🔱ఓం నమః శివాయ🔱:
*🧘సౌందర్యలహరి🧘♀*
🪷🪷🧘🧘♀🪷🪷. దేవి పాపట నడుమనున్న సిందూరము ఉదయించుచున్న సూర్యునివలెనున్నది.
ముంగురులచే కమ్ముకొనిన దేవి ముఖము పద్మమును పరిహసించుచున్నది. ఆమె చిరునగవు శివుని మోహింపజేయుచున్నది.
లావణ్యకాంతితో నిర్మలమైన దేవి ఫాలము రెండవ చంద్రఖండమువలెనున్నది. మొదటి చంద్రఖండమును దేవి తలయందు ధరించినది.
దేవి కనుబొమలు ధనుస్సువలెనున్నవి. ఆమె సకల భువనముల భయమును పోగొట్టెడు ఉమాదేవి.
దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది.
దేవి చూపు విపులమై, మంగళకరమై, దుర్జయమై, దయారసపూరితమై, అవ్యక్త మధురమై, పరిపూర్ణ భోగవతియై, భక్తులను రక్షించునదై అనేక నగరముల బహుముఖవిజయము కలదై యున్నది.
దేవి నేత్రద్వయము ఆకర్ణాంతము విస్తరించి నల్లని తుమ్మెదలవలె నున్నవి. కావ్యరస మాధుర్యభరితమైన చెవులనెడు పుష్పముల నుండి మకరందమునాస్వాదించుచున్నవి. వాటిని చూచి అసూయచే మూడవ కన్ను కొంచెము ఎరుపెక్కినది.
శ్రీ అమ్మవారి చూపు శివునియందు శృంగారము గలది. అన్యులయందు భీభత్సము గలది. గంగ (సవతి) యందు కోపము గలది. శివుని చరిత్రయందు అద్భుతము గలది. శివుడు ధరించిన సర్పములవలన భయమొందినది. పద్మమును మించిన సౌందర్యము గలది. చెలులయందు చిఱునగవులు గలది. నాయందు (ఆది శంకరాచార్యుని యందు లేదా భక్తునియందు) దయ గలది.
దేవి కన్నులు ఆమె చెవులవరకు లాగబడిన, రెప్పల వెండ్రుకలనెడు ఈకలు కలిగిన మన్మధ బాణములవలెనున్నవి. ఈశ్వరుని చిత్తమును కలచివేయుటయే ఆ బాణముల లక్ష్యము.
దేవి మూడు కన్నులందును కాటుక ధరించియన్నందున ఎరుపు, తెలుపు, నలుపు వర్ణములు మిళితములైయున్నవి. మహాప్రళయమునందు పరమాత్మలో లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులను భవానిదేవి శివునితోగూడి మరల సృజించుటకై ధరించిన సత్వ రజస్ తమో గుణములవలె ప్రకాశించుచున్నవి.
దేవి కన్నులలోని ఎరుపు, తెలుపు, నలుపు రంగులు ఎఱ్ఱని శోణానది, తెల్లని గంగానది, నల్లని యమునానది అనెడు తీర్ధముల పాపహరమైన సంగమము వలె యున్నవి.
జగన్మాత కనులు మూయుటవలన లోక సంహారము, తెరచుట వలన సృష్టి జరుగునందురు. సకల జగములను రక్షించుటకొరకై ఆమె రెప్పలు మూయకుండ ఉండునని కవి తలపు.
అపర్ణాదేవి కన్నులు మీనములవలెనున్నవని వర్ణన.
శివాణీ! నీ చల్లని చూపును నాపై ప్రసరింపజేయుమని ప్రార్థన.
పర్వతరాజపుత్రి కనుల అంచులు ధనుస్సులవలెనున్నవి. ఆ దేవి కడగంటి చూపులు బాణములను ఎక్కుపెట్టుచున్నవా అన్నట్లు ఆ కనుల అంచులను దాటి చెవులవరకు పోవుచున్నట్లు భ్రమను కలుగజేయుచున్నవి. (ఆ విశాలాక్షి కన్నులు చెవులవరకు వ్యాపించియున్నవని భావము)
దేవి చెక్కిళ్ళలో ప్రతిబింబించుచున్న ఆమె తాటంకముల కారణముగ ఆమె ముఖము నాలుగు చక్రములు కలిగిన మన్మధుని రధమువలె నున్నది. అట్టి సుందర ముఖము నాశ్రయించి మన్మధుడు శివునితో తలపడుటకు సంసిద్ధుడయ్యెను.
సరస్వతీదేవి అమృత సూక్తులను వినుచు శర్వాణి తలయూపుచున్నది. ఆమె కుండలముల ఝణంఝణ నాదములు సరస్వతి పలుకులను ప్రశంసించుచున్నవనిపించునట్లున్నవి.
హిమద్వంశ కీర్తిపతాకయైన దేవి నాసిక నుండి వెలువడు చల్లని నిశ్వాసము మాకు అభీష్టఫలములను ప్రసాదించును గాక.
దేవి ఎఱ్ఱని పెదవికి పోలిక చెప్పవలెనంటే పండిన పగడపు తీగనే సామ్యముగా చెప్పవలెను. దొండపండుతో పోల్చడం సరి కాదు.
చకోర పక్షులు దేవి చిఱునగవులనే వెన్నెలను గ్రోలుచున్నవి. అవి అతి మధురములైనందున అందుకు విరుగుడుగా అమృతమును పుల్లని కడుగునీళ్ళగా భావించి త్రాగుచున్నవి.
జగజ్జనని నాలుక ఎల్లపుడు శివుని గుణగణముల వర్ణనలు చేయుచు వెలయుచుండును. ఆమె నోటి ఎరుపు ప్రతిఫలించిన కారణముగా తెల్లని చాయ గలిగిన సరస్వతి మేను కూడ ఎరుపుగా అగుపించుచున్నది.
యుద్ధమునందు దైత్యులను జయించి తిరిగి వచ్చుచున్న కుమార స్వామి (విశాఖుడు), ఇంద్రుడు, విష్ణువులు చండాంశము (చండుడు అను శివభక్తుని భాగము) అయిన శివనిర్మాల్యమును తీసికొననిచ్చగించలేదు. వారు దేవి పాదములచెంత చేరి, తమ శిరస్త్రాణములను తొలగించి, మ్రొక్కుచు ఆమె యొసగిన కర్పూర సహిత తాంబూల శకలములను ఆతురతతో స్వీకరించుచున్నారు.
సరస్వతీ దేవి శివుని గాధలను ఆలపించుచుండగా వినుచు జగన్మాత ఆనందముతో తలయూపుచున్నది. దేవి ప్రశంసావాక్యములలోని వాఙ్మాధుర్యమునకు సరస్వతి వీణాతంత్రుల సవ్వడి సరికాకున్నది.
గిరిసుత చుబుకము తండ్రిచే ప్రేమగా పుణకబడినది. శివునికి దేవి ముఖము అద్దము కాగా ఆ అద్దమునకు పిడివంటిది ఆమె చుబుకము. దానిని పోల్చుటకు మరేదియును సాటిరాదు.
శివుని కౌగిలిచే రోమాంచకమైన దేవి గళము ఆమె ముఖమనెడు పద్మమునకు కాడవలెనున్నది. ఆ క్రింద అగురు బురద అలముకొనియున్న ముత్యాల కంఠహారము బురదలో కూరుకొనిపోయిన తామరతూడువలెనున్నది.
సంగీత రసజ్ఞురాలవగు ఓ తల్లీ! వివాహ సమయమున మంగళసూత్రము కట్టిన పిదప కట్టెడు మూడుదారములయొక్క గుర్తులా యనబడునట్లుగా నీ కంఠమునందలి మూడు రేఖలు నానావిధమనోహరములైన మూడురాగములకు హద్దులవలె భాసించుచున్నవి.
దేవి నాలుగు చేతుల స్తుతి - (పూర్వము బ్రహ్మకు ఐదు తలలుండెడివని, అందొక తలను రుద్రుడు తన గోటితో చిదిమివేసెనని ఇతిహాసము). శివుని గోళ్ళకు భయపడిన బ్రహ్మ తన నాలుగు తలలను రక్షించుకొనుటకై నాలుగు ముఖాలతోను ఒకేమారు శ్రీమాత యొక్క సుకుమారమైన, తామరతూండ్లవంటి బాహువులను స్తుతించుచున్నాడు.
దేవి చేతి గోళ్ళ ప్రశంస - ఉమాదేవియొక్క చేతిగోళ్ళ సహజమైన అరుణవర్ణము పద్మముల రంగును పరిహసించుచున్నది. వాటి అందమును దేనితో పోల్చవచ్చును? లక్ష్మీదేవి విహరించునపుడు ఆమె పాదతలములందలి లాక్షారసము అంటి ఎఱ్ఱనైన కమలదళాలతో కొంతవరకు సామ్యము చెప్పవచ్చును.
దేవి స్తనయుగము వర్ణన - కుమారస్వామి చేతను, గజముఖునిచేతను ఒక్కసారే పాలు త్రాగబడి పాలు గారుచున్న దేవి స్తనయుగము మా కష్టములను పోగొట్టును గాక. ఆ స్తనద్వయమును చూచి గజాననుడు తన కుంభస్థలమును తల్లి అపహరించెనేమోయని కలతచెందుచున్నాడు.
పార్వతీదేవి వక్షోజములు కెంపులచే చేయబడిన అమృత కలశములు. కనుకనే ఆమె స్తన్యము గ్రోలిన గజాననుడు, కుమారస్వామి బాలురవలెనే యున్నారు. (వృద్ధులు అగుట లేదు)
అంబ కుచ ప్రదేశమునందున్న హారము గజాసురుని కుంభములందలి ముత్యములచే కూర్చబడినది. అట్టి తెల్లని స్వచ్ఛమైన హారము దేవి అధరకాంతులచే లోపల కొంచెము ఎర్రనై, ఈశ్వరుని కీర్తి, ప్రతాపము మిళితమైనట్లుగా భాసించుచున్నది.
దేవి స్తన్యము యొక్క మహిమ - పర్వతపుత్రి స్తన్యము ఆమె హృదయమునందలి పాలకడలినుండి పుట్టిన వాఙ్మయము. కనుకనే దయతో దేవి యొసగిన స్తన్యమును గ్రోలిన ద్రవిడశిశువు ప్రౌఢకవుల మధ్య కమనీయకనియయ్యెను.
దేవి నాభి వర్ణన - హరుని కోపాగ్నిచే దహింపబడుచున్న మన్మధుడు ప్రాణరక్షణకొరకు పార్వతి నాభి అను సరస్సులో దూకెను. వాని శరీరమునుండి వెడలి తీగవలె సాగిన పొగనే పామర జనము ఆమె నూగారని అనుచున్నారు.
దేవి నూగారు వర్ణన - శివాణి సన్నని నడుమునందు యమునానది సూక్ష్మతరంగములవలె (అతి చిన్నవైన) రోమావళి యున్నది. ఆమె కుచకుంభముల ఒరిపిడివలన వాని మధ్యనున్న ఆకాశము(స్థలము)నకు చోటు చాలలేదు. కనుక ఆ యాకాశము క్రిందికి జారి ఆమె నాభి రంధ్రమున చోటుచేసుకొనెనా యన్నట్లుగా అవియనిపించుచున్నవి.
గిరిపుత్రీ! నీ నాభి నిశ్చలమైన గంగ సుడి. స్తనములు అను పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి యనెడు తీగకు పాదు. మన్మధుని పరాక్రమాగ్నికి హోమగుండము. రతీ దేవికి విహార గృహము. ఈశ్వరుని కనుల సిద్ధికి గుహాముఖము. అయి విరాజిల్లుచున్నది.
శైల తనయ నడుము వర్ణన : సహజముగానే కృశించినది. స్తన భారముచే వంగినది. నాభియు, వళులు (మడతలు)ను ఉన్న చోట విఱిగిపోవునో యన్నట్లున్నది. ఒడ్డు విఱిగిన నదీ తీరమున ఉన్న చెట్టువలె ఊగుచున్నది.
దేవి వళుల వర్ణన : మన్మధ నిర్మితములై కనక కలశములవంటి దేవి స్తనములు ఈశ్వర స్మరణచేత సారెకు ప్రక్కలయందు చెమర్చుచు రవికను పిగుల్చుచున్నవి. చంకలను ఒరయుచున్నవి. ఆ కుచ భారమునకు నడుము విరిగిపోకుండా కాపాడుటకై దేవి వళులు (నడుముపైని మూడు ముడుతలు) లవలీలతచే కట్టబడిన మూడు కట్లవలెనున్నవి.
దేవి నితంబము వర్ణన: పార్వతీ! నీ తండ్రి యగు క్షితిధరపతి భూమినుండి విస్తారమును తీసి నీకు అరణముగా నిచ్చెను. అందున నీ నితంబము (పిఱుదులు) విస్తారమై వసుమతి (భూమి)ని కప్పివైచుచు తేలిక చేయుచున్నవి.
భవతి తొడలు, మోకాళ్ళ వర్ణన : పార్వతీదేవి తొడలు గజరాజు తుండములను, బంగారపు అరటి కంబములను జయించునవి. భర్తకు సదా మ్రొక్కుచుండుటచే ఆమె మోకాళ్ళు గట్టిపడినవి.
83 నుండి 91వ శ్లోకము వరకు దేవి పాదములు, గోళ్ళ వర్ణన యున్నది.
గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.
మాతా! నీ పాదములు వేదములకు శిరోభూషణములు. నీ పాద్య జలమే శివుని జటాజూటముననున్న గంగ. విష్ణువు తలపైనున్న చూడామణి కాంతియే నీ శ్రీ పాదముల లత్తుక శోభ. తల్లీ నీ పాదములను దయతో నా శిరసుపైనుంచుమమ్మా.
దేవీ! తడి లత్తుకతో కాంతులీనెడు నీ పాదద్వయమునకు మ్రొక్కెదను. నీ పాదముల తాకిడిని పొందుచున్న ప్రమదావనమునందలి అశోకవృక్షమును చూచి శివుడు అసూయ చెందుచున్నాడు.
ప్రణయ కలహ సమయమున దేవి తన కాలితో శివుని లలాటమున తన్నినది. అప్పుడు ఆమె అందెల మోత యెట్లున్నది? తన శత్రువైన శివునికి పరాభవము కలిగినందుకు మన్మధుడు కిలకిల నవ్వినట్లున్నది.
జననీ! శ్రీకరములు, సదా శోభాయమానములు అయిన నీపాదములను పద్మములతో ఎట్లు పోల్చనగును? పద్మములు రాత్రులు ముకుళించుకొనిపోవును. మంచు తగిలిన వడలి పోవును. అవి కొంచెము మాత్రమే లక్ష్మి అనుగ్రహమునకు పాత్రములు.
దేవీ! నీ పాదములు యశస్సును కలిగించునవి, విపత్తులను హరించునవి. పురారియైన శివుడు దయామయుడై వివాహ సమయమున నీ సుకుమార పాదములను తన చేతబట్టి మృదువుగా సన్నెకల్లును త్రొక్కించెను. అట్టి పాదాగ్రములను పూజ్యులైన పూర్వకవులు కఠినమైన తాబేటి పెంకుతో ఎట్లు పోల్చిరో తెలియరాదు.... (సశేషం).
No comments:
Post a Comment