☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
110. అయజ్ఞయో హతవర్చా భవతి
యజ్ఞం లేనివాడు తేజస్సు కోల్పోతాడు(అథర్వవేదం)
మన సంస్కృతి యజ్ఞసంస్కృతి.
ఆరాధన, సత్కర్మ, త్యాగపూర్వక కర్మ - అని 'యజ్ఞ' శబ్దానికి ప్రధానమైన అర్థాలను చెప్పుకోవచ్చు.
ఒకటి ఇస్తేగానీ, మరొకటి పుచ్చుకోలేం. ఈ 'ఆదానప్రదాన' వ్యవస్థయే యజ్ఞం.ఇది నిరంతరం సృష్టిలో జరిగే ప్రక్రియ.
భగవంతుని విశ్వనిర్వహణనే 'యజ్ఞం' అంటారు. ఆ క్రియ అంతా ఆయన స్వరూపమే కనుక 'యజ్ఞో వై విష్ణుః' - అని శ్రుతి చెబుతోంది. 'విశ్వం విష్ణుః వషట్కారః', 'యజ్ఞో
యజ్ఞపతిర్యజ్వా...' మొదలైన విష్ణునామాలు పరమాత్మనే యజ్ఞస్వరూపంగా బోధిస్తున్నాయి.
భగవదర్పణ బుద్ధితో, విధ్యుక్తమైన సత్కర్మాచరణను యజ్ఞంగా నిర్వచించవచ్చు.
యజ్ఞం, దానం, తపస్సు, మానవులు బుద్ధిని శుద్ధి చేసే సాధనాలు. వాటిని
ఏనాడూ మానకూడదని గీత బోధించింది.
యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ ।
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ॥
యజ్ఞదృష్టితో చేసే కర్మలు చిత్తశుద్ధినివ్వడమే కాక ఆ కర్మలు బంధన కారకాలు కావు - జన్మ పరంపరలలోకి తీసుకు వెళ్ళవు.
నాస్త్య యజ్ఞస్య లోకోవై నాయజ్ఞో విన్దతే శుభం |
అయజ్ఞో న చ పూతాత్మా నశ్యతి ఛిన్నపర్ణవత్ ॥
"యజ్ఞం చేయనివానికి ఇహలోకంగానీ, పరలోకంగానీ సిద్ధించవు. శుభం లభించదు. పవిత్రుడు కాడు. రాలిన ఆకువలె నశిస్తాడు" అని శాస్త్రం చెప్పింది.
నాయం లోకో2స్య యజ్ఞస్య కుతో న్యః కురుసత్తమ ||
உ
"యజ్ఞరహితునికి ఈ లోకమే లేదు (ఇహంలోనే వ్యర్థుడు). ఇంక పరలోకం గురించి చెప్పేదేముంది?" అని శ్రీకృష్ణుని మాట(గీత),
యజ్ఞ ఫలితంగానే ప్రకృతి ద్వారా ఐశ్వర్యా (వర్షం)లను పొందగలం. “యజ్ఞాత్ భవతి పర్జన్యః"(గీత).
మన ఇంద్రియశక్తులు, ప్రకృతి సంపదలు యజ్ఞం వల్ల పొందబడడమే కాక సమర్థతని సంపాదిస్తాయని వేదవిజ్ఞానం. అంతేకాదు. ఆ యజ్ఞఫలితాలు యజ్ఞం వల్లనే శక్తిమంతమవుతాయి.
'యజ్ఞోయజ్ఞేన కల్పతామ్(యజుర్వేదం).
పవిత్రమైన క్రియ, మంచిమాట, సద్భావన - ఈ మూడూ కాయిక, వాచిక, మానసిక యజ్ఞాలు. భగవత్ ప్రార్ధన, జపం, భగవదర్పితమైన స్వధర్మాచరణ, ధ్యాన చింతనాదులు యజ్ఞాలు...
దేవతలకు ప్రీతి కలిగించడం, పితృదేవతలను ఆరాధించడం. ఋషులను స్మరించి వారి వాక్యాలను అధ్యయనం చేసి ఆచరించడం, సాటి మనుష్యులకు అన్నపాన
ధనాదులతో తృప్తిని కలిగించడం, ప్రాణికోటిని ఆనందింపజేయడం....
ఇవి ప్రధాన యజ్ఞాలు. ఆత్మవిచారణ, ఇంద్రియ నిగ్రహం వంటి సత్సాధనాలను కూడా యజ్ఞాలుగా
వర్ణించాయి శాస్త్రాలు.
ఈ యజ్ఞాలేవీ లేకుండా స్వార్థపరులై, భౌతిక జీవితమే సత్యమనే భ్రమతో బ్రతికేవారు ‘అయజ్ఞులు'.
వారిని “అఘాయురింద్రియారామో మోఘః పార్థ సజీవతి" అని గీతాచార్యుడు పేర్కొన్నాడు.
యజ్ఞరహితుడు - పాపజీవనుడు, కేవలం ఇంద్రియ సుఖమే సర్వస్వమనుకొనేవాడు,
వ్యర్థజీవి.
యజ్ఞమయ జీవనమే భారతీయసంస్కృతి ప్రపంచానికి అందించిన దివ్యబోధ.
No comments:
Post a Comment