Saturday, July 5, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
            *భ్రమల వల్లే బాధలు*
              
*మనిషి శాశ్వతమనుకొని సుఖసారమనుకొని ప్రీతి పెంచుకుంటున్న జీవితంపై జగద్గురువులైన శంకరాచార్యులు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు…* 

*కారణజన్ములుగా ఈ భువిపైన అవతరించిన ఆదిశంకరులు మానవ శ్రేయస్సుకు ఉపయుక్తమైన ఉపదేశాలను అమృతగుళికలుగా అందజేశారు.*

*లౌకికమైన లంపటంలో కూరుకుపోయి ఈలోకంలో స్థిరంగా ఏదో వేల సంవత్సరాలు బతికేస్తామన్న పిచ్చి భ్రమలతో అతి ప్రణాళికలు రచించుకుంటూ మూర్ఖులుగా మసలుకుంటున్నా మానవులకు ఆయన హెచ్చరికలు చేశారు. కొన్నాళ్లు యాత్రికుల్లా గడపడానికి ఈలోకంలోకి అడుగుపెట్టామన్న సత్యాన్ని మరచిపోయి, స్థిరాసనాలు వేసుకునేందుకు ఆస్తులు కూడబెట్టుకునేందుకు తాపత్రపడుతున్నాం. తుదకు మనమూ వెళ్లిపోయే రోజొకటి వస్తుందని తెలుసుకోలేకపోతున్నాం. తామరాకుపై* *ఉన్న నీటిబిందువులా మనిషి జీవితం కూడా అతిచంచలమైంది. అయినా ఈలోకంలో మనుష్యులు రోగాలతో బాధపడుతూ, దేహాభిమానాన్ని విడువక, దుఃఖంతో చిక్కుకొని ఉంటారు. ఇలా మనిషికి శాశ్వత సుఖమే లేదని తెలుసుకోమంటున్నారు శంకరాచార్యులు.*

*ఈ సత్యం మనల్ని నిరాశలోకి నెట్టేసేందుకు చెప్పింది కాదు. వాస్తవమేంటంటే తెలుసుకొని మసలుకొమ్మని చేస్తున్న హెచ్చరిక.*

*మనం అనవసరంగా ఈ జీవితంపై పెంచుకుంటున్న మమకారం ఈ శరీర సుఖాలకోసం పడుకున్న తాపత్రయం తగ్గించుకోమనే చెప్తున్నారు. ఏ సుఖమూ శాశ్వతం కాదనీ, ఏ కష్టమూ కలకాలం ఉండదనీ, మన మనస్సు అర్థం చేసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వేగానికి లోను కాదు. మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయలేదు. అందుకే భగవాన్‌ శ్రీరామకృష్ణులు అనేవారు ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం చేసుకోవాలి.*

*మరణించాక చేసేదేమీ లేదు. స్వగ్రామం నుంచి సమీప నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా, ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికి ఈలోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడటానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకుని ఇది మా తోట. ఇది మా తటాకం అని ఆ వనమంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని, తోటమాలిని పని నుంచి తొలగించి వేస్తే, మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. పుత్రమిత్ర బంధువ్ఞలంతా సహచరులేకానీ శాశ్వతం కాదనీ ఇల్లూ, వాకిలీ, ఆస్తి అంతస్తులంతా మనం అద్దెకు తీసుకున్నా వసతి సౌకర్యమే కానీ వాటికి మనం సంపూర్ణ యజమానులం కామనీ, వెంటవచ్చేవి కావనీ గుర్తుంచు కోవాలి. ఈ మర్మం తెలియకే మనలో చాలామంది జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారు. వేదాంతంలో తామరాకు, నీటిబిందువ్ఞల సహచర్యం గురించి అద్భుతంగా వివరిస్తారు.*

*నీటిలోనే పుట్టి పెరిగి, నీటితోనే నిరంతరం సంబంధం కలిగి ఉంటుంది తామరాకు. కానీ ఆ నీటితో మమేకం కాకుండా, తడిసిపోకుండా, నిర్మలంగా తేలియాడుతుంది. అలాగే స్థితప్రజ్ఞుడు, జ్ఞాన యోగి, గుణాతీతుడు అయిన వ్యక్తి కూడా ఈ సంసారంలో ఉంటున్నా దానికి బందీ కాడు. చలించడు. ప్రయత్నం చేస్తే అందరికీ ఈ స్థితి సాధ్యమే. ఆధునిక సమాజంలో తీరికలేని వ్యవహారాలు మనల్ని మరింత అహంకార పూరితుల్ని చేస్తున్నాయి. మనం లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో ఈ పిల్లలేమైపోతారో అన్న ఆందోళనలో పడేస్తున్నాయి. ఈ ప్రపంచం స్తంభించి ఈలోకానికి ఏ ఒక్కరి అవసరమూ లేదు.*

*మనం కాకపోతే ఇంకొకరు ఆ పాత్రను పోషిస్తూనే ఉంటారు. జీవితం మూన్నాళ్ల ముచ్చటే కదా. అంత మాత్రానికి వేటినీ అనుభవించకుండా, వృధాగా గడిపేయడం ఎందుకు? తనివితీరా సుఖసంపదల్లో తేలిపోదాం. సంబరాలు చేసుకుందాం అనే వితండ వాదులూ లోకంలో ఉంటారు. కానీ ఈభౌతిక సుఖకాంక్ష అంత త్వరగా వదిలేది కాదు. ఎంత తీర్చుకున్నా మరింత కావాలనిపిస్తుంది. చివరకు ఈ మనస్సు ఆ విషయ వాసనల రంగులో మునిగి ముద్దయిపోతుంది. అదే సంస్కారాలతో, కోర్కెలపుట్టతో మరోజన్మనెత్తుతుంది.*

*నెయ్యితో నిప్పును ఆర్పడం ఎంత అమాయకత్వమో, కోర్కెలను తీర్చుకోవడం ద్వారా వాటిని సంతృప్తిపరచాలను కోవడం కూడా అంతే అమాయకత్వం.*

*ఈ చిన్న జీవితంలో ఇతర జీవుల్లా మనం కూడా సుఖ లాలసతో దేహాభిమానానికే పరిమితమైతే, కొడుకు యౌవనాన్ని తీసుకొని అనుభవించినా సంతృప్తి చెందని యయాతి మహారాజులా మిగిలిపోతాం. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వైరాగ్య భావన పొడచూపుతూనే ఉంటుంది. కానీ అది స్మశాన వైరాగ్యంలా కొంతసేపే. దగ్గరవారు కన్నుమూసినపుడో కష్టాలు కమ్మేసినపుడో కాస్తంత వైరాగ్యపు మాట మాట్లాడేస్తారు. తరువాత యధాస్థితి. సంసారంలో మునిగితేలుతున్న గృహస్థులకు ఆత్మతత్వం కొంచెం కూడా తెలియదు. పశువులు, భార్యలు, బిడ్డలు, చుట్టాలు, శరీరం నిజమని నమ్ముకొని కాపురాలు సాగిస్తూ, సాగిస్తూ కడకు కన్నుమూసి కాటిపాలవుతారు.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment