Tuesday, January 10, 2023

అద్వితీయ సందేశం, మానవాళికి కలిగే అనేక సంశయాలకు సమాధానం ఇచ్చే ఆధ్యాత్మిక గ్రంథం - భగవద్గీత.

 V. X.   1-3.   090123-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺


         *అద్వితీయ సందేశం* 
               ➖➖➖✍️

 *మానవాళికి కలిగే అనేక సంశయాలకు సమాధానం ఇచ్చే ఆధ్యాత్మిక గ్రంథం - భగవద్గీత.* 

*భగవంతుడైన కృష్ణుడి ముఖారవిందం నుంచి వెలువడిన జ్ఞానామృతమైన భగవద్గీత మనుషులకు జీవనగీతగా మారి, కర్తవ్యాన్ని ఉపదేశిస్తోంది...*

*మామూలుగా మనిషికి జీవితంలో అడుగడుగునా భయాలే ఎదురవుతుంటాయి.* 

*అడుగుతీసి అడుగు వేస్తే ఏమవుతుందోనని మనిషి భయపడుతుంటాడు.* 

*ఏదైనా పనిని ప్రారంభించే ముందు భయం వెంటాడుతుంది. ప్రారంభించిన తరవాత తుది వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుందో లేదోనన్న భయం పీడిస్తుంది. గమ్యాన్ని చేరుకున్న తరవాత పరిణామఫలం ఎలా ఉంటుందోనన్న వెరపు వెంటాడుతుంది.* 

*ఇలా అనుక్షణం భయాల మధ్య బతుకు గడిపే మనిషికి మృత్యువు అంటే పెను భయం! ఏ ఆపదా రాకుండా ఉండాలని అనుక్షణం మనిషి కోరుకుంటాడు.* 

*మరణం తొందరగా రాకూడదని ప్రార్థిస్తాడు. చిరకాలం జీవించాలని ఆశపడతాడు...*

*ఇలా మనిషి ఆశపడటంలో తప్పులేదు. మరణం విషయంలో మనిషికి ధైర్యాన్ని కలిగించేందుకు భగవద్గీత ఎన్నో విషయాలను బోధించింది.*

*వాటిలో రెండు శ్లోకాలు మాత్రం మనిషికి భయాన్ని పోగొట్టే తారకమంత్రాలుగా కని పిస్తాయి.*
 
*వాటిలో మొదటి శ్లోకంలో కృష్ణుడు- ‘అర్జునా! నీవు చేయ బోతున్న యుద్ధంలో నీవు చంపేవాడివని, శత్రుపక్షం వారు చావుకు గురయ్యేవాళ్లు అని నీవు అనుకుంటున్నావు.       అది నిజం కాదు... నీవు నిమిత్తమాత్రుడివే. మరణం వారికి ఇంతకు ముందే నిశ్చితమై ఉన్నది. పుట్టిన ప్రతి ప్రాణికీ చావు తథ్యం.*

*చచ్చిన ప్రతి ప్రాణికీ మళ్ళీ పుట్టుక అనివార్యం. కనుక నీవు ఈ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు. యుద్ధం చేయడమే నీ ధర్మం’ అంటాడు. *

*ఈ మాటల్లో లోకంలోని ప్రాణుల మరణాలకు ఎవరూ కారణం కాదని, అది సహజంగా జరిగే పరిణామమేనని తెలిసినప్పుడు మనిషికి చింత, దుఃఖం దూరమవుతాయి...*

*ఇక రెండో శ్లోకంలో- ‘మనిషి దేహం జీవన కాలంలో అనేక దశలను చవిచూస్తుంది….*
*కౌమారావస్థ, యౌవనావస్థ, వృద్ధాప్యావస్థ అనేవి ముఖ్యమైనవి. పుట్టినప్పుడు మనిషి చిన్నగా ఉంటాడు.  క్రమంగా పోషణతో శరీరం పెద్దదిగా మారుతుంది.*

*బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలలో అనుక్షణం మార్పులకు లోనవుతూ తుది దశకు చేరుకుంటుంది. 
ఇన్ని దశలుగా మార్పు చెందిన శరీరం ఒక వస్త్రంలా జీర్ణమైపోతూ ఉంటుంది.* 

*వస్త్రం చిరిగిపోయినట్లే, అతుకులు పడినట్లే మానవదేహం కూడా శిథిలమై అతుకులబొంతలా తయారవుతుంది.* 

*చివరికి పూర్తిగా పాడైపోయి పారవేయవలసిన స్థితికి చేరుకుంటుంది. చిరిగిపోయిన పాతబట్టలా ఈ దేహం మరణిస్తుంది.*

*మళ్ళీ ఆత్మ మరో జన్మరూపంలో కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. అప్పుడు ‘పునరపి జననం’ సంభవిస్తుంది.* 

*ఇలా ఆత్మను కప్పి ఉంచే వస్త్రం లాంటిదే దేహం.*
     
*’కనుక దేహం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం, ఎన్ని దేహాలు మరణించినా ఆత్మ మరో దేహమనే వస్త్రాన్ని తొడుక్కుని నూతన జన్మను పొందుతుంది’ అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి తేటతెల్లం చేశాడు.*

*సృష్టిలో పరిణామం అనేది అనివార్యం. ఏది అయినా పుట్టినప్పుడు ఉన్న తీరులోనే ఉండదు కదా? మార్పునకు లోనవుతూనే ఉంటుంది. అదే జీవన సత్యం. మనిషి ఈ సత్యాన్ని తెలుసుకుంటే తాను శాశ్వతం కాదని, తన ఉనికి పరిమిత కాలమేనని తృప్తిపడతాడు. మరణ భయానికి దూరమవుతాడు. తాను జీవించిన పరిమిత కాలంలో అపరిమితంగా మంచి పనులు చేసి, తన జన్మను సార్థకం చేసుకుంటాడు. ఇదే భగవద్గీతా పరమార్థం!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


No comments:

Post a Comment