Tuesday, September 30, 2025

 🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺

*శ్రీ శైలం లో దేవీ నవరాత్రులు -* 
*నవదుర్గలు - (9)*
🙏 *శ్రీ సిద్ధిదాత్రిదేవి*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌺 *సిద్ధిధాత్రి మాత*

*సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి*
*సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ!!*

🌻 *సిద్ధి అంటే..*

సిద్ధిదాత్రి ప్రసాదిని అమ్మవారిని స్వచ్ఛమైన మనసుతో, నిజమైన భక్తితో ఆమె ప్రార్థించే భక్తులకు సిద్ధిని ప్రసాదిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది. సిద్ధి అంటే ఆధ్యాత్మిక మరియు మాయా సామర్థ్యాలు. ఇవి మనతో ఉంటే మన జీవితంలో మనకు ఎంతటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా గొప్పగా విజయం సాధించడానికి సిద్ధి సహాయపడుతుంది.

సిద్ధిదాత్రి దేవత సిద్ధిల దేవత. ఈ దేవి ఎల్లప్పుడూ ప్రశాంతమైన రూపంలో ఉంటుంది. తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. 
ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. 
ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయక మైన అమృతపథం సంప్రాప్తిస్తుంది. దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది.

🌻 *మార్కండేయ పురాణంలో....*

1) అణిమ, 
2) మహిమ, 
3) గరిమ, 
4) లఘిమ, 
5) ప్రాప్తి,
 6) ప్రాకామ్యము, 
7) ఈశిత్వము,
 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి.

🌻 *బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి.* 

అవి.
1) అణిమ, 
2) లఘిమ, 
3) ప్రాప్తి, 
4) ప్రాకామ్యము, 
5) మహిమ, 
6) ఈశిత్వ వశిత్వాలు, 
7) సర్వ కామావసాయిత, 
8) సర్వజ్ఞత్వం, 
9) దూరశ్రవణం, 
10) పరకాయ ప్రవేశం, 
11) వాక్‍సిద్ధి, 
12) కల్పవృక్షత్వం,
13) సృష్టి, 
14) సంహారకరణ సామర్థ్యం, 
15) అమరత్వం, 
16) సర్వ న్యాయకత్వం, 
17) భావన 
మరియు 
18) సిద్ధి.

సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృప వలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది.
ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమ వైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శన మిస్తుంది. 'సిద్ధిధాత్రీ దుర్గా,  'నవదుర్గల్లో తొమ్మిదవ,  ఆఖరి  అవతారం.  నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు ఈ  అమ్మవారిని పూజిస్తారు. 
సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, 
ధాత్రీ అంటే  ఇచ్చేది. 
భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిధాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం.తామరపువ్వులో 
కూర్చుని ఉండే సిద్ధిధాత్రీ దుర్గాదేవికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయి. 

ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిధాత్రీ దుర్గా దేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి.
సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీ పురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. 

ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును.
ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. 

నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.
ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథము లన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు  కోరికలెవియును  మిగిలియుండవు.అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మయత్వమున నిజమైన, పరమానంద దాయక మైన అమృతపదము ప్రాప్తించును.
నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే.
తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.

ఈ సిద్ధిదాత్రి  మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.

మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతోఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకుల యొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి.
సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు.ఆ దేవీ కృపా రసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.

దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానంద దాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.

🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺

No comments:

Post a Comment