Friday, November 8, 2024

 *మానవ జీవితానికి కృతజ్ఞతాభావం అవసరం!*

ఎందుకు?
తన దగ్గర ఉంచుకుని ఇతరులకు పెట్టకుండా కేవలము తానే భుజించువాడు దొంగ అని గీత బోధిస్తుంది.

వర్షములు కురిపించి, భూమిని సారవంతము చేసి, పంట మొక్కలలో జీవమును నింపి అన్నము మొదలగు ఆహార పదార్థాలను భగవంతుడు ఇస్తున్నాడు.

దానికి గాను మనం ఏమి చేయాలి?
“ఓ భగవాన్! నీ దయవలన నేను ఆహారం తింటున్నాను” అని తాను తినే ఆహారమును పరమాత్మకు సమర్పించి తరువాత తాను తినాలి.

అలాగే పితృదేవతలకు, సాటి మానవులకు, జంతువులకు, పెట్టాలి, తాను తినేముందు పరమాత్మకు నివేదించకుండా తినేవాడు ఎంత విద్వాంసుడైనా, ధనవంతుడైనా, గొప్పవాడైనా, రాజైనా భగవంతుని దృష్టిలో అతడు దొంగతో సమానమే.

మరి దొంగకు శిక్ష పడాలి కదా! 
ఈ రోజుల్లో సంభవించే అతివృష్టి, అనావృష్టి,వ్యాధులు,అగ్నిప్రమాదాలు, భూకంపాలు, తుఫానులు, నయం కాని రోగాలు, వింత వింత వ్యాధులు, ఇటువంటివి అన్నీ వీటికి శిక్షలే,...

ఇకనైనా తేరుకుని మనకు ఉన్నది ఈశ్వరునికి అర్పించడం, అతిథులకు పెట్టడం, పేదవారికి, లేని వారికి ఉన్నంతలో సాయం చేయడం, జంతువులకు ఆహారం పెట్టడం, ప్రకృతిని ఆరాధించడం, భగవంతుని మీద భక్తి కలిగి ఉండటం పరోపకార దృష్టి అలవరచుకోవడం మొదలగు వాటి ద్వారా భగవంతునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి...

ఏ దోషమునకైనా, నేరానికైనా, పరిహారం ఉంటుంది, చివరకు హత్య పాతకానికి కూడా పరిహారం ఉంటుంది...

కానీ కృతఘ్నుడికి అంటే చేసిన మేలు మరిచిపోయేవాడికి - పరిహారం అంటూ ఏమీ లేదు!

కనుక మనం ఆ పరమాత్మకు, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు అన్నీ సమకూర్చే పంచభూతములకు సతతం కృతజ్ఞతాభావంతో ఉండుట అత్యంత ముఖ్యమైన విషయం...         

No comments:

Post a Comment