Thursday, March 30, 2023

నమస్కారం అనేది మనిషి యొక్క సంస్కారం నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం మానవుని సంస్కారం. అది ఎలాగో తెలుసుకుందాం.

 నమస్కారం అనేది మనిషి యొక్క సంస్కారం నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం మానవుని సంస్కారం. అది ఎలాగో తెలుసుకుందాం.

మనం తోటివారికి నమస్కరించేటప్పుడు అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ప్రతీకగా భావం వస్తుంది.
 ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి 

సంస్కృతీసంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది ఒక ప్రత్యేక శైలి. ఈ పలకరింపు శాస్త్రీయతతో మేళవించిన సంప్రదాయం. పెద్దవారిని చూడగానే చిన్నవారు చేతులు జోడించి నమస్కరించడం భారతీయులు చేసే పని. ‘నమస్కారం’లో ‘నమ’ అంటే వంగి వుండటం. అంటే.. పెద్దల ఎదుట అహంకరించకుండా వుండట.
అసలు ఎందుకు నమస్కరించాలి..? ప్రస్తుతరోజుల్లో ప్రతిఒక్కరు పలకరించుకునేవిధంగా ‘హాయ్’, ‘హలో’ అని చెప్పుకుంటే సరిపోతుంది కదా అనే సందేహం కలగవచ్చు. కానీ.. అలా చేయకుండా నమస్కారం కచ్చితంగా చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకు బలమైన కారణం కూడా వుంది. మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం. ధన, ఋణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం (సర్క్యూట్) పూర్తి అవుతుంది. మనిషి శరీరంలో అటువంటి ధృవాలు చేతి వ్రేళ్ళు. వాటిని కలపటం వల్ల సర్క్యూట్ పూర్తి అవుతుంది. విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతుంది. రెండు ఘటాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దానిమీద ఉంటుంది. ఎక్కువ శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటంలో ప్రకంపనలు కలుగుతాయి. అవి  సరిగా మేలు కలిగించే విధంగా ఉండటానికి చేసిన ఏర్పాటు ఈ నమస్కారం.

నమస్కరించటంలో కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది. దేవతలకు రెండు చేతులు సహస్రారంపై జోడించాలి. పెద్దలకు నుదుటిపై అంజలి ఘటించాలి. సాటి వారికి అభివాదం చేయటానికి రెండు చేతులను హృదయ స్థానంలో జోడించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆ స్థాయిలో గౌరవించదగిన వారింకెవరైనా వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. దీనినే దండప్రణామమ్ అని కూడా అంటారు. అంటే, కర్ర లాగా నేలమీద పడి ,ఎనిమిది అవయవాలు  భూమిని తగిలేట్టుగా నమస్కరించటం. స్త్రీలు పంచాంగాలతో చేస్తే సరి పోతుంది. స్త్రీల ఉదరం, వక్షస్థలం మనిషి అస్తిత్వానికి, పోషణకి నిలయాలు కనుక అవి నేలకు తగులరాదు. నిజానికి ఇలా చేయటం వల్ల నమస్కరించిన వ్యక్తికి ఎదుటివారి నుండి శక్తి ప్రసారం జరుగుతుంది.

నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు. అందుకు ఆయన కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించాలన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్‌ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు.
ఒక మహారాజు అడవి మార్గంలో వెలుతుండగా ఆ దారిలో ఒక బౌద్ధ సన్యాసి ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి 'ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?' అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు ఆ తర్వాత రోజు మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడు పోయాయి కాని మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
అప్పుడు ఆ రాజు 'మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా (ఉండదు) ఇవ్వరు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?' అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది. 

యోగశాస్త్రంలో 'నమస్కారాసనం' ప్రసక్తి ఉంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య. రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.'ఎదిగేకొద్దీ ఒదగాలి' అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు.
ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది. శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని, పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు.అందుకే 'అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్యరహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో,మనలో ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి.మానవుని సంస్కారం నమస్కారం కాబట్టి ఈ సమాజంలో అందరిని( పెద్దలను ) గౌరవిద్ధాం ఆదర్షంగా నిలుద్ధాం.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment