☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
109. భయం పరస్తాత్ - అభయం తే అర్వాక్
అవతల భయం ఉంది - నీకు అభయం పూర్వమార్గం వలె ఉంది (అథర్వవేదం)
సనాతనమైన ధర్మమార్గమే క్షేమంకరమని వేదమాత బోధ. 'మహాత్మా యేన గతః
సపంథా' - అని భారతవచనం.
సత్పురుషులు సంచరించిన ధర్మమార్గమే మనం అనుసరించవలసినది. శ్రీరాముడు
దీని గుండా వనవాసానికి వెళ్ళినప్పుడు - 'మహర్షులు వెళ్ళిన మార్గమిది ప్రయాణించు' అని ఋషులు చెప్తారు. విశ్వామిత్రుడు, భరద్వాజుడు, శరభంగుడు,
సుతీక్షుడు, అగస్త్యుడు... ఇలా ప్రతి మహర్షి రామునకు ఋషులు నడిచిన మార్గాన్నే నిర్దేశించారు. రాముడు ఆవిధంగానే ప్రయాణించి ధర్మ ప్రతిష్ఠాపన చేశాడు.
ఋషుల మార్గాన్నే అనుసరించాలని ఆ పరమపురుషుని బోధ. రామాయణం -రాముని త్రోవ - ఋషిమార్గమే.
ద్రష్టలైన మహర్షులు అనుగ్రహించిన వేదాధారమైన సనాతనమార్గమే అనుసరణీయం.ఆ ఆచరణలోని ఆంతర్యం మనకి ముందుగా అర్థం కాకపోయినా, క్రమశః పరిణామంలో సత్ఫలితాన్నే పొందగలం. సూతనావిష్కరణలు అవసరమే, కానీ సనాతన ధర్మసూత్రాన్ని వదలకుండా వాటిని వినియోగించుకోవాలి.
పెద్దలు ఆచరించి మనకి అందించిన చక్కని మార్గమే 'సంప్రదాయం'. ఇందులో పవిత్రత, దివ్యత్వం ఉన్నాయి.
పూర్వీకులు అనుసరించిన దానిని తిరస్కరించినప్పుడు, అదో సాహసమైన అనుభూతిగా ఉత్సుకతని కలిగించవచ్చు. కానీ పరిణామంలో అది విషాదాన్నే
మిగుల్చుతుంది.
కొత్తమార్గమని అడుగువేస్తే అది భయంకర పరిణామాలకు దారితీస్తుంది. శీలం,సత్యం, ధర్యం, శౌచం - వంటి సత్పథాలు పాతవే అయినా, భద్రమైనవి. వాటిని
కాదని - సనాతనపు విలువల్ని వదలిన కొత్తదారులు చీకటివైపే తీసుకుపోతాయి.
మా ఏతం పంథాం అనుగాః భీమః ఏషః యేన పూర్వం న ఇయథః...
ఈ మార్గంపై నడువకు. ఇది భీషణము. ఏ మార్గంలో పూర్వులు నడువలేదో ఆ దారి తొక్కకు... అని వేదానుశాసనం. నూతన మార్గావిష్కరణ, సాహసం ఆవశ్యకమే
కానీ సంప్రదాయపు విలువలను పణంగా పెట్టి వాటిని సాధించనవసరం లేదు.
'నవత్వం' పేరుతో కనిపించే ఆకర్షణ ఒక అసురీమాయ.
శరవేగంతో జరుగుతున్న అనేక పరిణామాల హోరులో, ఈ వేదోపదేశం ఒక దిక్సూచి. మన పెద్దలు మనదాకా తీసుకు వచ్చిన కొన్ని విలువలున్నాయి. కుటుంబ
సంబంధాలు, వాటి పట్ల నిబద్ధత, నిజాయితీ, నియమబద్ధమైన జీవనం... ఇవన్నీ కాలంతో నిరూపించబడిన క్షేమమార్గాలు.
నూతనత్వపు ఒరవడిలో చాలా దూరం కొట్టుకువచ్చి, ఏం కోల్పోయామన్నది తెలుసుకొని, ఇప్పుడిప్పుడే నేత్రాలు తెరుచుకొని సనాతన ధార్మిక ప్రమాణాల వల్ల
కలిగే ప్రశాంతత ఏమిటో గ్రహిస్తున్నారు చాలామంది. వారి అనుభవాలు మనకు
గుణపాఠాలు కావాలి.
పైకి కనిపించే ఆహార్యాలలో ఎన్ని మార్పులు వస్తున్నా, అంతర్గతమైన ప్రవృత్తి ఏకాలంలోనైనా ఒకటే. మానవీయమైన ప్రకృతినీ, అనంత విశ్వరహస్యాన్నీ శోధించి,
తపస్సు ద్వారా హితకరమైన మార్గాన్ని ఆవిష్కరించారు ప్రాచీన మహర్షులు. అది శాశ్వాతమైనది కనుక 'సనాతనం'. మన పరిమిత దృష్టిలో దాని విస్తృత ప్రయోజనాన్ని
గ్రహించలేక, ఆ ధర్మజీవన సరళి నుండి వేరైతే, శాశ్వతహితాన్ని పోగొట్టుకుంటాం.
ఒక వ్యామోహం మనల్ని లాగుతున్నప్పుడు, ఒక్క సనాతన ధర్మ సూత్రం తన హెచ్చరికతో తనవైపు రమ్మని పిలుస్తుంది. ఆ సమయంలో ఆ ధర్మసూత్రాన్ని ఆధారంగా గ్రహించి నిగ్రహంతో నిలదొక్కుకున్నప్పుడు పూర్ణమైన జీవన మాధుర్యాన్ని ఆస్వాదించగలం.
అర్థకామ సాధనలో వేగాన్ని నియంత్రించేది ధర్మమే. అది సనాతన సత్పథం.సమాజక్షేమానికి అదొక్కటే శరణ్యం. ఆ విలువలను బోధించి, జీవితాల్లోకి అందించినప్పుడే, ప్రస్తుతం అలముకున్న అనిశ్చిత అవ్యవస్థను పరిష్కరించగలం.
No comments:
Post a Comment