Vedantha panchadasi:
కిం కూటస్థశ్చిదాభాసోఽ థవా కిం వోభయాత్మకః ౹
భోక్తా తత్ర న కూటస్థోఽ సఙ్గత్వాద్భోక్తృతాం వ్రజేత్
౹౹194౹౹
సుఖదుఃఖాభిమాఖ్యో వికారో భోగ ఉచ్యతే ౹
కూటస్థశ్చ వికారీ చేత్యేతన్న వ్యాహతం కథమ్
౹౹195౹౹
వికారి బుద్ధ్యధీనత్వాదాభాసో వికృతావపి ౹
నిరధిష్ఠాన విభ్రాన్తిః కేవలా న హి తిష్ఠితి ౹౹196౹౹
మరి అచట భోక్త ఎవరు ?
కూటస్థము వికారము నొందుట విరుద్ధవచనము గదా. బుద్ధి,చిదాభాసము అనుకున్నా
అధిష్టానము లేకయే తానుగ నిలువజాలవు.
ఉభయాత్మక ఏవాతో లోకే భోక్తా నిగద్యతే ౹
తాదృగాత్మాన మారభ్య కూటస్థః శోషితః శ్రుతౌ
౹౹197౹౹
ఆత్మా కతమ ఇత్యుక్తే యాజ్ఞవల్క్యో విబోధయన్ ౹
విజ్ఞానమయమారభ్యాసఙ్గం తం పర్యశేషయత్
౹౹198౹౹
కోఽ య మాత్మేత్యేవమాదౌ సర్వత్రాత్మ విచారతః ౹
ఉభయాత్మకమారభ్య కూటస్థః శేష్యతే శ్రుతౌ ౹౹199౹౹
శ్రుతి కూడా బుద్ధి ఉపాధిగా కలిగి భోక్తయగు ఆత్మతో ప్రారంభించి కేవలము కూటస్థముతో అంతమగుచున్నది.
యజ్ఞవల్క్యడు కూడా చిదాత్మతో సమాప్తి చేసెను.
వ్యాఖ్య :-ఆత్మయందు భోక్తృత్వాన్ని చూపారు ,
దాని అపవాదం కోసం,
భోక్త యొక్క స్వరూపంలో వికల్పమేంటి -
కూటస్థుడు భోక్తా ?
చిదాభాసం భోక్తా ?లేక ఈ ఇద్దరూ భోక్తలేనా ?
వీరిలో కూటస్థుడు అసంగుడు కాబట్టి అతడు భోక్తకాజాలడు.
కూటస్థుడు అసంగుడైతే మాత్రం - ఆసక్తిలేనివాడైతే మాత్రం - భోక్తృత్వం ఉండటంలో దోషమేముంది ? అంటే -
సుఖము,లేదా దుఃఖము వీటికి సంబంధించిన అభిమానరూపమైనట్టి వికారాన్ని "భోగము" అంటారు. కూటస్థుడు - వికారం లేేనివాడు
అంటూనే మళ్ళీ
వికారి - మార్పు చెందేవాడు అనటం పరస్పరం విరుద్ధంగా ఉంటుంది.
నిర్వికారమైన వాడు వికారి ఎట్లా అవుతాడు ? "కూటములాగా - సమ్మెటలాగా,పర్వతశృంగం" లాగా స్థిరంగా ఉండేవాడు కాబట్టి నిర్వికారి అన్నారు.
నైష్కర్మ్యసిద్ధి 2.77
కాబట్టి సుఖదుఃఖాల యందుండే అభిమానం వల్ల కలిగే వికారం - భోగం , అసంగుడు - చేతనుడు అయిన కూటస్థుని యందు సంభవించదు సరే , చిదాభాస(జీవుడు)
వికారస్వభావం కలవాడే కాబట్టి అతనియందు భోక్తృత్వం ఉండవచ్చు గదా !
చిదాభాసలో వికారం ఉన్నా అధిష్ఠానం లేనిదే చిదాభాస సిద్ధి ఉండదు అని ఇట్లా శంకించవద్దు ఇందుకు పరిహారం -
చిదాభాస(జీవుడు)అనేది వికారస్వభావంకల బుద్ధి ఆధీనంలో ఉన్నందున
"వికారి"అని వ్యవహరింపబడుతోంది.
అందులో వికారం సంభవమే అయినప్పటికి,అది ఆరోపితమైన రూపమైనందున తనకు అధిష్టానమైన కూటస్థ చైతన్యాన్ని వదలి స్వతంత్రంగా ఉండలేదు.ఈ కారణం చేత కేవలం చిదాభాస భోక్త అవటం అనేది సంభవం కాదు.అంటే -
బుద్ది యొక్క వికముల ననుసరించి చిదాభాసము వికృతినొందినను అది కేవలము భ్రాంతియగుటచే అధిష్టానము లేకయే తానుగ నిలువజాలదు.
ఇక మిగిలింది మూడవ వికల్పం ! -పోనీ
కూటస్థుడు,చిదాభాసుడు ఈ రెండూ కలసి భోక్త కావచ్చునా ? అనే విషయం -
కూటస్థుడు,చిదాభాస ఈ రెంటికి విడివిడిగా భోక్తృత్వం సంభవం కానందున ఈ రెంటినీ కలిపి అధిష్టాన సహితమైన చిదాభాసను లోకంలో భోక్తగా చెపుతూవుంటారు.
శ్రుతియందు బుద్దిరూపమైన ఉపాధితో కూడినట్టి
ఆత్మతో(జీవాత్మ)తో ప్రారంభించి బుద్ధి మొదలైనవాటి కల్పనకు ఆధారభూతమైన కూటస్థ చైతన్యాన్నే శేషంగా చెప్పారు.
"అసంగోహ్యయం పురుషః" అనే శ్రుతిలో ఎవనిని అసంగుడైన పురుషుడని అన్నారో అతనినే
"సోఽ యం విజ్ఞానమయః ప్రాణేషు"అనే శ్రుతిలో బుద్ధికి సాక్షిగా చెప్పారు.
ఉభయాత్మకమైన భోక్తృస్వరూపం లోకంలో కూడా కనిపించదు. సామాన్యముగ లోకమునందు ఈ రెండిటి కలయికనే భోక్తగా చెప్పబడుచున్నది.(పరమార్థమున అట్టి కలయికయే సంభవింపదని భావము)
కాబట్టి శ్రుతి తాత్పర్యం అది కాదన్నమాట. శ్రుతి బృహదారణ్యక, బుద్ధి అనే ఉపాధితో కూడిన భోక్తయైన ఆత్మతో ఆరంభించి,చివరకు బుద్ధి మొదలుగా గల అనాత్మ వస్తువులనీ నిషేదించి కూటస్థుడైన చిదాత్మనే అవశేషంగా చెప్పాంది.
బృహదారణ్యక వాక్యం సంక్షిప్తంగా -
రాజర్షియైన జనకుడు యాజ్ఞవల్క్యుని,ఆత్మను గురించి"ఆత్మ అంటే ఏది?"
(కతమ ఆత్మా)అని అడిగాడు.
యజ్ఞవల్క్యుడు అతనికి
"యోఽ యం విజ్ఞానమయః
ప్రాణేషు" - "ప్రాణాల్లో ఉన్న విజ్ఞానమయుడే ఆత్మ" అని చెప్పాడు.ఈ శ్రుతిలో ఇట్లా విజ్ఞానమయునితో ఆరంభించి,
చివరలో
"అసంగోహ్యయం పురుషః" ఈ పురుషుడు(ఆత్మ)అసంగుడు"అని ఈ విధంగా అసంగుడైన కూటస్థునే చివరకు మిగిలి ఉన్నట్టి(పరిశేషంగా)దానినిగా ఆత్మను చెప్పారు.
బృహ.ఉప.4.1.4.
ఇదే విధంగా ఐతరేయాది ఇతర ఉపనిషత్తుల ననుసరించి కూడా ఈ విషయాన్నే చూపిస్తున్నారు.
"కోఽ యమాత్మేతి" "వయముపాస్మహే కతరః స ఆత్మ" ఐ.4.3.1
"మనం ఉపాసించే ఆ ఆత్మ ఏది ? అంటూ ఈ విధంగా శ్రుతులందు సర్వత్రా ఆత్మ విచారణ సందర్భంలో అంతఃకరణం ఉపాధిగా కలిగిన ఆత్మతో ఆరంభించి ప్రజ్ఞాన మాత్ర స్వరూపుడైన కూటస్థునే పరిశేషంగా చెప్పారు.
ఈ విధంగా,ఉభయాత్మకమైన భోక్త మిథ్య అనీ,అసంగుడైన కూటస్థుడు భోక్త కాడనీ తెలుస్తోంది.
భోక్త మిథ్య అయితే,మరి ప్రాణులకు ఆ మిథ్యారూపమైన భోక్తృత్వంలో సత్యత్వబుద్ధి ఎట్లా కలుగుతోంది ?
కూటస్థ సత్యతాం స్వస్మిన్నధ్యస్యాత్మావివేకతః ౹
తాత్త్వికీం భోక్తృతాం మత్వా న కదాచిజ్జిహాసతి
౹౹200౹౹
భోక్తా స్వస్యైవ భోగాయ పతిజాయాది మిచ్ఛతి ౹
ఏష లౌకికవృత్తాన్తః శ్రుత్యా సమ్యగనూదితః
౹౹201౹౹
భోగ్యానాం భోక్తృశేషత్వాన్మా భోగ్యేష్వనురజ్యతామ్ ౹
భోక్తర్యేవ ప్రధానేఽ తోఽ నురాగం తం విధిత్సతి
౹౹202౹౹
యా ప్రీతిరవివేకానాం విషయేష్వనపాయినీ ౹
త్వా మనుస్మరతః సా మే హృదయాన్మాప సర్పతు
౹౹203౹౹
జీవుడు కూటస్థ సత్యత్వము తనపై ఆరోపించి భోక్తృత్వమును విడువ నిచ్ఛింపడు.లౌకికముగా భోక్త భోగముకొరకే అంటుంది శ్రుతి. భోక్తయే ప్రధానము కనుక అతనినే ప్రేమింపవలెను బృహ.ఉప.
ఇతి న్యాయేన సర్వస్మా ద్భోగ్యజాతాద్విర క్తధీః ౹
ఉపసంహృత్య తాం ప్రీతిం భోక్త ర్యేవ బుభుత్సతే
౹౹204౹౹
సక్చన్దన వధూవస్త్ర సువర్ణాదిషు పామరః ౹
అప్రమత్తో యథా తద్వన్న ప్రమాద్యతి భోక్తరి
౹౹205౹౹
కావ్యనాటకతర్కాది మభ్యస్యతి నింన్తరమ్ ౹
విజిగీషుర్యథా తద్వన్ముముక్షుః
స్వం విచారయేత్
౹౹206౹౹
జపయాగోపాసనాది కురుతే శ్రద్ధయా యథా ౹
స్వర్గాది వాంఛయా తద్వత్ శ్రద్దధ్యాత్ స్వ ముముక్షుయా
౹౹207౹౹
విరక్తుడగు సాధకుడు భోక్తయగు ఆత్మయందు ఏమరుపాటు లేక ఉండును. ప్రతిస్పర్థులను జయింపగోరువారిలా ఆత్మవిచారణ ఆత్మయందు శ్రద్ధను ఉంచవలెను.
వ్యాఖ్య:-అసంగుడైన కూటస్థుడు భోక్తకాడు -
భోక్త మిథ్య.మరి ప్రాణులకు ఆ మిథ్యారూపమైన భోక్తృత్వంలో సత్యత్వబుద్ధి ఎలాకలుగుతుంది ?అంటే -
భోక్తయైన జీఆత్మ అవివేక రూపమైన అజ్ఞానంవల్ల కూటస్థమైన చైతన్యం యొక్క సత్యత్వాన్ని తనలో ఆరోపించుకుని తన భోక్తృత్వాన్ని కూడా సత్యమని తలచి ఎన్నడూ భొగాన్ని వదలటానికి ఇష్టపడడు.
సరే ,'ఆత్మ వస్తు కామాయ...'
బృ.4.5.6అనే శ్రుతియందు ఆత్మకోసమే భోగమని అన్నారు గదా ! అనే శంక -
భోక్త తన భోగంకోసమే పతి,పత్ని మొదలైన వాటిని కోరుతున్నాడు;
అనేది లోకానికంతకు తెలిసిన విషయమే !
ఈ విషయాన్నే శ్రుతి బృ.4-4-6
చక్కగా చెప్పింది - అన్య విషయాలనేమీ చెప్పలేదు.
శ్రుతి అట్లా ఎందుకు చెప్పింది ?
భోక్త యందు ప్రేమను విధించటం కోసమే గదా ! అంటే -
"భార్య,భర్త,విత్తం,వాహనం,
స్రక్చందనాది భోగసాధనాలన్నీ,
భోక్త యొక్క అనుభవం కోసమే ! కాబట్టి అప్రధానమైన భోగసాధనాల్లో అనురాగం,
ప్రీతి ఉండరాదు.
ప్రధానమైన భోక్తయందే అనురాగం ఉండాలి" అనటంకోసమే పై శ్రుతి చెప్పబడ్డది.
శ్రుతి బృహ.ఉప:1.4.8;2.4.5.
చెప్పబడిన ప్రేమ అనేది భోక్త అయిన ఆత్మ మీదనే తప్ప భోగాలమీద ఉండరాదు, అని అభిప్రాయం.
భోగ్యవస్తువుల్ని ప్రేమించటం వదలేసి ఆత్మను ప్రేమించాలనే ఈ విషయమై ఈశ్వర ప్రేమరూపంలో ఉండే ప్రార్థనను గురించి స్మృతి వాక్యాల్ని చెపుతున్నారు.
"అవివేకులకు భోగ్యవిషయముల పట్ల ఉండే అంతులేని ప్రీతి నా హృదయంలో తొలగక ఉండి నిన్నే అనవరతము స్మరించునట్లు చేయుగాక -"
"విష్ణుపురాణము 1.20.19 నందు ప్రహ్లాదుని ప్రార్థన ఇది"
అవివేకము వలన విషయములందు గాఢమైన ప్రీతి కలుగును.
ఆ ప్రీతియే వివేకము వలన భగవంతుని యందు నిలచి ఉండును.
ఓ, లక్మీపతీ ! నిన్ను సదా స్మరించటం వల్ల అవివేకులైన వారియందు ఉండే విషయవాసనలమీది వీడరాని దృఢమైన ప్రేమబంధం నా హృదయము నుండి వీడి పోవుగాక !
నామనస్సు విషయవాసనలను వీడి నీయందు లగ్నమైయుండుగాక !
ఇట్లా అని పురాణాల్లో ఉంటే ఉండుగాక !
శ్రుతి విషయమో ? అంటే -
పై విధంగా పురాణాల్లో చెప్పబడినట్లు ఈ న్యాయమును అనుసరించి విరక్తుడగు సాధకుడు విషయ భోగముల యందలి ప్రీతిని ఉపసంహరించి ఆ ప్రీతి ని భోక్తయందు అనగా ఆత్మయందు నిలుపును.
సమస్త భోగ్యాపదార్థాలనుండి విరక్తుడైన బుద్ధిమంతుడు తనకు భోగ్యవస్తువులమీద ఉండినట్టి ప్రీతి నంతనూ తన ఆత్మయందే లీనం చేసి - ఏకీకృతం చేసినందువల్ల కలిగే ఫలాన్ని దృష్టాంతరీత్యా ఏమంటున్నారో చూద్దాం -
పామరజనులు -స్ర్కక్చందన వధూ వస్త్ర స్వర్ణాదులు, (పూలమాలలు, చందనము, యువతులు,వస్త్రములు,బంగారు,డబ్బు) వీని యందు ఎట్లా అప్రమత్తులై - ఏమరుపాటులేక జాగురూకులై సంపాదిస్తూ,అనుభవిస్తూ వుంటారో అదే విధంగా -
ముముక్షువులు కూడా ఆ తత్త్వజ్ఞాన విషయకమైన స్మరణలో ఎల్లప్పుడూ అప్రమత్తులై ఉంటారు. ఆత్మయందు జాగరూకుడై ఏమరుపాటు లేక ఉండును.
సదా ఆత్మచింతన పరులై ఉంటారని భావము.
అప్రమత్తులై ఉండటానికి దృష్టాంతం ఏంటి ? అంటే -
లోకంలో శాస్త్రార్థాలలో ప్రతిస్పర్థులను(ప్రతిపక్షుల్ని)
జయించాలనే పట్టుదలతో విజిగీషువైనవాడు నిరంతరము కావ్యములు, నాటకములు,తర్కాము మొదలగు శాస్త్రములను రాత్రింబవళ్ళూ శ్రద్ధగా, పట్టుదలతో ఎట్లా అభ్యసిస్తాడో అట్లే ముముక్షువు కూడా ప్రతి క్షణమూ ఆత్మవిచారణ అభ్యసించుచూ - ఆత్మచింతనలో అప్రమత్తుడై ఉంటాడు.
స్వార్గాదులైన ఉత్తమలోకాల్ని పొందాలనే కోరికతో జపాలు,యజ్ఞాలు,ఉపాసనాదులను శ్రద్ధగా అభ్యసిస్తూ ,ఆచరిస్తూ వుంటారో అట్లాగే ముముక్షువైనవాడు కూడా "మోక్షకాంక్షి" కాబట్టి శ్రుతులయందు ప్రతిపాదింపబడిన "ఐద్వైతాత్మ" విషయంలో బాగా విశ్వాసాన్ని పొందాలి. మోక్షము కోరే సాధకుడు ఆత్మయందు శ్రద్ధను ఉంచవలెను.
సరే,ఆత్మ చింతనవల్ల కలిగే ఫలమేంటి ?
No comments:
Post a Comment