Thursday, February 20, 2025

 Vedantha panchadasi:
అన్యథా యాజ్ఞవల్కాదేరాచార్యత్వం న సంభవేత్ ౹
ద్వైతదృష్టావవిద్వత్తా ద్వైతాదృష్టౌ న వాగ్వదేత్ ౹౹184౹౹
నిర్వికల్ప సమాధౌ తు ద్వైతాదర్శన హేతుతః ౹
సైవాపరోక్షవిద్యేతి చేత్సుషుప్తి స్తథా న కిం 
౹౹185౹౹
ఆత్మతత్త్వం న జానాతి సుప్తో యది తదా త్వయా ౹
ఆత్మధీరేవ విద్యేతి వాచ్యం న ద్వైతవిస్మృతి 
౹౹186౹౹
అట్లు కానిచో యజ్ఞవల్కాదులకు ఆచార్యత్వము సంభవింపదు. ద్వైతం లేక వున్న సుషుప్తి,నిద్ర కూడా అపరోక్షజ్ఞానంకావలెను.

ఉభయం మిలితం విద్యా యది తర్హి ఘటాదయ ౹
అర్థ విద్యా భాజినః స్యుః సకలద్వైత విస్మృతేః 
౹౹187౹౹
మశకధ్వని ముఖ్యానాం విక్షేపాణాం బహుత్వతః ౹
తవ విద్యా తథా న స్యాద్ఘటాదీనాం యథా దృఢా
౹౹188౹౹
ఆత్మాధీ రేవ విద్యేతి యది తర్హి సుఖీభవ ౹
దుష్టచిత్తం నిరుంధ్యాచ్ఛేన్నిరున్ధి త్వం యథా సుఖమ్ 
౹౹189౹౹
తదిష్ట మేష్టవ్య మాయామయత్వస్య సమీక్షణాత్ ౹
ఇచ్ఛన్నప్యజ్ఞవన్నేచ్ఛే త్కి మిచ్ఛన్నితి హి శ్రుతమ్ 
౹౹190౹౹
కుండ వంటి జడాలకు ద్వైతం లేదుకనుక సగం జ్ఞానం కలిగినట్లే.నీవు విక్షేపములచే దృఢము కాదు.చిత్తనిరోధము మాకును ఇష్టమే,ఇచ్ఛా రహితమగును.

వ్యాఖ్య:- ఈ శ్రుతికి విషయం సుషుప్తి అని,ముక్తి అని అంగీకరించకపోతే బాధక దోషం వస్తుందని అంటున్నారు.

పై శ్రుతిని,లేదా సూత్రాన్ని సుషుప్తి విషయకమనిగాని, ముక్తి విషయకమని గాని అంగీకరిచకపోతే యజ్ఞవల్కాది బుషులకు ఆచార్యకత్వం లేకుండా పోతుంది.
వారు ద్వైతమును చూచినచో అజ్ఞానులగుదురు.వారిని బ్రహ్మవిద్యా గురువులుగా అంగీకరించటానికి వీలుండదు. 
అంటే -  ఇక్కడ ద్వైతాన్ని చూస్తున్నారని అంటే అద్వైతమనేది లేకుండా పోతుంది.కాబట్టి అద్వైతానికి ఆచార్యకత్వం లేకుండాపోతుంది.

ద్వైతాన్ని చూడడం లేదని అంటే శిష్యునికి బోధించటానికి తగిన వాణి - వాక్కుకు ప్రవృత్తి లేకుండా పోతుంది.అంటే -
చూడనిచో మాటలాడక ఉండవలెను - కారణమేమంటే ,
వాగీంద్రయము నుండి శబ్ధంకూడా వెలువడదు కాబట్టి 
అద్వైతబోధకే అవకాశం ఉండదు.ఇందువల్ల 
బ్రహ్మవిద్యా సంప్రదాయానికే నష్టం వాటిల్లుతుంది.

యజ్ఞవల్క్యాదులు చెప్పిన విద్యారూపం,ద్వైతాభాస ఇంకా ఉన్నందున,అపరోక్షమైనది కాదు;
నిర్వికల్ప సమాధిలో ద్వైతభావం ఉండనందున అదే సరియైన అపరోక్షవిద్య , అనే ఆ శంకకు సమాధానం -

నిర్వికల్ప సమాధియందు ద్వైతభావం ఉండదు కాబట్టి అదే అపరోక్షవిద్య అని అనేటట్లయితే,
సుషుప్తి - నిద్ర -లో సైతం ద్వైతభావం ఉండదు కాబట్టి నిద్రను కూడా అపరోక్షవిద్య అనాలి,దానినే 
నిర్వాకల్ప సమాధి అని కూడా అనాల్సి వస్తుంది.
అట్లా అంటే అతివ్యాప్తిదోషం వస్తుంది.ఆ దోష నివారణకై చెపుతున్నారు -

నిద్రితుడు ఆత్మతత్త్వము నెరుగడనినచో, నీవు ఆత్మబోధయే జ్ఞానమని చెప్పవలెనుకాని ద్వైతవిస్మరణము జ్ఞానమని కాదు కదా ! 
సుషుప్తిలో ఆత్మతత్త్వాన్ని ఎవ్వడూ గమనించటంలేదు, కాబట్టి సుషుప్తిని అపరోక్షజ్ఞానం అనటానికి వీలులేదు.అటువంటప్పుడు ఆత్మజ్ఞానాన్నే విద్య అనాలి. అంతే తప్ప ద్వైతదర్శనం లేకపోవటాన్నే విద్య అని అనకూడదు.

"ద్వైతదర్శనం లేకపోవటం, ఆత్మజ్ఞానం ఉండడం ఈ రెండూ కలిసి ఉన్నట్టి రూపాన్నే  
విద్య అనాలి; " - అని అనవచ్చుకదా !  అనే శంకకు సమాధానం -

ద్వైతం కనిపించకపోవటం, ఆత్మజ్ఞానం ఉండటం అనే ఈ రెండూ కలిస్తే బ్రహ్మవిద్య అవుతుంది అంటే ,
కుండ వంటి జడపదార్థాలకు ద్వైతభావము లేదు కాబట్టి ఘటాది జడాలకు కూడా అర్థజ్ఞానం - సగం జ్ఞానము కలిగినట్లే.
వీటికి ఏ మాత్రమూ ద్వైతభావ ప్రతీతి ఉండదు కాబట్టి వీటికి కూడా విద్య ఉన్నదని అంగీకరించాల్సి వస్తుంది.
పైగా ,సమాధిలో ఉండేవానికి అర్థవిద్యాతత్త్వం కూడా లభించదని ,
వేళాకోళంగా అంటున్నారు.

ఘటాదుల్లో ఎంతటి దృఢమైన ద్వైతవిస్మృతి ఉంటుందో అంతటి దృఢమైన ద్వైత విస్మరణం మీరు చెప్పే సమాధిలో ఉండే వానికి ఉండదు.ఎందుచేతనంటే ఆ పురుషునికి దోమలు,ఈగలు మొదలైనవాటి శబ్దము వలన విక్షేపములనేకముగా ఉండును.ఘటాదులకు అదికూడా ఉండదు కదా.నీ జ్ఞానము ఘటాదుల జ్ఞానము వలె దృఢమైనది కాదు. (అపహాస్యముగా చెప్పబడినది).

ఆత్మజ్ఞానమే విద్యాస్వరూపమా ?ద్వైతవిస్మరణం కాదంటారా ? అంటే -

నీవు ఆత్మజ్ఞానమే "విద్య" అనే సిద్ధాంతమును అంగీకరించటం,
ఆత్మబోధయే జ్ఞానమనడం  ఆనందకరం. 
సుఖముగా చిరకాలము వర్థిల్లు.
అట్లా అనటం మాకూ సమ్మతమే ! అత్మజ్ఞానాన్నే విద్యగా అంగీకరించాం.

కానీ నిర్మలంగా ఉండని చిత్తంలో జ్ఞానం కలగదు, అందుచేత దోషపరిహారం కోసం చిత్తవృత్తి నిరోధరూపమైన 
పనులు చేయాల్సిందే !
అటువంటి అభ్యాసం,హాయిగా 
తప్పకుండా చెయ్యి ! 
చిత్తవృత్తిని నిరోధించు !
ఆత్మబోధకై చిత్తవృత్తిని యథేచ్చముగా నిరోధింపుము.

చిత్తవృత్తి నిరోధించుటమనేది మాకూ అంగీకారమే !
నిరోధించి చిత్తదోషమును తొలగించినచో మనం కోరుకునే అద్వితీయ బ్రహ్మజ్ఞానానికి అవసరమైనట్టి,ఈ జగత్తు యొక్క మాయామయ స్వరూపం బాగా తెలుస్తుంది. జగన్మాయామయత్వము చక్కగా గోచరించును కనుక ఇచ్ఛ ఉన్నా, అజ్ఞానిలాగా ఇచ్ఛచేయడు.

"కిమిచ్ఛన్ కస్య కామాయ" - అనే శాట్యాయనీయ శ్రుతివచనాన్ని చెప్పారు .
జ్ఞాని ఇచ్ఛించినను అజ్ఞాని యొక్క ఇచ్ఛల వలె బంధ కారణములగునట్లు ఇచ్ఛింపడని అర్థము.

రాగో లింగమబోధస్య సంతు రాగాదయో బుధే ౹
ఇతి శాస్త్రద్వయం సార్థమేవం సత్యవిరోధతః 
౹౹191౹౹
జగన్మిథ్యత్వవత్స్వాత్మా  సఙ్గత్వస్య సంగతత్వస్య సమీక్షణాత్ ౹
కస్య కామాయేతి వచో భోక్త్ర భావవివక్షయా
౹౹192౹౹
పతిజాయాదికం సర్వం తత్తద్భోగాయ నేచ్ఛతి ౹
కిన్త్వాత్మభోగార్థమితి శ్రుతావుద్ఘోషితం బహు
 ౹౹193౹౹

జగన్మిథ్యత్వం తెలిసిన జ్ఞాని యొక్క రాగము బంధింప శక్తిలేనిది.శ్రుతి భోక్త లేకుండుటనే సూచించు చున్నది. భార్యభర్తల ప్రేమకూడా ఆత్మసంబంధమే.

వ్యాఖ్య:-శాస్త్రసంబంధమైన -
శ్రుతి చెప్పినట్టి - అర్థాన్ని తెలుసుకోవటంతోనే జ్ఞానికి ముక్తి కలుగుతుంది.
"నైష్కర్మసిద్ధి" - 4.67
శాస్త్రము నందు - రాగము అజ్ఞాన లక్షణమని,
"బృహదారణ్యక వార్తికము" 1.4.15-39 శాస్త్రము నందు -
జ్ఞానియందు రాగాదులుండిన ఉండనిమ్ము అనే ఈ రెండూ కూడా అర్థవంతములే.

చిత్తం విహరించే భూములందు అనురాగం ఉండడమే రాగం !
ఏ వృక్షమూలంలో నిప్పు అంటుకొన్నదో ఇంకా ఆ వృక్షంలో పచ్చదనం ఎక్కడుంటుంది ? అనే ఈ వాక్యం వల్ల జ్ఞానియందు అనురాగం ఏమాత్రం ఉండదని తెలుస్తోంది.

శాస్త్ర -శ్రుతి అర్థాల వలన దృఢమైన జ్ఞానసంపదతో జ్ఞానికి ముక్తిగలుగుతుంది.ఇక రాగాదులు ఏవిధమైనవైనను హానిజరుగదు.
ఈ రెండు వాక్యాలలో మొదటి వాక్యం దృఢరాగాన్ని నిషేదిస్తోంది - రాగం ఉండకూడదని చెపుతోంది.
రెండవవాక్యం జ్ఞానియందు అధృఢమైన రాగరూపంలో ఉండే రాగాభాసం ఉండవచ్చునని అంగీకరిస్తోంది.
రాగం బంధకారణమగు అజ్ఞాన లక్షణము.ఈ విధంగా జ్ఞానియందు దృఢమైన అనురాగం ఉండరాదు అన్నప్పుడే ఈ రెండు వాక్యాలూ అర్థవంతమౌతాయి.
జ్ఞాని రాగము బంధించు శక్తిలేనిది.ఇట్లా ,
"కిమిచ్ఛన్ కస్యకామాయ..." అనే మంత్రార్థవివరణ,
ఇక "కస్యకామాయ..."
బృహ.ఉ. విషయం -

జగత్తు మిథ్య అనే జ్ఞానంవల్ల,
వాస్తవంగా కామ్యం(భోగం) యొక్క అభావాన్ని చెప్పదలచి,
"కిమిచ్చన్"అనే శ్రుతి వాక్యం చెప్పబడ్డది.అట్లాగే ఆత్మ అసంగమైనది అనే జ్ఞానం వలన వాస్తవంగా భోక్తయొక్క అభావాన్ని చెప్పదలచి - భోక్త అనేవాడు లేడని చెప్పదలచి -
'కస్యకమాయ'(ఏ భోక్త యొక్క భోగం కోసం)అంటూ ఈ శ్రుతి వాక్యం చెప్పబడ్డది.
ఆత్మయందు భోక్తృత్వం ఉండదు.ఆసక్తి ఉంటేనే భోక్తృత్వం ఉంటుంది.

జగత్తు మిథ్యయనీ ఆత్మ అసంగమనీ జ్ఞానికి స్పష్టముగ తెలియుటచే అతనికి కర్తృత్వాభిమానముగాని,
భోక్తృత్వాభిమానము గాని ఉండదు.
"కస్యకామాయ"(ఎవని కోరిక కొరకు)అనే శ్రుతి ఈ భోక్త లేకుండుటయే సూచించుచున్నది.

అయితే,ఆత్మయందు ఆసక్తి ఉండటం అనుభవంలోని విషయమే అని చెప్పే శ్రుతిని ఉటంకిస్తున్నారు.

పతి పత్న్యాది సమస్తభోగ్యపదార్థాల్నీ భోగంకోసం ఎవడూ కోరటం లేదు.ఆత్మర్థమే - తనకోసమే కోరుతున్నారు అని అనేక విధాలుగా శ్రుతి చెపుతోంది.

బృహ.4-5-6 (ఓ మైత్రేయీ ! పతి యొక్క సుఖం కోసం పతి ప్రియుడు కావటం లేదు తన సుఖం కోసమే పతి ప్రియుడు అవుతున్నాడు...)అంటే 
భర్త భార్యను,భార్య భర్తను ప్రేమించుట వారియందలి ప్రేమచే గాక తమ ఆత్మ యందలి ప్రేమచేతనే అని శ్రుతియందు బహుధా ఘోషింపబడినది.

అంటూ,ఇట్లా సమస్త భోగసాధనాలూ ఆత్మర్థమే ప్రియమైనవి అవుతున్నాయని శ్రుతి చెపుతోంది.ఇందువల్ల ఆత్మకు భోక్తృత్వం ఉన్నట్లు స్పష్టమౌతోంది.
ఇట్లా ఆత్మయందు భోక్తృత్వముంటుందా ?          

No comments:

Post a Comment