ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అధ్యాయము 34
భగవాన్ ఉవాచ తరువాయి భాగం
భగవాన్ కోరికలు లేకుండా ఉండటానికి ఒక సులువైన దారి చెప్పారు . *ఈ కోర్కెలు ఎవరికి ? అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానంగా నాకు అని కోరుకునేవాడికి వస్తుందని వెంటనే నేనెవరు ? అని ప్రశ్నించుకోమన్నారు . తద్వారా ఆ కోర్కెలకు మూలమైన ' నేను ' పడిపోతుందని చెప్పారు . మన దేహంలో కుడివైపున హృదయం వుంటుందని అదే ఆత్మ స్థానమని ఇక్కడినుండే నేను అను తలంపు మొట్ట మొదటగా పుట్టి అది శరీరంలోకి వచ్చి తద్వారా శరీరమే తానని భ్రాంతి కల్పించి సంసారచక్రంలో తగుల్కొని పరిభ్రమిస్తూ ఉంటుంది . ఇదే నేను గాఢ నిద్రలో తిరిగి పుట్టుక స్థానానికి వెళుతుందని భగవాన్ చెప్పారు* . కావున అది రాకపోకలతో కలిగి ఉండేది . గాఢ నిద్రలో ఏది తప్పో , ఏది ఒప్పో తెలియడం లేదు . కావున భగవాన్ చెప్పేదేమనగా మెలకువలో నిద్రపోవటం అభ్యాసం చేయమని అది ఆత్మలో నిలకడ చెందినపుడు మాత్రం మరియు చుట్టుప్రక్కలను మరిచినపుడు మాత్రము సాధ్యమవుతుందని భగవాన్ చెప్పినారు . కావున భగవాన్ చెప్పినది ' ఈ శరీరమే నేను అనే భావన అజ్ఞానమని ఈ శరీరము ఆత్మకంటే భిన్నముకాదని ఆత్మేనను ఎరుక ఉండుటయే జ్ఞానమని భగవాన్ బోధించినారు .
భగవాన్ కర్మను గురించి ఈ విధముగా బోధించినారు . కర్మ అంటే ఒక పని . కర్మ కర్త అంటే పనిని చేసేవాడు . అలాగే కర్మ ఫలభోక్త అంటే ఆ పనికి కలిగే ఫలితాన్ని అనుభవించేవా/డు . ఈ పనిని నేను చేశాను అనే భావం ఉన్నంతవరకు ఆ చేసిన పనికి వచ్చిన ఫలితమును అతడు అనుభవించవలెను . ఇదే ఆ పనిని చేసినది నేను కాదు అనే సంకల్పమున్న వారికి ఆ కర్మ ఫలితం తనకు అంటదు . కావు *భగవాన్ చెప్పినది కర్మ దెవరు ? అని ప్రశ్నించుకోమన్నారు . నేను కర్తను కాదు . ఒక శక్తి తన ద్వారా ఆ కర్మను చేస్తున్నదని గ్రహించినప్పుడు ఆ కర్మ ఎంతటిదైనను ఆ కర్త అయిన జ్ఞాని నిశ్చలుడై ఉండును . దాని ఫలితము అతనిని తాకదు* . కావున భగవాన్ చెప్పినది తాను కర్తకాదు అనే జ్ఞానము కలవాడే నిజమైన సన్యాసి అని చెప్పినారు . మనస్సు , వాక్కు మరియు శరీరము ఈ మూడింటిని కర్మ త్రయములని ఈ మూడింటితో చేసే మూడు కర్మలు వాటి కర్తృత్వము అనగా కర్మ ఫలములు వదులు కున్నప్పుడు అనగా నేను చేస్తున్నాను అనే భావము కూడా వదిలినప్పుడు వాటి ఫలితము అంటదని భగవాన్ చెప్పినారు . భగవాన్ ఎల్లప్పుడు మౌనముగా ఉండేవారు . మౌనమే ఆత్మకు మరో పేరని చెప్పేవారు . మరియు భగవంతుడు , గురువు మరియు ఆత్మ ముగ్గురు ఒక్కటే అని కూడా చెప్తూ ఉండేవారు . *మనుష్యులు ఎల్లప్పుడు ఏవేవో ఊహిస్తూ తన పథకాలను ఒక ప్లానులా వేస్తూ ఉంటాడు . కాని భగవాన్ వేసిన ప్లాను ప్రకారము ఈ విశ్వమంతా నడుస్తుందని ఆ ప్లాను ప్రకారమే జరుగుతుందని భగవాన్ సూచిస్తూ ఉండేవారు . కావున అందరిని ఆ దైవాన్ని శరణువేడమని చెప్పేవారు* .
భగవాన్ సుఖాన్ని గురించి ప్రస్తావిస్తూ అసలు *సుఖమంటే ఆత్మ స్వరూపమని సుఖము మరియు ఆత్మ వేరు వేరు కాదని అవి ఒక్కటే అని చెప్పేవారు . మనస్సు ఆత్మవైపుకు తిరిగినపుడది ఆత్మ సుఖాన్ని పొందుతుందని అదే మనస్సు బాహ్యానికి వచ్చినప్పుడు దుఃఖానికి గురి అవుతుందని భగవాన్ సూచించారు* . ప్రపంచ వస్తువులలో అసలు సుఖమనేది లేదని చెప్పారు . దీనిని బట్టి మనస్సు ఎప్పుడు లోపలా బైట తిరుగుతుందని ఆ మనస్సును లోపలే ఉంచి బైటకు రానీయకుండా ఆత్మలోనే ఉండేటట్లు చేయుటయే సాధన అని భగవాన్ గొప్ప రహస్యాన్ని బోధించారు . సాధకుడు అహం వృత్తిని పట్టుకునే ఆత్మను చేరుతారని భగవాన్ చెప్పినారు . లోపల ఉన్న మనస్సు శుద్ధ మనస్సని అంటారు . భగవాన్ పనిచేసేవాళ్ళ గురించి ఒక పనిని ఎగొట్టే వారి గురించి ఒక రహస్యాన్ని బోధించారు . అదేమనగా *పనిచేస్తాను చెయ్యను అని ముందే అనుకోవద్దని సూచించారు . ఎందుకంటే “ నీకు పనిచేయవలసిన విధి లేకపోతే నీవు పనికై ప్రయత్నించిన దొరకదని అలాగే పనిచేయవలసిన విధి నీకు ఉంటే దానిని నీవు తప్పించుకోవాలని చూసినా ఆ పని నీకై వేటాడి నీచేత బలవంతముగానైనా చేయిస్తుందని " భగవాన్ చెప్పినారు* . ఆహా ! ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తాను ఉద్యోగము చేయుచున్న సమయమున రమణుని ఈ మాటలను గుర్తుంచుకుని ఉంటే ఆ ఉద్యోగికి తప్పకుండా ధైర్యంతోపాటు శాంతి కూడా లభ్యమవుతాయి .
కావున మనము కూడా భగవాన్ చెప్పినట్లుగా కోరికలు లేకుండా ఉండేందుకు , మెలకువలో నిద్రపోవుట అనే అభ్యాసాన్ని చేయుటకు , *ఏ కర్మనైనా చేసేది మనము కాదని ఒక శక్తి మనద్వారా చేయిస్తుందని , మనస్సును ఎల్లప్పుడు మనం అంతర్ముఖం చేసి ఆత్మ సుఖాన్ని పొందటానికి ప్రయత్నించవలెనని బాహ్య వస్తువులలో ఏదీ సుఖము కాదని , మనస్సును బైటకి పోనీయకుండా లోపలే ఉండేటట్లు ప్రయత్నిద్దాం* . మరియు ఏ పనైనా వచ్చినా దానిని తప్పించుకొనుటకు ప్రయత్నించకుండా భగవాన్ పనిని గురించి చెప్పిన బోధలను గుర్తుంచుకొని జీవనం గడుపుదాం . మరి ఇన్ని అభ్యాసాలు చేయటానికి సామాన్యమైన మానవులమైన మనము మనకున్న శక్తి సామర్ధ్యములు చాలవు కనుక ఆ భగవాన్ రమణుని శరణువేడుదాం .
ఓ అరుణాచల శివా నీవే మాకు శరణాగతి .
అరుణాచల శివ.
No comments:
Post a Comment