Vedantha panchadasi:
జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపఞ్చం యత్ర్పకాశతే ౹
తద్ర్బహ్మాహమితి జ్ఞాత్వా సర్వబన్తిః ప్రముచ్యతే
౹౹213౹౹
ఏక ఏవాత్మా మన్తవ్యో జాగ్రత్ స్వప్న సుషుప్తిషు ౹
స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ
న విద్యతే
౹౹214౹౹
త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ ౹
తేభ్యో విలక్షణః సాక్షీ చిన్మాత్రోఽ హం సదాశివః
౹౹215౹౹
జాగ్రత్ స్వప్న సుషుప్తి ప్రపంచములను ప్రకాశింపజేసే ఆ బ్రహ్మమే తాను అని తెలిసికొని సర్వబంధముల నుండి ముక్తుడగును.
వ్యాఖ్య :- అవస్థాత్రయ ప్రపంచమును చూచుచున్న ద్రష్ట మూడు అవస్థలయందును ఒకడే అనుటకు,
మరియు భోక్తయొక్క స్వరూపాన్ని వివేచనచేసే వేరొక శ్రుతిని చూద్దాం -
జాగ్రత్ స్వప్న సుషుప్తి ప్రపంచములను ప్రకాశింపజేసే ఆ బ్రహ్మమే తాను అని తెలిసికొని సర్వబంధముల నుండి ముక్తుడగును -
కైవల్యోపనిషత్ 1.17
జాగ్రత్ స్వప్న సుషుప్తు లయందున్న ఆత్మ ఒకటియే అని భావింపవలెను.
అమృతబిందు ఉపనిషత్తు:11
మూడు ధామములందూ గల భోగ్యవిషయములు ,
భోక్తలు , అనుభవముల కంటే భిన్నుడు - సాక్షిమాత్రుడు -
సర్వదా ఆనందస్వరూపుడనే నేను -
కైవల్య ఉప: 1.18
"సాక్షిరూపంలో అన్ని అవస్థలయందున్న ప్రపంచమును ప్రకాశింపజేసే బ్రహ్మమునేనే !"
అనేటటువంటి నిశ్చయాన్ని
శ్రుతిద్వారా తెలుసుకుని ప్రమాతృత్వ - కర్తృత్వ
సర్వ బంధనాల నుండి విముక్తుడై అనుభవంద్వారా ముక్తుడగుచున్నాడు.
జాగ్రత్ స్వప్న సుషుప్తుల్లో ఉండేది ఒకే చిద్రూపమని అని తెలుసుకోవాలి.
ఈ విధమైన వివేకజ్ఞానంతో ఆత్మ అనేది మూడు అవస్థలకు అతీతమైనదని - అది తానే అయి అతీతముగా వున్నానని నిశ్చయించుకోవడం వలన,
పునర్జన్మ ఉండదు.
అంటే -
ఈ శరీరపాతం తరువాత వేరొక శరీరాన్ని ధరించటం ఉండదు.
జాగ్రదాది మూడు ధామాల్లోను
- అవస్థల్లోనూ క్రమంగా
స్థూల సూక్ష్మ ఆనంద రూపాలలో ఉండే భోగ్యవస్తువు ,
విశ్వ తైజస ప్రాజ్ఞ రూపాలలో ఉండే భోక్త ,
ఆ భోక్తకు అనుభవరూపమైన ఏ భోగాలు ఉన్నాయో - ఆ అవస్థలన్నింటికి అతీతమైనట్టి
విలక్షణ స్వభావం కల చిన్మాత్రుడు , సాక్షి ;
నిరతిశయానందరూపం కలిగి ఉన్నవాడే
సదాశివుడు - పరమాత్మ.
ఆత్మచైతన్యము స్వయంగా "అనుభూతిరూపం" కలది అయినందున ఎవరికీ అనుభావ్యవిషయం - అనుభవింపదగిన విషయం కాజాలదు.
నిత్యజ్ఞాన స్వరూపం, స్వయంప్రకాశం కాబట్టి - జ్ఞాత,జ్ఞానము అనేవిలేవు కాబట్టి జ్ఞానానికి విషయం కాజాలదు.అంతేతప్ప అసద్రూపమైనందున జ్ఞేయం కావటంలేదు అని అనుకోరాదు.స్వప్న,సుషుప్తాదులకు సాక్షి రూపంలో ఉంటూ ఉన్నందున అసత్తుకాదు.
విశ్వుడు తైజసుడు ప్రాజ్ఞుడు మూడు అవస్థలయందలి భోక్తలుగా - చైతన్యస్వరూపమైన పరమాత్మగా -
ఆ చైతన్య స్వరూపమే "నేను".
"అతడే నేను".
ఈ విధంగా ఆత్మతత్త్వం అసంగమని - ఆసక్తిరహితమని
నిశ్చయమైన పిమ్మట భోక్తకత్వం ఎవరికి
ఉంటుంది ? అంటే -
ఏవం వివేచితే తత్త్వే విజ్ఞానమయశబ్దితః ౹
చిదాభాసో వికారీ యో భోక్తృత్వం తస్య శిష్యతే ౹౹216౹౹
మాయికోఽ యం చిదాభాసః శ్రుతేరనుభవాదపి ౹
ఇంద్రజాలం జగత్ర్పోక్తం తదన్తఃపాత్యయం యతః
౹౹217౹౹
ఆత్మను వివేచించగా మిగులునది చిదాభాస అది జీవుడే.
వ్యాఖ్య:- పరమాత్మ తత్త్వం అసంగం కదా మరి భోక్త ఎవరు అని ఈ విధంగా ఆత్మతత్త్వాన్ని గూర్చిన వివేచన చేసిన పిమ్మట "విజ్ఞానమయుడు" అనే పేరున ఉన్నట్టి ,
వికార స్వభావుడు,
చిదాభాసరూపుడు అయిన జీవుడే భోక్తగా మిగిలి ఉంటాడు - అతని భోక్తృత్వమే మిగిలి ఉంటుంది.
చిదాభాసకే - జీవునికే భోక్తృత్వం అని అంగీకరిస్తే
"కస్యకామాయ" -
"ఎవని కోరిక కొరకు" అనే శ్రుతికి విరోధం వస్తుంది - భోక్తలేడని చెప్పడం వల్ల ! అని ఆక్షేపం ! కాగా ; సమాధానం -
ఈ జగత్తు ఇంద్రజాలమని చెప్పబడినది.చిదాభాసుడు ఈ జగత్తులోనివాడే కనుక చిదాభాసుడు మాయాకల్పితుడు,మిథ్య.
చిదాభాస మాయికము - మిథ్య
అనే విషయము
"జీవేశావాభాసేన కరోతి "
నృసింహోత్తరతాపిన్యుపనిషత్
- 9;శ్వేతాశ్వతర ఉపనిషత్,
-4.9 -10; కైవల్యోపనిషత్తు
-1.12-14.
అనే శ్రుతిననుసరించి, అనుభవప్రమాణాన్ననుసరించీ కూడా తెలుస్తూనే ఉంది.
జగత్తులాగానే
చిదాభాస- జీవుడు కూడా నాశస్వభావం కలదని అనుభవం ద్వారాకూడా తెలుస్తోంది.
"కస్యకామాయ"అనే శ్రుతి భోక్తలేకుండుటను సూచించుచున్నది.
ఇపుడు చిదాభాసుడే భోక్తయనుట స్వవచోవ్యాఘాతము కదా అనే సంశయము వారింపబడినది.పరమార్థమున భోక్త లేడనుట సత్యమే, భోక్తయనబడుచున్న చిదాభాస మిథ్య కనుక.
పరమాత్మ కన్నా భిన్నమయినదంతయు మిధ్య.
మిథ్యా వస్తువులవలన సత్యమయిన అధిష్టానము చెడదు.
స్వప్నంలో దరిద్రడయిన రాజు జాగరణంలో దరిద్రుడు కాడు.
పరమాత్మ అసంగం.
కర్త కాదు,భోక్త కాదు.
జీవన్ముక్తుడు - జ్ఞాని దృష్టియందు జగత్తు తుచ్చము.
కనుక ప్రపంచము ఒక మిధ్య.
కావున కర్త లేడు,సాక్షి లేడు,
సాక్ష్యము లేదు.
ప్రపంచము వుందని తలచిననాడే పై బిరుదులు.
No comments:
Post a Comment