Thursday, February 20, 2025

 Vedantha panchadasi:
చిత్తైకాగ్ర్యం యథా యోగీ మహాయాసేన సాధయేత్౹
అణిమాదిపేప్సయైవం వివిచ్యాత్స్వం ముముక్షయా
౹౹208౹౹
కౌశలాని వివర్థన్తే తేషామభ్యాసపాటవాత్ ౹
యథా తద్వద్వివేకోఽ స్యాప్యభ్యాసాద్విశదాయతే 
౹౹209౹౹
వివించతా భోక్తృతత్త్వం జాగ్రదాదిష్వ సంగతా ౹
అన్వయ వ్యతిరేకాభ్యం సాక్షిణ్యధ్యవసీయతే 
౹౹210౹౹

సిద్ధుల కోసం ఎంత కష్టపడతారో అంత ప్రయత్నంతో మోక్షసాధన చేయాలి.అన్వయ వ్యతిరేక న్యాయమున అవస్థలయందు భోక్త తెలియును.

వ్యాఖ్య:-ఆత్మ చింతనవలన అసంగత్వం దృఢపడును.
యోగాభ్యాసం చేసే యోగి 
అణిమ,లఘిమ ఇత్యాది అష్టసిద్ధులును సంపాదించుటకు ఎంతో మహా కష్టముతో ఈ చిత్తాగ్రమును సాధించును.
"మోక్షకాంక్షి" కూడా అంత అధిక  ప్రయత్నంతో అంటే మోక్షాన్ని పొందాలనే తీవ్రమైన కోరికతో ఎల్లప్పుడు  ఆత్మను దేహాదులకంటే భిన్నమైన దానినిగా చింతన చేయాలి.
మోక్షమును సాధించే కోరికతో వివేచనను కూడా అంత పరిశ్రమతో చేయవలెను. 
దాని వలన ఫలితం ఏంటంటే -

కావ్య,నాటక,నీతి,తర్క శాస్త్రాదుల్ని అభ్యాసం చేసేవారికి అభ్యాసపాటవం వల్ల ఆయా విషయాల్లో కౌశలం పెరిగినట్లే, ముముక్షవు లైనవారికి కూడా నిరంతరం ఆత్మాభ్యాసం వల్ల వివేకజ్ఞానం అంటే - దేహాదులకంటే ఆత్మ భిన్నమైనదనే జ్ఞానం బాగా స్పష్టమౌతూ ఉంటుంది.అంటే అభ్యాసబలముచే వారివారి నైపుణ్యములు పెంపొందునట్లే వివేకము కూడా అభ్యాసపాటవముచే అంతంతగా విశదమగుచూవచ్చి బోధ దృఢపడును.

ఉపాసనద్వారా అంటే శాస్త్రంచెప్పిన ఒక ఆలంబనాన్ని పట్టుకుని దాని మనస్సు లగ్నం చేసి మరియొక చింతలేకుండా దానినే చింతచేస్తూ పోవడం.ఇది కేవల కర్మకన్నా ఎక్కవ ఫలితమిస్తుంది సాధకుడికి. ఉపాసన చాలా శక్తివంతమైనది.
ఎలాంటి మనో నిశ్చయంతో ఉపాసన సాగిస్తాడో దాని కనుగుణంగానే ఆయా దేవతామూర్తిని పోయి చేరతాడు.దేవతలంటే ఎవరోకాదు 
"ఈశ్వర చైతన్య విభూతులే "

అనేక శక్తి సంన్నమైన ఆ చైతన్యసాగరంలో ఏ ఒక్క శక్తి తరంగాన్ని మనమాశ్రయించినా  
అది మనకా మేరకు ఫలితమిస్తుంది.

అన్వయము,వ్యతిరేకము అనే రెండు యుక్తులద్వారా భోక్తయొక్క యథార్థమైన తత్త్వాన్ని వివేచనచేేసే ముముక్షువుకు అంటే జడప్రపంచాన్ని భోక్తనుండి వేరుచేసే ముముక్షువుకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థల్లో సాక్షియందలి - కూటస్థుని అసంగత్వం బాగా నిశ్చయమౌతుంది.

భోక్త యొక్క నిజరూపము అన్వయవ్యతిరేక న్యాయముచే తెలియనగును.
దానివలన భోక్త నిజముగా జాగ్రదా ద్యవస్థలయందు సంగరహితుడైన సాక్షియే అని తేటపడును.

అన్వయ వ్యతిరేకమనగానేమి?

యత్ర యద్ దృశ్యతే ద్రష్ట్రా జాగ్రత్ స్వప్న సుషుప్తిషు ౹
తత్రైవ తన్నేతరత్రే త్యనుభూతిర్హి సంమతా ౹౹211౹౹
సయత్తత్రేక్షతే కిఞ్చిత్తేనానన్వాగతో భవేత్ ౹
దృష్టైవ పుణ్యం పాపం చేత్యేవం శ్రుతిషు డిండిమః 
౹౹212౹౹

మూడు అవస్థలయందును ఒకడే అనే అనుభవము సర్వులుకు అంగీకారమే.
ద్రష్ట అవస్థానుభవమును వదలి అవస్థాంతరమునకు కొనిపోవును.

వ్యాఖ్య :- అభ్యాసమువలన వివేకజ్ఞానము అంతంతగా విశదమగును.అవస్థాత్రయ మందలి కూటస్థుని అసంగత్వం స్పష్టముగా నిశ్చయమగును.
ప్రతి స్థితియందును ఈ అన్వయ వ్యతిరేకము అను యుక్తుల వలన అసంగత్వం నిశ్చయంగా దృఢమగును.

సామాన్యం విశేషం ఈ రెండిటికి ఉన్న తేడా ఏమిటో తెలిస్తేచాలు 
అద్వైత విజ్ఞానమంతా అందులోనే కలిసివస్తుంది.వీటి పర్యాయ పదాలే 
అన్వయ - వ్యతిరేకాలు,
అనువృత్తి - వ్యావృత్తి,
అద్యారోప - అపవాదాలు మొదలగునవి.
సామాన్యమనేది ఎప్పుడు ఏకమే.విశేషాలు అనేకం.ఇక అన్వయ వ్యతిరేకాన్ని గురించి చూద్దాం -

జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడు అవస్థల్లోనూ - 
ఏ అవస్థలోనైనా,
స్థూల,సుక్ష్మ, ఆనందరూపమైన  
మూడురకాల భోగ్యపదార్థాల్నీ ద్రష్టయైన సాక్షి చూస్తూనే ఉంటాడు - సాక్షికి వీటి అనుభవం కలుగుతూనే ఉంటుంది.
ఈ దృశ్యరూపమైన భోగ్యం ఆ అవస్థలోనే కనిపిస్తూ ఉంటుంది.అంటే,
జాగ్రత స్వప్న సుషుప్తి అవస్థలయందు ద్రష్ట ఏయే ప్రపంచములను చూచుచున్నాడో అవియన్నీ ఆయా అవస్థలయందు మాత్రమే ఉండుచున్నవి.ఇతర అవస్థలయందు అవి అనుభవింపబడుట లేదు. అంటే, 

జాగ్రత్తలో స్థూలము,
స్వప్నంలో సూక్ష్మము,
సుషుప్తిలో అనంతరూపము అయిన భోగ్యం అన్నమాట.
కానీ ఈ మూడు ప్రపంచములను చూచుచున్న ద్రష్ట మూడు అవస్థలయందును ఒకడే.
ఈ అనుభవము సర్వులును అంగీకరించునదే - అందరికీ సమ్మతమే !

ఇది కేవలం అనుభవ ప్రమాణవిషయమే కాదు - ఇందుకు శ్రుతిప్రమాణం ఉంది.
బృ 4-3-15 ; 3-4-15

ఆత్మ స్వప్నావస్థలోచూచే భోగ్యపదార్థాలతో సంబంధాన్ని కలిగి ఉండదు.వాటిని అనుసరించదు.పుణ్యానికి ఫలమైన సుఖాన్ని,పాపానికి ఫలమొన దుఃఖాన్ని మాత్రం అనుభవించి,తానేమీ గ్రహించకుండానే ఏమీ చేయకుండానే ద్రష్ట ఆ అవస్థయందే వదలి 
మరొక అవస్థలోకి వెళ్ళిపోతుంది - అని శ్రుతి దండోరా వేసి చెపుతోంది.

స్వప్నకాలంలో స్థూలదేహాన్ని గురించిన జ్ఞానం ప్రతీతి ఉండకపోయినప్పటికి సాక్షిరూపంలో ఆత్మప్రతీతి ఉంటుంది.అదే అన్వయం. అట్లా ఆ స్వప్నకాలంలో ఆత్మప్రతీతి ఉంటున్నప్పటికి స్థూలదేహానికి సంబంధించిన జ్ఞానం ఉండకపోవటం వ్యతిరేకం.
అన్వయాన్నే అనువృత్తి లేక అనుస్యూతంగా ఉండటం అనవచ్చు.వ్యతిరేకాన్ని వ్యావృత్తి లేక వేరు చేయటం అనవచ్చు.
ఈ విధంగా స్థూలదేహాని కున్నట్టి అనాత్మత్వాన్ని -
స్థూలశరీరం ఆత్మకాదు అనే విషయాన్ని
అన్వయం ద్వారాను, వ్యతిరేకంద్వారానూ చూడవచ్చు.

సుషుప్తిసమయంలో లింగదేహానికి - సూక్ష్మశరీరానికి సంబంధించిన ప్రతీతి ఉండకపోయినప్పటికీ, ఆత్మ స్ఫురణ ఉండటమె అన్వయం.సుషుప్తిలో ఆత్మ ప్రతీతి ఉంటూ ఉండగా, లింగదేహానికి సంబంధించిన జ్ఞానం ఉండకపోవటమే లింగశరీరానికి వ్యతిరేకమనిపించుకొంటుంది.

ముంజదర్భ యొక్క రెమ్మలోపలి గర్భమందున్న మృదువైన తృణభాగాన్ని నేర్పుతో,పైనున్న స్థూలపత్రాలను తీసివేసి - వేరుచేసి పొందినట్లుగా 
అన్వయ వ్యతిరేకాలద్వారా ప్రత్యగాత్మను మూడు శరీరారనుండి - 
స్థూల,సూక్ష్మ,కారణ శరీరాలనుండి వేరుచేయగా, సాధకుడికి బ్రహ్మాత్మైక్య జ్ఞానం కలుగుతుంది .
వివేచన ద్వారా మాత్రమే 
ఆత్మ - పరమాత్మల అభేదాన్ని గుర్తించ గలిగుతారు.      

No comments:

Post a Comment