*ఈరోజు పురాణ కథ చెప్పుకుందాం గంగానది గురించి:*
ఒకానొక నది. హిమవంతమునందు పుట్టినందున దీనిని హిమవంతుని కూఁతురు అందురు. ఇది దేవలోకమునందుండి భగీరథుని ప్రయత్నమున భూలోకమునకు వచ్చెను. భగీరథుఁడు, తన ముత్తాతలు అగు సగరపుత్రులు కపిల మహామునియొక్క కోపాగ్నిచేత నీఱుకాఁగా, వారికి సద్గతి కలిగింప తలఁచి గంగను కూర్చి తపస్సు చేసి భూలోకమునకు దిగివచ్చునట్లు ప్రార్థించెను. అప్పుడు ఆమహానది తాను భూలోకమునకు వచ్చునెడ తన ప్రవాహవేగమును ధరింపఁగలవారిని ఒకరిని ఏర్పఱచుకొనిన పక్షమున, తాను వచ్చునట్లు ఒప్పుకొనెను. అంతట భగీరథుఁడు రుద్రునిఁగూర్చి తపము ఆచరించి అతని అనుగ్రహము పడసి, గంగాప్రవాహమును వహింప ప్రార్థించెను. అపుడు గంగ మిక్కిలి అట్టహాసముతో భూమికి దిగి రాసాగెను. అది రుద్రుఁడు చూచి గంగను తన ప్రక్కకు ఆకర్షించి జటాజూటమునందు నిలిపి పిదప కొంతకాలమునకు భగీరథుని ప్రార్థనచే తన శిరస్సునుండి ఏడుబిందువులను భూమిమీఁద వదలెను. అది కారణముగ రుద్రుఁడు మందాకినీమౌళి అనఁబడును. ఆబిందువులు పడిన చోటు బిందుసరస్సు అనియు ఆబిందుసరస్సునుండి వెడలి గంగ ప్రవహించును అనియు చెప్పుదురు. అట్లు వెడలి ఆగంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపఁగా అతఁడు కోపించి దానిని పానముచేసి, పిమ్మట భగీరథుఁడు ప్రార్థింపఁగా ప్రసన్నుఁడై తన చెవినుండి వెడల విడిచెను. ఇందువలన గంగకు జాహ్నవి అను పేరు కలిగెను. మఱియు ఈనది భగీరథుని వెంట పాతాళమునకు పోయెను కనుక దీనిని త్రిజగత్కల్యాణి, త్రిపథగ అని అందురు.
త్రివిక్రమావతారమున విష్ణువు భూమియందు ఒక పాదము ఉంచి రెండవపాదముచే మీఁది లోకమును కప్పునప్పుడు బ్రహ్మాండము పగిలి ఆకాశగంగ ఆయన పాదముగుండ క్రిందికి ప్రవహించినందున దీనికి విష్ణుపది అను పేరు కలిగెను. ఊర్ధ్వలోకములయందు వ్యాపింప చేసిన త్రివిక్రమదేవుని పాదమును బ్రహ్మ తన కమండల జలముచే కడుగఁగా ఆజలముప్రవహించి ఈనది ఏర్పడెను అనియు అది కారణముగ దీనికి విష్ణుపది అను పేరు కలిగెను అనియు కొందఱు చెప్పుదురు.
No comments:
Post a Comment