన్ని తెలుసుకున్నవాడు. అన్ని లోకాలకూ వ్యాపించిన కీర్తి కలవాడు. సూర్య వంశాన్ని ప్రకాశింపజేసే హరిశ్చంద్ర మహారాజు, జయించాలన్న స్వభావంతో, సప్త ద్వీపాలను తన బాహుబలంతో జయించాడు. శత్రువులెవరూ మిగలకుండా నేలమీది రాజులంతా తన ఆజ్ఞ మీరకుండా చేశాడు. శాశ్వత వైభవంతో తన సామ్రాజ్యమంతా ప్రకాశించేటట్లు, రాజసూయ మహాయాగం చేశాడు. యాజ్ఞికులందరికీ ఇవ్వదగిన దక్షిణల కంటే ఐదింతలిచ్చి పూజించాడు. బ్రాహ్మణోత్తముల కోర్కెలన్నీ భక్తితో తీర్చాడు.*

*హరిశ్చంద్రుడు కావించిన గొప్ప ధన దానాలతో లెస్సగా తృప్తి పొందిన బ్రాహ్మణులు మిక్కిలి సంతోషంతో, “రాజులందరిలో నీవు లోకాతీత తేజస్సుతో, ధర్మంతో, ప్రకాశించు” అని ఆశీర్వదించారు. హరిశ్చంద్రుడు బ్రాహ్మణాశీర్వచనం వల్ల అందరు రాజులకంటే అధికుడై, రాజసూయ మహాయజ్ఞం చేయడం వల్ల దేవేంద్రలోకాన్ని పొందాడు. హరిశ్చంద్రునికి ఆ మహిమాతిశయం అంతా రాజసూయ మహాయాగ కారణంగానే వచ్చిందని గ్రహించి యమసభలో రాజులందరితో ఉన్న మీ తండ్రి యైన పాండురాజు ఇలా అన్నాడు.*

*రాజసూయ యాగం చేసిన రాజులంతా హరిశ్చంద్రునిలా తమ కోర్కెలు తీర్చుకుంటూ దేవతల పూజలు అందుకుంటూ దేవేంద్రుని దగ్గర ఉంటారు. కాబట్టి మునీంద్రా! మీరు మానవ లోకానికి వెళ్ళి నేను యమసభలో ఉన్న విషయాన్ని, రాజసూయ మహాయాగం చేసిన పుణ్యాత్ములంతా ఇంద్రసభలో ఉన్న విషయాన్ని, కీర్తిసంపన్నుడైన  కుమారుడు ధర్మరాజుకు చెప్పండి ఆ యాగం చేయడానికి ఉచితరీతిని అతణ్ణి ఆజ్ఞాపించండి. ఆవిధంగా ధర్మరాజు రాజసూయం చేస్తే నాకు పితృ పితామహ సమూహంతో ఇంద్రలోక సుఖప్రాప్తి కలుగుతుంది’ అని పాండురాజు చెప్పిన మాట విని నీకు తెలియజేయ్యాలన్న కుతూహలంతో ఇక్కడికి వచ్చాను. మహా సంపన్నుడవైన ధర్మరాజా! న్యాయమార్గంలో రాజసూయం చేసి నీ పితృదేవతా సమూహం దేవతాసమూహంచే శీఘ్రమే పూజలందుకొనేటట్లు చెయ్యి” అన్న నారదుని వచనములు విన్న ధర్మరాజు రాజసూయం చేయటానికి పూనుకున్నాడు.*

*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*
🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁

No comments:

Post a Comment