Saturday, May 25, 2024

*****ఈ కాలపు తెలుగు భాష

 ఈ కాలపు తెలుగు భాష

 జననీ,జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ - మాత, మాతృభూమీ స్వర్గంతో సమానమన్నారు. అందులో మాతృభాషను కూడా చేర్చాలి. జన్మతః నేర్చుకున్న భాష కూడా స్వర్గతుల్యమైనదే. ఆ భాషను మాతృభాష అన్నారు కాని పితృ భాష అనలేదు. ఎందుచేత? శిశువుకు తొలి గురువు తల్లియే. శైశవంలో మొట్టమొదటిగా మాటలు నేర్పేది ఆమెయే. అలా మాతచే నేర్పబడిన భాషయే మాతృభాష.

కాని నేటి తెలుగు ఎలా ఉందంటే - ఒకనాడు ఐదవ ఏట అక్షరాభ్యాసం చేయించి పెద బాలశిక్ష నేర్పగా రామాయణాది మహాకావ్యాలనూ,భారతం మొదలైన గొప్ప ఇతిహాసాలనూ, భాగవతం మొదలుకొని అష్టాదశ పురాణాలనూ చదవగలగడమే కాకుండా కంఠస్థం చేసినవారూ, కవులయినవారినీ మనం చూసాం. మరి నేడు మూడవ ఏటనే పిల్లలను ఆంగ్లమాధ్యమ పాఠశాలలకు ( కాన్వెంట్లకు ) పంపుతున్నారు. మా పిల్లలు నర్సరీ,ఎల్ కే జీ, యూ కే జీ అని చెప్పుకుని సంబరపడిపోతున్నారు. ఇలా ఆంగ్లభాష పట్ల ఆకర్షితులై ఇళ్ళల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, బా బా బ్లాక్ షీప్ ... అని ఆంగ్లంలో రైమ్స్ నేర్పడంలో ఆసక్తి చూపిస్తున్నారు. కాని దాశరథీ శతకం, వేమన శతకం, భాస్కర శతకం వంటి శతకాలలోని పద్యాలు నేర్పడంలేదు. అందుచేత చిన్నప్పటినుండీ పిల్లలకు భక్తి అంటే ఏమిటో, నీతి అంటే ఏమిటో తెలియకుండా పోయింది. తెలుగు పద్యమే పరాయిదయిపోయింది.

నడచి వెళ్లేవారికంటే సైకిల్ పై వెళ్లేవారూ, వారికంటే మోటార్ వాహనంపై వెళ్లే వారూ తమను ఎక్కువగా ఎలా భావించుకుంటారో అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికంటే కాన్వెంట్ లలో చదివేవారూ,ఆంగ్లమాధ్యమంలో చదివేవారూ తమను తాము అధికులుగా భావించుకుంటారు. ఆ కారణంగా తెలుగు మాధ్యమంలో చదివే పిల్లలూ, వాళ్ళ తల్లిదండ్రులూ ఒక విధమైన ఆత్మన్యూనతా భావాన్ని పొంది తెలుగు మాధ్యమం పట్ల విముఖత, ఆంగ్లమాధ్యమ కాన్వెంట్లపై మోజు పెంచుకోవడం జరుగుతోంది.

అలాగే తెలుగు మాధ్యమంలో చదవడం శుద్ధ దండుగ,ప్రయోజనం ఉండదనీ, వేలు పోసైనా ఆంగ్లమాధ్యమంలో చదివితేనే మంచి మార్కులూ, రేంకులూ వస్తాయనే నమ్మకం ఇటు విద్యార్థులలోనూ, అటు వారి తల్లిదండ్రులలోనూ ప్రబలిపోయింది. దానికితోడు కళాశాలలకొచ్చేసరికి ప్రథమ భాష ఆంగ్లం గానూ, ద్వితీయ భాష తెలుగో, హిందీయో లేక సంస్కృతమో ఉంటుంది. ఇక్కడే తెలుగు ప్రథమ స్థానాన్ని కోల్పోయింది. మాతృభాష తెలుగు అయినవారు కూడా తెలుగును ద్వితీయ భాషగా తీసుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించలేమనే అపోహతో హిందీయో లేక సంస్కృతమో తీసుకుంటుంటారు. అలాగని వారు హిందీ భాషాభిమానులూ, సంస్కృత భాషాభిమానులూ అని కాదు. వారి అభిమానం కేవలం మార్కులమీదే.

విద్యావంతులూ, ఉద్యోగులూ పత్ర వ్యవహారాలన్నీ ఆంగ్లంలోనే చేస్తున్నారు. అవి అన్నీ ఆంగ్లంలోనే ఉంటున్నాయి కాబట్టి తప్పదు. కాని మరెక్కడ సంతకం పెట్టవలసివచ్చినా ఆంగ్లంలోనే కాని తెలుగులో పెట్టేవారుండరంటే అతిశయోక్తి కాదు. ఒకవేళ ఎవరైనా తెలుగులో సంతకం పెట్టినా వింతగా చూస్తారు. ఇదీ నేటి తెలుగు భాష స్థితీ, గతీను. తన సహోద్యోగిగాని, తన పై ఉద్యోగిగాని,తన పై అధికారిగాని తెలుగు భాషేతరుడు అయినప్పుడు వారితో ఆంగ్లంలో మాట్లాడడం తప్పనిసరి. కాని తెలుగువారే అయినప్పుడుకూడా ఆంగ్లంలో మాట్లాడడం గొప్పగా, ఓ కళగా ఓ చతురతగా భావించేవాళ్లున్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా రైళ్ళలో ఆంగ్లనవలలను చదువుతుంటారు తెలుగులో సాహిత్యమే లేనట్లు. తాము విద్యాధికులమై ఉండి కూడా తెలుగు పుస్తకాలు చదివితే ఉన్నత విద్యావిహీనునిగా భావిస్తారని అనుకునేవాళ్లున్నారంటే విచిత్రమేమీకాదు.చలనచిత్ర విషయాల్లోనూ అంతే. ఆంగ్ల చలనచిత్రాలు చూసేవారు తెలుగు చలనచిత్రాలు చూసేవారికంటే తాము ఆంగ్లభాషాజ్ఞానం ఉన్నవారమని భావిస్తుంటారు.

సాహిత్య విషయమే తీసుకుందాం.సాహితీ ప్రియుల్నీ,సాహిత్యాభిమానుల్నీ తప్పిస్తే సామాన్య ప్రజానీకం పద్యం అంటే పారిపోతున్నారు.గద్యం అంటే గాబరాపడిపోతున్నారు. కవిత్వానికి తోక కత్తిరించేసి కవితలను చేసేస్తున్నారు.అంటే “కవిత్వం” అన్న పదానికి తోక కత్తిరించేస్తే “కవిత” అవుతుంది. దానికి ఛందస్సూ అక్కర్లేదు, యతీ అక్కర్లేదు, ప్రాస కుదిరితే చాలు.లేకపోతే లేదు. వినేవాడొక్కడుంటే చాలు. మొదటిసారి వినకపోతే రెండవసారైనా వింటారేమోనని ప్రతి పంక్తీ రెండేసిసార్లు చదువుతుంటారు.పూర్వం “కందం వ్రాసినవాడు కవి” అనేవారు.ఇప్పుడు కవితలు వ్రాసినవారల్లా కవులే.ఇదీ సాహిత్యానికి పట్టిన గతి. తీయనైన మన తెలుగు భాషలోని కావ్యాలూ,ఇతిహాసాలూ,పురాణాలూ, వాటి గురించి తెలుగువారై ఉండి కూడా తెలియని వాళ్లున్నారంటే మన తల్లి గురించి మనకు తెలియనట్లే. ఇలా ఆంగ్లభాషకున్న ఆదరణ మన మాతృభాష అయిన తెలుగుకు కరువయిపోయింది.మేటి తెలుగు భాష - నేటి వెలుగు భాష చూడండి.ఈ పరిస్థితి మారితీరాలి.

No comments:

Post a Comment