*_ప్రపంచంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు. ఎవరూ కష్టాలు కావాలని కోరుకోరు. చాలామంది తాము అనుభవిస్తున్నది నిజమైన సుఖమని అదే ‘జీవితపరమావధి’ అని అపోహలో పడి జీవిస్తున్నారు._*
*_నిజానికి, శాంతిలేనిదే సుఖం లభించదు. లేనిపోని అనవసరపు ఆలోచనలు, విషయ లంపటాలపై ఆసక్తి... ఇత్యాదులను త్యజిస్తే శాంతి లభిస్తుంది._*
*_దృశ్య పదార్థాలతో, విషయ భోగాలతో లభించే సుఖం నిజమైన సుఖం కానేరదని గీతాచార్యులు చెబుతున్నారు. అది ప్రతిబింబ సుఖం, క్షణిక సుఖం, దుఃఖమిశ్రిత సుఖం._*
*_ఇది కాదు మనిషికి కావలసింది!అవిచ్ఛిన్న, పరిపూర్ణ నిరతిశయ సుఖం. అది కావాలంటే చిత్తంలో శాంతి ఏర్పడాలి!_*
*_నశ్యర, అంటే నాశనమయ్యే ప్రాపంచిక పదార్థాల గురించి చింతించినందువల్ల శాంతి లభించదు. శాశ్వతమైన ఆత్మ గురించి, దైవం గురించి చింతించడం వల్ల చిత్తంలో శాంతి నెలకొంటుంది._*
*_మనోనైర్మల్య స్థితితోనే ఆత్మచింతన, వివేకం ఉదయిస్తాయి. చిత్తం విషయాలవైపు పరుగులు తీయక, దృశ్య వాసనలు లేనప్పుడే బుద్ధి నిర్మలంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉండి, మనస్సంయమనం కలిగితే బుద్ధి పరిశుద్ధమవుతుంది. మనసు నిర్మలంగా ఉంటే దుఃఖరాహిత్యం, ఆనంద ప్రాప్తి కలుగుతాయి._*
*_పూర్వకాలంలో నగరానికి ద్వారాలుండేవి. ఆ నగరంలో రాజు ఉండేవాడు. ద్వారాలు సురక్షితంగా ఉన్నప్పుడే రాజు సుఖంగా ఉండగలడు._*
*_గీతాచార్యులు మానవ శరీరాన్ని పురంతో పోల్చాడు. ఆ పురానికి తొమ్మిది ద్వారాలున్నాయి. అవి కంటి ద్వారాలు 2, చెవి ద్వారాలు 2, ముక్కు ద్వారాలు 2, నోటి ద్వారం 1, మూత్రద్వారం 1, మల ద్వారం 1. స్పర్శ ద్వారం శరీరమంతటా వ్యాపించి ఉంటుంది._*
*_ఆత్మలో నిలకడ కలగాలంటే శబ్దాది విషయాల నుంచి మనసు మరలాలి. బాహ్యవిషయాల పట్ల ఆసక్తిలేని మనసు అంతర్ముఖమై ఆత్మయందు స్థిరత్వం పొంది అక్షయ సుఖం పొందుతుంది._*
*_అక్షయ సుఖమంటే ఎప్పటికీ నిలిచేది. అటువంటి సుఖం తన ఆత్మలోనే ఉందని గ్రహించక విషయాదులందు లభించే సుఖం కోసం మనిషి అర్రులుచాస్తాడు._*
*_కాని ఇది అశాశ్వతమైనది. పైగా దుఃఖభూయిష్ఠమైనది. అది ప్రతిబింబ సుఖం. బింబభూతమైన సుఖం ఆత్మయందే నిక్షిప్తమై ఉంది. ఆత్మ సుఖమే వస్తువులయందు ప్రతిబింబించి విషయ సుఖంగా వ్యక్తమవుతుంది. ఆత్మ సుఖం అనుభవించాలంటే విషయ సుఖాన్ని త్యాగం చేయడం తప్పనిసరి!_*
*_విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే సుఖం నిజమైన సుఖంకాదు. పైకి కాస్త సుఖంగా తోచినా లోపల అపారదుఃఖం నిండిఉంటుంది._*
*_అందుకే శ్రీకృష్ణుడు దీన్ని ‘దుఃఖయోని’ అన్నారు. విజ్ఞులు దాన్ని కోరుకోరు. విషయాలను అనుభవించేవాడు అందులో నిబిడీకృతమై ఉన్న దుఃఖాన్నీ అనుభవించడానికి సంసిద్ధమై ఉండాలి._*
*_దృశ్య సౌఖ్యంలో రెండు దోషాలున్నాయి. పైకి సుఖంగా కనిపించినా లోపల దుఃఖం దాగిఉంటుంది. ఆద్యంతాలు అందువల్ల క్షణికాలై వర్తించడం, అంటే- దుఃఖ జనకత్వం, క్షణికత్వం అను రెండు ప్రబల దోషాలు విషయభోగాలతో ఉన్నాయి. కాని, ఆత్మసుఖం అలా కాదు. దీనితో దుఃఖం ఇసుమంతైనా ఉండదు. అతిచిన్న సుఖమది. శాశ్వతమైనది._*
*_సుఖాన్ని కోరుకునేవారు ముందుగా తనలోఉన్న ముఖ్యమైన శత్రువులైన కామక్రోధాలను జయించాలి. అరిషడ్వర్గాల్లో కామక్రోధాలు ముఖ్యమైనవి.అజ్ఞానాంధకారంతో కొట్టుమిట్టాడు తున్నవారు దీన్ని కొట్టిపారేసి ఎండమావిలో నీటికోసం వెదుకుతుంటారు._*
*_దుఃఖంలోకి దించే పైకి కనిపించే నిజమని నమ్మి వాటికొరకు పరితపించడం విచారకరం. ఆత్మసుఖాన్ని కోరేవారు తమ శక్తినంతటినీ అంతర్ముఖంగా మళ్లించి ధన్యులవుతారు!_*
*_సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.🙏_*
No comments:
Post a Comment