*రమణ మహర్షి సంభాషణలు*
నాల్గయిదు రోజులక్రితం ఒకరు వచ్చాడిక్కడికి. వచ్చిన మరుదినం ఉదయం పది గంటలకు జ్యోతిషశాస్త్ర రీత్యా భగవాన్ శ్రీరమణులను చాలా అంశాలపై ప్రశ్నిస్తే భగవాన్ సయుక్తికంగా బదులిచ్చారు.
సారాంశం ఏమంటే, "స్వామీ ! జ్యోతిషశాస్త్రరీత్యా అది అప్పుడు జరుగుతుంది, ఇది ఇప్పుడు జరుగుతుంది, అది ఆ గ్రహబలము, ఇది ఈ గ్రహబలము అని చెపుతారే, అది యథార్థమేనా ? అన్నది వారి ప్రశ్న.
'నేను అనే అహం ఉన్నంతవరకూ అన్నీ నిజమే. ఆ అహం నశించినప్పుడు ఏదీ నిజం కాదు' అని సెలవిచ్చారు భగవాన్.
అయితే అహం నశించినవారికి జ్యోతిషం యథార్థం కాదంటారా ? అన్నారా పృచ్ఛకులు.
“కాదనేందుకేమున్నదండీ. శరీరంలో చూచేవాడుంటేనే చూడటం ఉంటుంది. అహం నశించినవారు చూచినా చూడనివారే. కిటికీ తెరిచే వుంటుంది.
లోపల చూచేవాడుండి చూడాలి. కాని కిటికీ చూస్తుందా ?” అన్నారు భగవాన్.
“తాను లేకుంటే శరీర జీవనయాత్ర ఏ విధంగా సాగుతుంది ?" అన్నారా పృచ్ఛకులు.
"అదే అదే. శరీరం మనకొక ఇల్లు. నీవుంటేనే ఈ ఇల్లు బాగుంటుంది కాని లేకుంటే బాగుండదు. అందువల్ల, మనం ఉన్నంతవరకూ నివాసయోగ్యంగా చేసుకుంటున్నాము అన్న విషయం తెలుసుకొని, ఆ తెలివిని సదా విడువకుండా వుండాలి. విడిస్తే శరీరం నేననే భావన వచ్చి బాధిస్తుంది. అప్పుడన్నీ యథార్థమే. ఆ భావన నశించడమే అహం నాశనం. ఆ అహంత నశించినప్పుడు ఏదీ నిజం కాదు. జరిగేది జరుగుతుంది. జరగనిది జరగనే జరగదు” అని సెలవిచ్చారు భగవాన్.
జరిగేది జరుగుతుంది. జరగనిది జరగనే జరగదని సెలవిస్తారే, ఇక మంచి చేయాలని అనడం ఎందుకు ?” అని మళ్ళీ ప్రశ్న.
మంచి చేస్తే సుఖం కలుగుతుంది. అందువల్ల చేయాలన్నారు” అని సెలవిచ్చారు భగవాన్. “అవును దుఃఖం ఆగాధమనే కదా పెద్దల వాక్యం" అన్నారా భక్తులు.
(సుఖ స్వనoతరం దుఃఖం
దుఖఃస్వా నంతరం సుఖం
చక్రవత్ పరివర్తoతే
దుఃఖానిచ సుఖానిచ.
*భావం*
సుఖం తర్వాత దుఃఖం మరలా దుఃఖం తర్వాత సుఖం చక్రంలా జీవితం పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది)
ఆహా ! దుఃఖం భ్రమే సుఖం భ్రమే.కానీ ఆనందం శాశ్వతం. ప్రతి జీవీ ఆనందం కావాలని అనడం అసలు తన సహజస్థితి ఆనందరూపం కావడంవల్లనే. ఆగాధమైన దుఃఖాన్ని పోగొట్టడానికే అన్ని సాధనలున్నూ. తలనొప్పి మధ్యలో వచ్చింది కనుకనే మందు వేసి పోగొట్టాలి. పుట్టింది మొదలూ చచ్చేదాకా ఉండేదైతే పోగొట్టుకోవడం ఎందుకు ? శరీరమే ఒక వ్రణo.ఒక వ్యాధి, డాక్టరు వైద్యంవల్ల రోగం తగ్గినట్లే, అనేక ప్రతిబంధకాలవల్ల కలిగే దుఃఖం ఆ ప్రతిబంధకాలను శాంతింపజేసే సాధన, గురువుల ద్వారా తొలగించ వచ్చును. శరీరం ఒక వ్యాధి. దీనికి మూలం అజ్ఞానం. దానికి జ్ఞానమనే మందు పడితే అన్నిరకాల వ్యాధులూ ఒకేసారి పోతాయి" అనిచెప్పారు భగవాన్.
సాధనవల్ల సద్యః ఫలితాలు కలగడం కద్దా? అన్నారా పృచ్ఛకులు.
కొన్ని సద్యః ఫలిస్తవి, కొన్ని ఫలించవు, ఎందువల్లనంటే తీవ్రతీవ్రతల ననుసరించి అది నడుస్తుంది. పుణ్యంకానీ పాపంకానీ తీవ్రంగా చేస్తే మరుజన్మలోనే ఫలిస్తుంది. నిదానంగా,కొంత కొంత చేస్తే కొన్ని జన్మలకు జరగచ్చు. అయితే, దేనికది ఫలించక తప్పదు" అని సెలవిచ్చారు భగవాన్.
కొన్ని జన్మలు మనం చేసే పూజలు, తీర్థయాత్రలు, దానాలు మొదట్లో సంసారం, కోరికలు కోసం చేసినా, రాను రాను యేదో ఒక జన్మలో అవి ఫలించి మహనీయుల చేంతకు చేరుస్తాయి. ఆ ఉద్ధేశంతోనే మహర్షి చెప్పడం.
No comments:
Post a Comment