*శ్రీ కాశీఖండం - 1*
శ్రీనాధ మహాకవి రచించిన, *'కాశీఖండం అయ : పిండం'* అని పండితులు చెప్పుకోవడం కలదు.
అనగా ఆ మహాకవి రచించిన ఆ మహద్గ్రంథం నడక ఉక్కుముద్దలాగా కఠినంగా సామాన్యులకు కొరుకుడు పడదని భావన.
* * *
అయితే, శివానుగ్రహం వలన వేదవ్యాస ప్రోక్తమైన స్కాందపురాణంలో వున్న *'శ్రీ కాశీఖండం'* సరళమైన శైలి లో అతి క్లుప్తంగా వున్నది. ఇంకా దాని గురించి ధారాళంగా తెలుసుకోవాలనుకుంటే, వారు మూలలలోకి వెళ్ళి మధించవచ్చు.
* * *
*గజాననమ్ భూతగణాధి సేవితం కపిథ జంబూఫల చారుభక్షణం*
*ఉమాసుతమ్ శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం.*
*విశ్వేశం మాధవం డుంఢిమ్ దండపాణించ భైరవం*
*వందే కాశీమ్ గుహాం గంగాం భవానీం మణికర్ణికాం.*
ముందుగా కాశీక్షేత్రం గురించి క్లుప్తంగా...
స్వర్గపాతాళాలకు మధ్యనున్న భూలోకంలో కాశీనగరం అన్నిలోకాలనూ రక్షిస్తూ వుంటుంది. ఈ క్షేత్రం మూడు లోకాలనూ పునీతం చేసే గంగానది ఒడ్డున వుండడం వలన, ఈ క్షేత్రంలో మరణించే అన్ని జీవులూ తప్పక మోక్షాన్ని పొందుతాయి. అందులో ఇసుమంత అయినా సందేహం లేదు.
* * *
కాశీఖండ విశిష్టతను సూతునికి, శౌనకాదిమహామునులకు కృష్ణ ద్వైపాయనుడు వివరించారు.
ఒకసారి నారదమహర్షి నర్మదానదిలో స్నానంచేసి, ఓంకార నాధుని సేవించి, రేవానదీ తీరంలోవున్న వింధ్యపర్వతాన్ని చూడడం తటస్థించింది. స్థావర జంగమ రూపమై వింధ్యపర్వతం *‘కావలసినప్పుడు సంచరించే శక్తి‘* కలిగి వున్నది. అనేక ఓషధులతో, వృక్షరాజాలతో ఎంతో ఠీవీగా కనబడే వింధ్యపర్వత ప్రాశస్త్యం వర్ణింప వీలుకానిది.
వింధ్యపర్వత వైభవాన్ని చూసి దేవతలే ముచ్చటపడి తరచూ ఆ విధ్యపర్వతం పైకి విహారం కోసం రావడం ఆ సమయంలో వింధ్యపర్వతం ఆతిధ్యం యివ్వడం జరుగుతూ వుంటుంది.
అదే విధంగా నారదులవారు తనను సందర్శించినప్పుడు, ఆయన పాదాలకు మెత్తగా వుండేటట్లు మెత్తని పచ్చికను తివాచీగా పరిచి ఆయనకు ఆనందం కలిగించింది. గురుశుశ్రూషలో వింధ్యపర్వతం కూడా ఆనందం పొందింది.
నారదులవారితో సంభాషిస్తూ, యధాలాపంగా,
*'నేను భూమిని భరిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా వున్నది. స్వామీ మీరు త్రిలోకసంచారులు కదా! నేను మేరుపర్వతం కంటే గొప్పవాడిని కాదా ? నాకంటే ఈవిషయంలో మేరు పర్వతం ఏ విధంగా అధికమైనది ?'*
అని స్వోత్కర్ష చేసుకోవడం మొదలుపెట్టింది.
వింధ్యపర్వతం లో అహంకారం పాలు హెచ్చినదని గమనించిన నారదమహర్షి, శిఖరదర్శన మాత్రాననే మోక్షం ప్రసాదించే శ్రీశైలపర్వతంలాంటి అనేక పర్వతాలు వుండగా, ఈ వింధ్య పర్వతానికి ఇంత గర్వమెందుకు? అని భావించి,
*'ఓ వింధ్యపర్వతమా ! ప్రసిద్ధిచెందిన మేరు పర్వతాన్నే నువ్వు కించపరుస్తున్నావు. ఇది నీకు తగదు. అయినా ఇతరుల బలము, బలహీనతల గురించి అలోచించి అనవసరంగా సమయం వృధా చేసుకోవడం మంచిది కాదు'*
అని చెప్పి వెళ్ళిపోయాడు.
* * *
నారదుని మాటలకు వింధ్య పర్వతం కోపం తెచ్చుకుని, అలిగి, మేరుపర్వతం మీద మాత్సర్యం పెంచుకుని, విశ్వేశ్వరుని స్మరించుకుని, సూర్యభగవానుడు మేరుపర్వతాన్ని చుట్టి ఇవతలకు రావడానికి అవకాశం లేకుండా తన పరిమాణాన్ని పెంచి ఆకాశాన్ని అంటింది.
*‘మాత్సర్యముతో మదించినవారు కర్తవ్య విస్మరులై వుంటారని చెప్పుకోవడానికి వింధ్యపర్వతం చేసిన విధానమే నిదర్శనము‘*
* * *
ఆ విధంగా తన పరిణామాన్ని పెంచిన వింధ్యపర్వతము, *'ఇప్పుడు సూర్యుడు గానీ, బ్రహ్మగానీ, నన్ను దాటి దక్షిణ భాగం లోనికి ఎలా ప్రవేశిస్తారో చూస్తాను'* అని తాను చేసిన పనికి సమర్ధించుకుంటూ ఊరట పొందసాగింది.
* * *
ఇది శ్రీ స్కందపురాణంలో కాశీఖండములోని *'వింధ్యావర్ధన వర్ణము'* అనబడే మొదటి అధ్యాయంలోని సంక్షిప్తభాగము.
No comments:
Post a Comment