Wednesday, March 30, 2022

రామ్ రాజ్ కాటన్స్ అధినేత జీవితపాఠం ! ఒక స్ఫూర్తి వంతమైన గాథ

#ధోవతి కట్టుకొచ్చారని హోటల్లోకి
రానివ్వలేదు.
అవమానంతో కుంగిపోలేదు‌.
ఎలాంటిచోటైతే ధోవతికి అవమానం జరుగుతుందో అలాంటిచోటకు పంచెకట్టుతో వెళ్లిన వ్యక్తికి గౌరవమిస్తున్నట్టు ఒక యాడ్‌ చేయించి.... మన ధోవతి పై
మనలోనే గూడుకట్టుకున్న చులకన భావాన్ని నలిపేసే ప్రక్రియ కు తెరతీశారాయన.

ఒక స్ఫూర్తి వంతమైన గాథ

#రామ్ రాజ్ కాటన్స్ అధినేత జీవితపాఠం !

చదవండి‌ !

అవకాశాలు రావు, మనమే సృష్టించుకోవాలని ఆయనే చెప్పినట్లు... మన ఎన్నో
సమస్యలకు మనమే
పరిష్కారం దొరకబుచ్చుకుందాం... !



ధోతీ వేడుక, పెళ్లి, గృహ ప్రవేశం... ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మగవాళ్లంతా తెల్లని పంచెకట్టులో మెరిసిపోతుంటారు.

వాటిలో చాలావరకూ రామ్‌రాజ్‌ బ్రాండ్‌కి చెందినవే ఉంటాయి.

ఎందుకంటే పంచెల
మార్కెట్‌లో ఆ బ్రాండే రారాజు.

దీని వెనక ఉన్న వ్యక్తి ఆ సంస్థ వ్యవస్థాపకుడు కె.ఆర్‌.నాగరాజన్‌.

తమిళనాడులోని వస్త్ర నగరం తిరుపూర్‌ నుంచి దేశవిదేశాలకు రామ్‌రాజ్‌ సామ్రాజ్యాన్ని విస్తరించిన తీరు గురించి ఆయన ఏం చెబుతారంటే...

వ్యాపారంలో అడుగుపెట్టాలని చిన్నపుడే అనుకున్నా.
అలాగని మాది వ్యాపారుల కుటుంబం కాదు.
అందుకు కారణం వేరే ఉంది.

మా ఊరు తమిళనాడులోని అవినాశి. వస్త్ర రంగానికి ప్రసిద్ధి అయిన తిరుపూర్‌కు దగ్గర్లో ఉంటుంది.

నా చిన్నపుడు ఒకాయన వారానికోసారి మా ఊరికి కార్లో వచ్చేవాడు.

ఆ కారుని చూడగానే పిల్లలందరం దాని వెనక పరిగెత్తేవాళ్లం.

అతను కారు ఎలా కొనగలిగాడని అమ్మని అడిగితే... ‘వ్యాపారి కాబట్టి’ అని చెప్పింది.
ఏం చదువుకున్నాడని అడిగితే... ‘మూడో నాలుగో’... అని బదులిచ్చాడు నాన్న.
పెద్ద చదువులు చదివిన మా స్కూల్‌ టీచర్‌ సైకిల్‌మీద వస్తుంటే, ఈయన కారులో వస్తున్నాడే అనుకున్నా. వ్యాపారి అవ్వాలన్న ఆలోచనకు ఆరోజే బీజం పడింది.

అమ్మానాన్నలకు అన్నయ్య, నేను - ఇద్దరమే.
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నపుడు స్కూల్‌ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది.

మా ఇంటి దగ్గర్లో ఒకాయన న్యూస్‌ పేపర్‌ ఏజెన్సీ నడిపేవారు.
ఆయన దగ్గర ఆ వ్యాపారం గురించి తెలుసుకున్నాక పిల్లలు ఇష్టపడే బాలమిత్ర మ్యాగజైన్‌కి ఏజెన్సీ తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది.

ఎడిటర్‌ గారికి ఉత్తరం రాస్తే,
డిపాజిట్‌ తీసుకోకుండానే పుస్తకాలు పంపించారు.
వాటిని అమ్మి డబ్బు కట్టేశా.
లాభంగా వచ్చిన డబ్బుతో స్కూల్‌ ఫీజు కట్టేవాణ్ని.

అన్నయ్య శ్రద్ధగా చదువుకుని టీచర్‌ అయ్యాడు.
నా చదువు మాత్రం ఇంటర్‌ ఫస్టియర్‌తో ఆగిపోయింది.
మాకు టైప్‌ ఒక సబ్జెక్టు.
టైపు ఇన్‌స్టిట్యూట్‌కి నెలకు రూ.15 ఫీజు.
అది కట్టలేక చేరలేదు.
రెండు మార్కుల్లో టైపు పరీక్ష తప్పడంతో నా చదువుకి బ్రేక్‌ పడింది. వ్యాపారిగా విజయవంతం కావడానికి ఆ వైఫల్యమే మొదటి అడుగు.

తెలుగు నేలమీద మొదలు...

చదువు మానేశాక తిరుపూర్‌లోని ఒక వస్త్ర వ్యాపార సంస్థలో చేరాను.
అక్కడ పనిచేస్తూనే వ్యాపార పాఠాలు నేర్చుకోవాలనేది నా ఉద్దేశం.

చేరిన కొత్తలోనే రాయలసీమకు పంపించారు.
15 రోజులు దుకాణంలో ఉంటూ, మరో 15 రోజులు గ్రామాలకు వెళ్తూ చేనేత కార్మికుల్ని కలుస్తూ పనిని పర్యవేక్షించేవాణ్ని.

అప్పటికి నాకు తెలుగు కూడా రాదు. చేనేత కార్మికులు తాము నేసిన పంచెలూ చొక్కాలూ దుకాణానికి తెచ్చి ఇచ్చేవాళ్లు.

చేతిలో డబ్బున్నా మా యజమాని సాయంత్రం వరకూ వాళ్లకి ఇచ్చేవాడు కాదు.

వాళ్ల ఒంటిమీద కనీసం
చొక్కా కూడా ఉండేది కాదు.

తిండీతిప్పలు లేకుండా దుకాణం బయట ఎదురుచూసేవాళ్లు.

‘డబ్బులిస్తే ఇంటికిపోయి పనిచేసుకుంటారు కదా’ అంటే ‘ముందే ఇచ్చేస్తే దుకాణాలన్నీ తిరిగి ఎవరు ఎంత ధర ఇస్తున్నారో ఆరాలు తీస్తారు.
బస్సు టైమ్‌కిస్తే నేరుగా ఇంటికి వెళ్తారు’ అని బదులిచ్చాడు యజమాని.

ఆ కంపెనీలో ఆరేళ్లు పనిచేశాక సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నా.

నాన్న రామస్వామి పేరులోని రామ్‌, నా పేరులోని రాజ్‌ని తీసుకుని 1983లో తిరుపూర్‌లో ‘రామ్‌రాజ్‌ ఖాదీ ట్రేడర్స్‌’ పేరుతో పంచెల హోల్‌సేల్‌ వ్యాపారం మొదలుపెట్టాను.

నిజానికి అప్పటికి తిరుపూర్‌లో లోదుస్తుల ఎగుమతి వ్యాపారం బాగా నడిచేది.

మా స్నేహితులూ, కుటుంబ సభ్యులూ ‘ఆ వ్యాపారంలోకి వెళ్లొచ్చుగా... పంచెల వాడకం తగ్గిపోతోంది.
ఏటికి ఎదురీదడం ఎందుకు’ అన్నారు. నేను మాత్రం పంచెలకూ
డిమాండ్‌ ఉందని నమ్మాను.

రెట్టింపు కూలీ...

తిరుపూర్‌ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లి నేత కార్మికుల్ని కలిశాను.

అప్పట్లో వాళ్లకి మీటరు వస్త్రానికి రెండు రూపాయలు వచ్చేది.
నాతో పనిచేస్తే ఏడాది పొడుగునా పని కల్పిస్తానంటే, సరేనన్నారు.

నా దుకాణానికి వచ్చేటపుడు కచ్చితంగా చొక్కాతో రావాలని చెప్పా ‘మీరిచ్చే డబ్బు మాకు తిండి ఖర్చులకే రాదు, చొక్కాతో ఎలా వస్తాం’ అన్నారు.

తిండి కోసం అదనంగా ఎంత కావాలని అడిగా, మీటరుకు రూపాయి అన్నారు.

దాంతోపాటు చొక్కాకి మరో రూపాయి పెంచి నాలుగు రూపాయలు ఇస్తానన్నా.

రెట్టింపు ధర అనేసరికి వాళ్లకి నామీద నమ్మకం కలగలేదు.

‘డబ్బు కోసమే అయితే అందరిలా బనియన్ల వ్యాపారంలోకి వెళ్లేవాణ్ని. నా బాగుతోపాటు నేతన్నల బాగూ ముఖ్యమే’నని చెబితే నమ్మారు.

అప్పటికి మార్కెట్లో ఉన్న వ్యాపారులెవరూ నాణ్యత
గురించి ఆలోచించలేదు.

పొరపాటున ఒకటి చిరిగినా రెండోది అక్కరకు వస్తుందని పెళ్లిళ్లూ, శుభకార్యాలకు రెండు పంచెల్ని తీసుకుని వెళ్లేవారు ఆరోజుల్లో.

అందుకే మా పంచెల తయారీకి మార్కెట్‌లో ఉండే నాణ్యమైన పత్తిని ఎంచుకున్నా.

నిజానికి పంచెలకోసం అప్పటికి అంతటి నాణ్యమైన నూలుని ఎవరూ ఉపయోగించలేదు.

అలా మొదటిసారి రూ.85 వేలు విలువచేసే సరుకు తీసుకుని నాకు బాగా తెలిసిన పుత్తూరులోని ఒక రిటైల్‌ దుకాణానికి వెళ్లాను.

ఒక్కో పంచె ధర రూ.110 అని చెప్పా.

అప్పటికి మార్కెట్‌లో ఉన్న ధర రూ.60-70 మాత్రమే.

ధరలో మార్పులేదనీ,
ఒకవేళ స్టాక్‌ మిగిలిపోతే
వాటికి తిరిగి డబ్బులిస్తాననీ చెప్పా. అందుకు ఆయన ఒప్పుకున్నాడు.

వారం తర్వాత వెళ్తే...
స్టాక్‌ అయిపోయిందన్నాడు.

నా నమ్మకం నిజమైనందుకు
ఎంతో సంతోషించా.

ఆ ధరకు అమ్మినా నాకు పెద్దగా మిగిలేది కాదు.

అందుకని నిర్వహణ ఖర్చు తగ్గించుకునేవాణ్ని.

బస్సుమీద వెళ్తే నెలకు రూ.20 అవుతోందని మా ఊరు అవనాశి నుంచి తిరుపూర్‌కి రోజూ 14 కి.మీ. సైకిల్‌మీద పంచెల్ని తీసుకుని వెళ్లేవాణ్ని.

మా దుకాణానికి వచ్చే వ్యాపారుల్లో కొందరు అంత ధర ఎందుకని అడిగేవాళ్లు.
నాణ్యత చూడమనేవాణ్ని. నేత నేసే వారికి నేనిచ్చే రేటు చెప్పేవాణ్ని.

అవి నచ్చి ఆరోజు నుంచీ ఈరోజుకీ మాతో అనుబంధం కొనసాగిస్తున్న వ్యాపారులు ఉన్నారంటే నమ్మగలరా...

కొన్నాళ్లకు కంపెనీ పేరులో
‘ఖాదీ’ని కాటన్‌గా మార్చా.
డిమాండ్‌ బాగా ఉండటంతో పంచెలతోపాటు షర్టులూ తెచ్చాం. దక్షిణాది మొత్తం విస్తరించాం.

ఆలోచనా విధానం మార్చాలని...

మా వ్యాపార భాగస్వామి కూతురి పెళ్లి రిసెప్షన్‌కి ఫ్రెండ్స్‌తో కలిసి చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌కి వెళ్లా.

ప్యాంటూ షర్టూ వేసుకున్న వాళ్లందరినీ లోపలకి పంపించి పంచెకట్టులో ఉన్న నన్ను మాత్రం అడ్డుకున్నారు.

అలాగైతే తామూ వెళ్లమని నాతో వచ్చినవాళ్లు పట్టుబట్టారు.
నేనే వాళ్లకి నచ్చజెప్పి పంపాను. వాళ్లు తిరిగి వచ్చేంత వరకూ బయట ఒక్కణ్నే కూర్చున్నా.

అంతసేపూ నాలో ఎంతో సంఘర్షణ. ఈ వ్యాపారంలోకి అనవసరంగా వచ్చానా అనిపించింది.

బ్యాంకులూ, ప్రభుత్వ కార్యాలయాలూ...
ఎక్కడికి వెళ్లినా ప్యాంటూచొక్కా వేసుకున్నవాళ్లతో పోల్చితే నన్ను చులకనగా చూసేవారు.

ఇంట్లోవాళ్లూ షాపింగుకూ, సినిమాలకూ వెళ్లినపుడు ప్యాంటూచొక్కా వేసుకోమనేవారు.

పంచెకట్టు అంటే
గౌరవ మర్యాదలు తక్కువనీ...
పల్లెటూరి రైతు అన్న చులకనభావం ఉందనీ అర్థమైంది.

అప్పుడే అనుకున్నా పోవాల్సింది ఆ చులకన భావం తప్ప మన సంప్రదాయం కాదని.

మర్నాడే చెన్నైలో ప్రకటనలు రూపొందించే కంపెనీకి వెళ్లి పంచెకట్టు గౌరవం పెంచేలా ఒక యాడ్‌ చేయమని అడిగా.

నాకు ఎలాంటిచోటైతే అవమానం జరుగుతుందో అలాంటిచోటకు పంచెకట్టుతో వెళ్లిన వ్యక్తికి గౌరవమిస్తున్నట్టు ఆ యాడ్‌లో కనిపించాలని చెప్పా.

అలా తెచ్చిన ‘సెల్యూట్‌ రామ్‌రాజ్‌’ ప్రకటనకు మంచి పేరొచ్చింది.

ఓసారి కేవలం తెల్ల పంచె, చొక్కా వేసుకునే ఫ్యాషన్‌ షో ఏర్పాటుచేశాం.

మరోసారి అమెరికాలోని తమిళ సంఘం సమావేశానికి 700 మంది కేవలం రామ్‌రాజ్‌ పంచెలూ, సల్వార్‌లూ, చీరలతో హాజరయ్యేలా చేశాం.
వీటివల్ల కొంత మార్పు వచ్చింది.

మార్కెటింగ్‌లో భాగంగా ఇప్పటికీ సినిమాల్లో హీరోలు పంచెకట్టులో కనిపించేలా ఒప్పందాలు చేసుకుంటాం.

అలా రిటైల్‌ వ్యాపారంలోకి...

1999 నాటికి తిరుపూర్‌లోని మా తయారీ యూనిట్‌ సరిపోకపోవడంతో నగర శివారులో పెద్ద యూనిట్‌ నిర్మించి అక్కడకు మారాం.

అప్పటికే నగర వాసులు షోరూమ్‌ అనుభవాన్ని కోరుకోవడాన్ని గమనించా.

అందుకే మా పాత యూనిట్‌ ఉన్నచోట పెద్ద షోరూమ్‌ నిర్మించా.

రెండో షోరూమ్‌ని కోయంబత్తూరులో ప్రారంభించా.

అది బాగా విజయవంతమైంది.

వీటివల్ల వినియోగదారుల ఆలోచనల్ని నేరుగా తెలుసుకుని ఉత్పత్తుల్లో మార్పులూ చేర్పులూ చేసే అవకాశం వచ్చింది.

దక్షిణాదిలో మాకు 170 దాకా దుకాణాలున్నాయిపుడు.

నాకు ఇద్దరు ఆడపిల్లలు.
టెక్స్‌టైల్‌ టెక్నాలజీ చదువుకున్నారు.

పిల్లలూ, అల్లుళ్లూ కంపెనీని కొత్త విభాగాల్లోకి తీసుకువెళ్తున్నారు.

రోజుల పిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారికీ సరిపోయేలా 2500 రకాల పంచెలు దొరుకుతాయి

మా దగ్గర. టీషర్టులూ, జిమ్‌వేర్‌, లోదుస్తులూ, పిల్లల దుస్తులూ, పట్టు పంచెలూ, చొక్కాలూ, చీరలూ, లినెన్‌ వస్త్రాలూ... ఇలా భిన్నమైన విభాగాల్లోకి అడుగుపెట్టాం.

ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు జరుపుతాం.
విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాం.

యువతకు అదే చెబుతా...

వేదాద్రి మహర్షి భక్తుణ్ని.
యోగా, ధ్యానం, శాకాహారం
నా జీవనశైలిలో భాగం.

‘వెన్మయ్‌ ఎన్నంగళ్‌’ అనే మాస పత్రికను తీసుకొస్తున్నా.
ఇది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది.

‘తెలుపు తేట’ పేరుతో
తెలుగులోనూ దీన్ని తెస్తున్నాం.

‘వనం ఇండియా ఫౌండేషన్‌’ను ప్రారంభించి...
బంజరు భూములూ,
ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటి... సామాజిక వనాల్ని పెంచుతున్నాం.

చెరువులూ, బావుల్లో పూడిక తీయిస్తున్నాం.

యువ వ్యాపారుల్ని కలిసినపుడల్లా నన్ను సలహాలు అడుగుతుంటారు.

నేనూ వాళ్లకి ఓపిగ్గా సమాధానం ఇస్తాను.

డబ్బు కోసమే పనిచేస్తే వ్యాపారంలో విజయవంతం కాలేమనేది నేను చెప్పే మొదటి పాఠం.

నేను వ్యాపారం మొదలుపెట్టాక నేతన్నల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందనీ,
దుకాణాల వాళ్లకి వ్యాపారం పెరిగిందనీ, వినియోగదారులూ సంతృప్తితో ఉన్నారనీ
అందువల్లే విజయం సాధించగలిగాననీ చెబుతా. అవకాశాలు ఎవరినీ వెతుక్కుంటూ రావు మనమే వాటిని సృష్టించుకోవాలి...

చిన్నపుడు బాలమిత్ర ఏజెన్సీ తీసుకోవడం,
ఇప్పుడు మాస్కుల తయారీలోకి అడుగుపెట్టడం అలా చేసినవే.

తమిళనాడులో 50వేల మంది నేతన్నలు మాకు పంచెల్ని నేస్తారు.

కంపెనీలో తొమ్మిదివేల మంది ఉద్యోగులు పనిచేస్తారు.

పది చదివి ఇంత మందికి
ఉపాధి కల్పిస్తున్నా...
పెద్ద చదువులు చదివిన మీరు లక్షల మందికి ఉపాధి కల్పించాలని మా పిల్లలకూ చెబుతుంటా.

లాభాల్ని వ్యాపార విస్తరణకే ఉపయోగించాను తప్ప బంగారం, స్థిరాస్తి లాంటి వాటి జోలికి వెళ్లలేదు.

సంపద మరింత మందికి ఉపాధినివ్వాలి.
🙏🇮🇳

సేకరణ

No comments:

Post a Comment