Tuesday, October 19, 2021

నేటి జీవిత సత్యం. *దైవ ఆన్వేషణ*

నేటి జీవిత సత్యం. దైవ ఆన్వేషణ
➖➖➖
ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు,
అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు...
కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు, ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు...
అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది...
స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉంటాడు? అని అడిగాడు...
అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ..నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన... అంటూ ఒక మహా వృక్షం చూపించి అది ఏమిటి నాయన అన్నాడు...
అది వృక్షం...
ఓహో వృక్షమా! ఎలా వచ్చింది?
విత్తనం ద్వార వచ్చింది స్వామి
సరే అక్కడ పలుగు ఉంది.
తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు.
ఎందుకు స్వామి? మహావృక్షం కదా! త్రవ్వితే చచ్చిపోతుంది,
చచ్చిపోతుంది కాని ఆ విత్తనం ఎలా ఉందొ చూడాలని ఉంది...
అయ్యో స్వామి! అదెలా సాధ్యం అవుతుంది?
విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు విత్తనం చూడలేమా?
విత్తనమే చెట్టు...
చెట్టుకి విత్తనానికి తేడా లేదు, విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా!!!
ఇదే నాయన నీ సందేహానికి సమాధానం...
అదెలా స్వామి?
విత్తనం అనేది పరమాత్మ
ఆ పరమాత్మే వృక్షం.
అనగా సృష్టి , సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు, ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు...
సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము...
మరి విగ్రహారాధన ఎందుకు స్వామి?
పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి... సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు? ఏమి అర్థం కాదు.
అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు.
ధ్యానం నిలబడుతుంది, అంతేతప్ప శూన్యం లోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు.
అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు.
కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనిగ్రహించాడు, అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు, సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు.
సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది.
భగవంతుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు.
ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు, సాధ్యం కాదు, అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు.
అది ఒక మార్గం, దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు...
స్వామి! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు?
భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు...
ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు, మరొకడు గుడి కట్టాడు.
మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు, మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు.
భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడు కోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం...
పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడా లేదు, ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.. నగలు పెట్టినవాడిలో ఉన్నాడు.
దోచుకెళ్ళినవాడిలోనూ ఉన్నాడు, తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు…

సేకరణ. ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment