Thursday, February 20, 2025

 *ఈరోజు పురాణ కథ మారీచుఁడు గురించి చెప్పుకుందాం*
తాటకయొక్క కొడుకు. సుబాహుని అన్న. మిక్కిలి టక్కులమారి. విశ్వామిత్రుఁడు యాగమును చేయ యత్నింపఁగా మారీచ సుబాహువులు ఆయజ్ఞమునకు విఘ్నము చేయ వచ్చిరి. అపుడు విశ్వామిత్రుఁడు అయోధ్యకు పోయి దశరథుని అడిగి రామలక్ష్మణులను పిలుచుకొనివచ్చి తన యాగమునకు విఘ్నముచేయ వచ్చువారిని సంహరింపుము అని చెప్పఁగా, రాముఁడు ఆగ్నేయాస్త్రము ప్రయోగించి సుబాహుని చంపి, వాయవ్యాస్త్రమును ప్రయోగించి మారీచుని సముద్రమున పడునట్లు చేసెను. అంతట మారీచుఁడు రాముని పరాక్రమము ఎఱిఁగినవాఁడు అయి అతని తెరువుకు పోరాదు అని దక్షిణసముద్రతీరమున ఆశ్రమముకావించుకొని అచ్చట తపస్సు చేయుచు ఉండెను. అనంతరము వనవాసము చేయవచ్చిన రాముఁడు దండకారణ్యమున ఉండఁగా, రావణుఁడు అతని భార్యను ఎత్తుకొనిపోవుటకు ఈమారీచుని సహాయము కోరెను. అప్పుడు వీఁడు రాముని పరాక్రమమును వానికి తెలిపి ఆకార్యము వలదు అని బహుభంగుల బోధించియు వాఁడు వినకపోయినందున తాను ఒక బంగారు జింక అయి రాముని ఆశ్రమమునకు ఎదుట పచ్చిక మేయుచు ఉండెను. సీత దానిని చూచి దాని రూపరేఖాలావణ్యాది గుణములకు సంతసిల్లి తోడనే ప్రియునకు తెలిపి దానిని తనకు పట్టి ఇయ్యవలయును అని ప్రార్థించెను. అంతట రాముఁడు దాని పట్టఁబోయి అది తనకు చిక్కక పరుగెత్తఁగా దానిని తఱుముకొని బహుదూరము పోఁయి మాయామృగము అని ఎఱిఁగికొని బాణప్రయోగము చేయఁగా మారీచుఁడు నిజరూపమును పొంది "హాసీత హాలక్ష్మణ" అని అఱచుచు ప్రాణములు విడిచెను. ఆకూఁతవిని సీత దిగులుపడి రామునకు ఏమో ఆపద పొసఁగినట్లు ఉన్నది, నీవు పోయి ఆ ఆపద తొలఁగించి పిలుచుకొని రమ్ము అని లక్ష్మణుని పంపెను. ఆసమయమున ఒంటరిగా ఉండెడు ఆమెవద్దకు సన్యాసివేషముతో రావణుఁడు వచ్చి ఆమెను ఎత్తుకొని పోయెను.

No comments:

Post a Comment