Friday, December 26, 2025

 ప్రశ్నించని మనిషి అన్ని రంగాలలో 
 వెనుకబడిపోతాడు
**** *****************

కొందరు వ్యక్తులతో ఏర్పడేది కుటుంబం.
కొన్ని కుటుంబాలు కలిస్తే సమాజం.
కాబట్టి సమాజంలోని ఒక వ్యక్తి యొక్క ప్రభావం, ఆ సమాజం పై పడుతుంది.
సమాజ ప్రభావం ఒక వ్యక్తిపై పడుతుంది.‌

సమాజం లేనిది ఒంటరిగా జీవించలేము.
 సమాజ సహాయ సహకారాలు వ్యక్తికి అందాలి. వ్యక్తి యొక్క సహాయ సహకారాలు సమాజానికి అందాలి.అప్పుడే సమాజం  సుఖవంతంగా
 సౌకర్యంగా ఉంటుంది.

ప్రస్తుతం సమాజం ఉండవలసిన రీతిలో లేదు. ఎలా ఉండకూడదో అలా ఉంది.
 ఎందుకు? మనమందరము ప్రశ్నించుకోవాలి. దానికి తగినటువంటి పరిష్కారాలు వెతకాలి.
ప్రశ్న ప్రగతికి మూలం అవుతుంది.

ఏ సమాజంలో వ్యక్తులందరూ 
ఆలోచనాపరులై ఉంటారో........
అటువంటి సమాజం 
మిగతా సమాజాల కన్నా 
మెరుగైన స్థితిలో ఉంటుంది.

మనిషి పుట్టుకతో హేతువాది.
ప్రతిక్షణం తనను తాను 
ప్రశ్నించుకుంటూనే 
తన జీవితాన్ని గడుపుకుంటాడు.
కానీ మనిషి ప్రశ్నించవలసిన విషయాలను ఎవరికి కొన్నింటిని ప్రశ్నించడం లేదు. 

మత గ్రంథాలు దేవుడు దయ్యం స్వర్గం నరకం గత జన్మ ఆత్మ పునర్జన్మ వీటీని ప్రశ్నించడం లేదు. వీటిని ప్రశ్నించకూడదని పవిత్రాలని కొందరు దోపిడీదారులు చెప్పడం వలన వారి మాటలను నమ్మి ప్రశ్నించలేకున్నారు.

ప్రశ్నించడం వల్లనే ఆదిమ మానవుడు, 
ఆధునిక మానవుడు అయ్యాడు.

మనిషి తాను ప్రశ్నించవలసినవి ప్రశ్నించలేక, కొన్నింటిని పవిత్రాలని, కొన్ని దైవవాక్కులని తాను భయంతో, భక్తితో అజ్ఞానంలో ఉంటూ ఇతరులను కూడా అజ్ఞానంలో ఉంచుతున్నాడు. రోజు రోజుకి ఇలా అజ్ఞానంలో ఉన్న వారి సంఖ్య అధికమవుతుంది. దీనికి కారణం
ప్రభుత్వాలుకూడా.

ప్రశ్నించడానికి  అర్హతలు అవసరం లేదు.
 తనకు వచ్చిన సందేహాలను, ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా అడగవచ్చు. ప్రశ్నలకు జాతి, మత, కుల, వర్గ, వర్ణ,పేద, ధనిక చిన్నా పెద్ద విచక్షణ లేదు. అందరూ ప్రశ్నించవచ్చు
ప్రశ్నలు రాని మనిషి ఉండడు.

 ప్రశ్నించటానికి దమ్ము ధైర్యం కావాలి,
 ప్రశ్న హేతుబద్ధంగా ఉండాలి.
 నిజాన్ని రాబట్టాలి,
 నిజాన్ని  నిగ్గుతేల్చాలి.

అన్ని మత గ్రంథాలను, మతాలను, అందులోని పాత్రలను, పాత్రలు చేసే వికృతి చేష్టలను,మత సాహిత్యాన్ని అన్నింటినీ ప్రశ్నించాలి.
దేవుని కోసం పూజలు చేయమంటే ఎందుకు అని?ప్రశ్నించాలి వ్రతాలు చేయమంటే ఎందువలన చేయాలి మనకేం వస్తుంది?
 అని ప్రశ్నించాలి.

దేవుడు మనల్ని రక్షిస్తాడు అంటే  ఎలా అని ప్రశ్నించాలి? మనమంతా దేవుని బిడ్డలం, 
అంటే ఎలా అయ్యాం?అని ప్రశ్నించాలి.
జవాబు దొరికే వరకు ప్రశ్నిస్తూనే ఉండాలి.
 ప్రశ్నలు అడిగితే కొందరు అసహనం ప్రదర్శిస్తారు అయినను అడగాలి.

సృష్టి ఆరు రోజులలో జరిగినదంటే ప్రశ్నించాలి

సూర్యుడు,చంద్రుడూ భూమికోసం, దేవుడు సృష్టించాడంటే ప్రశ్నించాలి

ప్రశ్నే కఠినంగా ఉన్నప్పుడు దానిని విమర్శ అంటారు, 

విమర్శ ఎక్కువైనపుడు తమ మనోభావాలు దెబ్బతింటాయని కొందరంటారు, 
అయినను ప్రశ్నించాలి

ప్రతి దానినీ ప్రశ్నించి,విమర్శించి నిగ్గుతేల్చాలి.

 ఏ గ్రంధానికీ పరమ పవిత్రత లేదు. 
అన్ని మత గ్రంథాలను ప్రశ్నించవలసినదే
అందరి దేవుళ్ల ఉనికిని ప్రశ్నించవలసిందే
 ప్రతిదీ ప్రశ్నించదగిందే.
 మనిషి ఎదిగింది ప్రశ్నతోనే, 
 ప్రశ్నతోనే ప్రగతి బాట
 ప్రశ్నతోనే మనిషి ప్రస్తానం.

మనిషికి ప్రశ్న ప్రాయికమైనది, 
ప్రశ్నకు జవాబు చెప్పాలనే కాంక్ష ఉండాలి.
జవాబు చెప్పనిదే మతం, 
ప్రశ్నిస్తే  చంపుతుంది.
అది మత నైజం,మత భావన.
అసహనం దానికి వెన్నుపూస.

ప్రశ్నించిన ఎందరినో చంపింది మతం, 
దానికి విరుద్ధంగా చెప్పిన వారిని చంపింది.
అది చెప్పినదే వేదం, విజ్ణానం.
దానిని వినాలి, ఆమోదించాలి లేదా చావాలి.

హేతుబద్ధ ప్రశ్న గుండెలలో గ్రుచ్చుకుంటుంది.
నిజం నిప్పులాంటిది,
సైన్సు చెప్పేదే నిజం,
మతం చెప్పేది ఊహాపోహలే.
సత్యాన్వేషణ సైన్సు నైజం,
సత్యశోధన దాని లక్షణం.

 అదే నేటి జీవపరిణామం,
 సాపేక్ష సిద్ధాంతం, 
 విశ్వం పరిణామం,
 విశ్వం అవిరతం 
 అనేది కనుగొంది సైన్సు.

ప్రశ్నతోనే సైన్సు పుట్టింది, 
ప్రశ్నతోనే ఎదుగుతుంది, 
ప్రశ్నతోనే సాకారమవుతుంది.
ప్రశ్నతోనే నిగారిస్తుంది.
 
ఊపిరి పీల్చినంత సులభంగా ప్రతి మనిషి ప్రశ్నించుకుంటూనే ఉంటాడు.
 ఏ పని చేసినా  ప్రశ్నించుకొని ఆలోచించి చేస్తాడు. దాని ఫలితాలు ముందే నిర్ణయించుకొని ఆచరిస్తాడు.
ఒక్కొక్కసారి అతని ప్రశ్నల వల్ల లాభం కావచ్చు, నష్టం కలగవచ్చు.
అంత మాత్రం చేత ప్రశ్నించుకోకుండా ఉండలేడు.

ఏ ప్రాంతం వారైనా 
ఏ కులం వారైనా ఏ మతం వారైనా 
మతవాది అయినా 
హేతువాది అయినా ప్రశ్నించుకుంటూనే ఉంటాడు. 

ప్రశ్న నుండి పుట్టు పరిణిత జ్ఞానమ్ము
ప్రశ్నతోడ పెరుగు ప్రాభవమ్ము
ప్రశ్నలేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా 
నవయుగాల బాటనార్ల మాట!

అంటారు నార్ల వెంకటేశ్వరరావు గారు.

ప్రశ్నించడం ఆపేయడం,
ప్రశ్నలను అడ్డుకోవడం 
ప్రశ్నిస్తే కోపగించుకోవడం 
ప్రశ్నిస్తే అసహనం ప్రదర్శించడం
ప్రశ్నలను అణచివేయడం 
ప్రశ్నించిన వారిని చిన్నచూపు చూడడం 
ప్రశ్నించిన వారిని నిర్లక్ష్యపరచడం
ప్రశ్నించిన వారికిఏమీ తెలియదని భావించడం
చాలా పెద్ద తప్పు ఎందుకంటే.......
ప్రశ్న వల్లనే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది.
 ప్రశ్న వల్లనే ప్రతిభావవంతమైన సమాజం ఏర్పడుతుంది.
 ప్రశ్న వల్లనే ప్రగతి సాధ్యమవుతుంది.
ప్రశ్నవల్లనే నీకు స్వేచ్ఛ,
 స్వాతంత్ర్యాలు లభిస్తాయి.
ప్రశ్నించడం వలన  వ్యక్తిగత గౌరవం 
లభిస్తుంది.

ఎప్పుడైతే నీవు ప్రశ్నించడం మానుకుంటావో
 మరు  నిమిషం నుండి  నీలో అజ్ఞానం ప్రవేశిస్తుంది. ఇతరులను అనుసరించడం, ఇతరులు చెప్పినట్లు తలూపడం లాంటి వ్యర్థమైన పనులు చేస్తుంటారు
అందుకోసం ప్రశ్నలు అడ్డుకోవడం,
 అణచివేయడం తెలివి లేని తనం. 
నాకే అంతా తెలుసు నన్న అహంకారం.
మొదలవుతుంది.

 నాకే అంతా తెలుసు నన్న
అహంకారం నీలో ఎప్పుడైతే మొదలవుతుందో,,,,
అప్పుడే నీ బాట అజ్ఞానం వైపు దారితీస్తున్నట్టే

సరియైన ప్రశ్నలు వేసుకోకపోవడం 
వల్ల సమాజానికి నష్టం ఏమిటి?
********************************
ఒక విషయం పూర్తిగా అవగాహన కలగాలంటే,
దాని లోతుపాతులు తెలియాలంటే,
దాని తత్వం పూర్తిగా అర్థం కావాలంటే,
ప్రశ్నలు వేసుకోవడం తప్పనిసరి.

ప్రశ్నలు వేసుకోనందువల్ల
సమాజంలో అభివృద్ధి ఆగిపోతుంది.
జీవన ప్రమాణాలు పెరుగవు. 
శాస్త్రీయ విద్యార్జనకు 
ఆటంకం ఏర్పడుతుంది.
విజ్ఞానం పెరగదు. 

 సమాజంలో భిన్న కులాలు, భిన్న మతాలు, 
భిన్న ఆలోచనలు, భిన్న దృక్పథాలు కలిగిన వ్యక్తులు ఉంటారు, ఒకే విషయం గురించి వారు ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు.

 వారి ఆలోచనలన్నీ సమన్వయపరచడానికి  
ఏది మంచి, ఏది చెడు, ఏది సరియైన ఆలోచన తేల్చడానికి సమాజంలోని వ్యక్తులు నిరంతరం ప్రశ్నలు వేసుకుంటూనే ఉండాలి.

సరియైన ప్రశ్న సరైన ఆలోచన కలగజేస్తుంది. సరియైన ఆలోచన సరియైన ఆచరణ వైపు దారితీస్తుంది.
సరియైన ఆచరణ వ్యక్తుల శారీరక,మానసిక, వైజ్ఞానిక జీవితం మెరుగుపడుతుంది.
ఒక వ్యక్తి జీవితం మెరుగుపడితే,
సమాజం మొత్తం బాగుపడ్డట్టే.

సమాజంలో చైతన్యం కలిగిన వ్యక్తులు, ప్రశ్నించగలిగిన, నిజా నిజాలు తెలుసుకోగలిగిన మేధావులు, ప్రజలు లేనంత కాలం అజ్ఞానం మూఢత్వం,మూర్ఖత్వమే రాజ్యమేలుతుంది.
సమాజం అభివృద్ధి చెందజాలదు. ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా ప్రాథమిక అవసరాలు కూడా తీరవు.
సమాజంలో దోపిడీ పెరిగిపోతుంది.
మోసాలు  పెచ్చుమీరి పోతున్నాయి.
ప్రజలు బానిసత్వంలో .మగ్గిపోతున్నారు.
వారి జీవితాలు అస్తవ్యస్తమవుతున్నవి.
సమాజంలో పేదతనం అధికమవుతున్నది.

ప్రశ్నించకపోవడం వలన
**********************
"విద్యార్థులు" ప్రశ్నించకపోవడం వలన వారి సందేహాలు అలాగే ఉంటాయి సరియైన జ్ఞానం లభించదు.

"పిల్లలు" ప్రశ్నించకపోవడం వలన వారి చుట్టూ ఉన్న పరిసరాల విజ్ఞానం వారు చుట్టూ జరుగుతున్న విషయాలు గ్రహించలేక పోతారు.

"పెద్దలు" ప్రశ్నించకపోవడం వలన వారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను సరియైన విధంగా పరిష్కరించుకోలేక ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించలేకపోతున్నారు.

"కార్మికులు" ప్రశ్నించ లేకపోవడం వలన తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నారు. 

"రైతులు" ప్రశ్నించకపోవడం వలన తమ పంటకు తగిన గిట్టుబాటు ధర లభించక పేదవారుగా మిగిలిపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

"ఉద్యోగులు" తమ హక్కుల గురించి ప్రశ్నించకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు.

జనాభాలో సగం ఉన్న" స్త్రీలు "ప్రశ్నించకపోవడం వలన తమ హక్కులను తాము సాధించుకోలేక, ఆర్థిక సామాజిక రంగాలలో తమ ప్రతిభను చూపెట్టలేకపోతున్నారు.

సమాజంలో అణచివేతకు గురవుతున్న, చిన్న చూపు చూడబడుతున్న స్త్రీలు, అత్యాచారాలకు గురవుతున్న మహిళలు ప్రశ్నించనట్లయితే వారి జీవితం అధోగతి పాలవుతుంది. చివరికి వారి జీవితం అర్ధాంతరంగానే ముగియవచ్చు.

అందరూ ఎందుకు 
ప్రశ్నించలేకపోతున్నారు?
***********************
**ప్రశ్నిస్తే తమపై ఎక్కడ దాడులు 
చేస్తారో నన్న భయం.
**ఎదుటివారి ధనము, పదవి, పలుకుబడికి భయపడి,
**కొన్ని విషయాలను, గ్రంథాలను
 ప్రశ్నించకూడదన్న కొందరి 
స్వార్థపరుల మాటలు విని,
**కొన్ని కులాలు అగ్రకులాలని 
ప్రశ్నించకూడదని, 
చెప్పడం వల్ల,

ప్రశ్నల పట్ల పాలకుల వైఖరి
*************"********
 రాజకీయ నాయకుడికి కూడా ప్రశ్నలు వస్తాయి. వారి ప్రశ్నలు ఎప్పుడూ సామాన్యులపై అధికారం చెలాయించడం వరకే పరిమితం అవుతాయి.  సామాన్యులను చిన్నచూపు చూడడం,
 వారిని అణచివేతకు గురి చేయడం తమ స్వార్థానికి తమ లాభానికి, తమ అధికారానికి పావులుగా వాడుకోవడం వరకే పరిమితం అవుతాయి.
ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రశ్నలను ఆహ్వానించడు. ప్రశ్నలను భరించడు.
తన పాలనకు,  తన స్వేచ్ఛకు, తన అధికారానికి, దోపిడీ విధానాలకు ఎవరు కూడా అడ్డు తగిలి ప్రశ్నించకూడదనే అభిప్రాయం లో ఉంటాడు.
ప్రజలు విజ్ఞానవంతులు కావాలని ఎప్పుడూ అనుకోడు. 
ప్రజలు విజ్ఞానవంతులైతే, ప్రశ్నిస్తారని వారి భయం. ప్రజలు చదువుకొని జ్ఞానం సంపాదించుకుంటే, వారి హక్కులు తెలుసుకుంటారని వారు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తారని,  హక్కుల కోసం ఉద్యమాలు చేస్తారని తన పదవికి, అధికారానికి అడ్డు తగులుతారని ప్రతి నాయకుడు ప్రశ్నలు రాకుండా చూస్తాడు.

 పైకి మాత్రం అందరూ చదువుకోవాలంటాడు.
మేం ప్రజల కోసం పాఠశాల ప్రారంభించామంటారు. వైద్యశాలలు స్థాపించామంటారు కానీ నిజానికి వారికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండదు.
కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఈ పనులు చేస్తుంటారు. చేస్తున్నామంటారు.
ప్రస్తుతం ఉన్న  విద్య, వైద్యశాలలు ప్రజలకు ఏ పాటి వైద్యం, 
ఏ పాటి విజ్ఞాన మందిస్తున్నాయో మనం చూడవచ్చు

 ప్రజల ముందు, ప్రజల కోసం ఎంతో సేవ చేస్తున్నట్లుగా, ప్రజల గురించి పట్టించుకున్నట్లుగా, ప్రజల సంక్షేమం కోసమే తాము పదవుల్లోకి వచ్చామని సభల్లో, సమావేశాల్లో కల్ల బొల్లి మాటలు మాట్లాడతారు.
కానీ నిజంగా గమనిస్తే రాజకీయ నాయకుల అంతరంగంలో ప్రశ్నలు రావద్దని భావన ఉంటుంది.

ఎందుకంటే ప్రశ్నించే వారు ఉంటే తమ పదవి తమ అధికారం, తమ స్వార్థంఆగిపోతుందన్న భయం వాళ్లలో ఉంటుంది.

మేధావులు
*"******"
సమాజంలో జరుగుతున్న చాలా విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటారు. 
ప్రశ్నిస్తేనే ప్రగతి సాధిస్తామని కూడా భావిస్తారు.

 కానీ తాము ప్రశ్నిస్తే ఎక్కడ రాజదండన ఎదుర్కోవాల్సి వస్తుందే మోనని, అరెస్టులు, జైలు శిక్షలు పడతాయేమోనన్న భయంతో ప్రశ్నించకుండా ప్రశ్నల్ని తమలోనే అణచివేసుకుంటారు.

ప్రశ్నిస్తే తమ బంధువులకు కుటుంబ సభ్యులకు దూరమవుతామేమనన్న భయమే 
అధికంగా ఉంటుంది.

తన జీవితం జైలు గోడల మధ్య
గడపవలసి వస్తుందేమో నన్న భయం. 
మేధావులకు ఉంది

మేధావులే ఇలా ఆలోచించి,
 పిరికి వాళ్ళ లాగా వెనుకంజ వేస్తే, 
ఇక సమాజంలో ఎవరు ప్రశ్నించగలరు?

 "మేధావుల మౌనం దేశానికే ప్రమాదకరం" 
అని ఒక సూక్తి ఉంది.
"నేనొక్కడినే ప్రశ్నిస్తే సమాజం మారుతుందా?"
అని కూడా కొందరు అనుకుంటారు. 
అటు ప్రశ్నించలేరు ఇటు రాజ్యాధికారం చేపట్టలేరు. 
తూష్ణీం భావముతో నిశ్శబ్దంగా ఉండిపోతారు.

ప్రశ్నించడం ఎలా?
**************
ఒక విషయం గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలంటే, ప్రశ్నించి, విశ్లేషించి సరియైన ఫలిత నిర్ధారణ గావించుకోవడానికి ప్రతి వ్యక్తి ఈ క్రింది ప్రశ్నలను వేసుకోవాలి.

ఉదాహరణకు "దేవుడు" అనే విషయాన్ని తీసుకుందాం.

ఎందుకు?:-

దేవుడు ఎందుకు?
 మన వ్యవహారాలలో, మన జీవనంలో దేవుడి అవసరం ఉందా? 
దేవుడు లేకుంటే కొందరు జీవనం సాగిస్తున్నారు కదా? 
దేవుడిని నమ్మినవారు జీవిస్తున్నారు.
నమ్మని వారు కూడా ఆనందంగానే జీవిస్తున్నారు.

 అయితే దేవుడు కొందరికే అవసరమా? 

కొందరికి అవసరం లేదా?  ఏ ప్రాణి అయినా దేవునికి గుడులు కట్టడం లేదు. దేవున్ని ప్రార్థించడం లేదు. అవి ఎలా బతుకుతున్నాయి?

 వాటికి లేని అవసరం మనకి  ఏ విధంగా అవసరం? ఎందుకు అవసరపడుతున్నాడు?

ఏమిటి?:---

దేవుడంటే ఏమిటి ఒక పదార్ధమా? మనిషా? పశు పక్ష్యాదులు,క్రిమి కీటకాల్లో ఒకటా? మనిషి అయితే ఆడా? మగా?

ఎలా?:---

దేవుడు ఎలా ఉంటాడు? ఏ రూపం కలిగి ఉంటాడు? మనిషి లాగా ఉంటాడా?
జంతువు లాగా ఉంటాడా? 
చెట్టు లాగా ఉంటాడా? 
పుట్టలాగా ఉంటాడా? 
గుట్ట లాగా ఉంటాడా? 
ప్రకృతిలో ఎలా ఉంటాడు?
 ప్రకృతి బయట ఉంటాడా?
దేవుడు నిరాకారుడని కొన్ని మతాలు చెబుతున్నాయి.
లేదు లేదు ఆకారం కలిగి ఉన్నవాడని కొన్ని మతాలు చెబుతున్నాయి.
 ఇందులో ఏది నిజం?

ఎక్కడ?:----

దేవుడి నివాసం ఎక్కడ?
 దేవుడికి కుటుంబం ఉందా? 
భార్యా పిల్లలు ఉన్నారా?
 దేవుడు ఏం చేస్తుంటాడు?
 ఆయన కృత్యం ఏమిటి? 
ఒకవేళ కుటుంబం ఉంటే,
 పిల్లలు ఉంటే అతడు మనిషే కదా? 
అతనిని ఎవరైనా చూశారా? 
సాక్ష్యాధారాలు దొరికాయా? 
ప్రపంచంలో ఎవరైనా దేవుడున్నాడని నిరూపించగలరా?
ఫలానా చోట ఉన్నాడని చూపించగలరా?
గతంలో చూపించారా భవిష్యత్తులో చూపగలరా?

 ఎప్పుడు?:--

దేవుడు ఎప్పుడు పుట్టాడు?
 అతని తల్లితండ్రులు ఎవరు?
 దేవుడివయస్సు ఎంత?
లాంటి ప్రశ్నలతో పూర్తి సమాచారాన్ని రాబట్టాలి. ఒకవేళ సమాచారం దొరకనట్లయితే,
మరల మరల ప్రయత్నించాలి ఎంత ప్రయత్నించినను  సాక్ష్యాధారాలు లభించనట్లయితే దానిని పక్కకు పెట్టడమే మన పని. 
మన జ్ఞానేంద్రియాలకు దొరికినంతవరకు దానిని విశ్వసించ కూడదు. అది నిజమని అనుకోకూడదు.
అది లేదనే మనం భావించవలసి ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా,ఎప్పుడైనా రుజువు చేస్తే అప్పుడు మనము అది ఉన్నదని,అది నిజమని అనుకోవాలి. అంతవరకు అది లేదని అనుకోవడమే మంచిది.

ఒక దేవుడే కాదు ఏ విషయమైనా పై ప్రశ్నలు వేసుకొని సమగ్రంగా ఆలోచించి, ప్రశ్నించి, విశ్లేషిస్తే
ఆ విషయం యొక్క పూర్తి సమాచారం మనకు అవగాహన అవుతుంది. 
అది నిజమా? కాదా?అనే విషయం 
బోధపడుతుంది. 
ఒకవేళ అది అబద్ధం అయితే  అది ఏదైనా, ఎంత గొప్పదైనా విడిచిపెట్టవలసి ఉంటుంది. 
అబద్దమని నిర్ణయించుకోవలసి ఉంటుంది.
 నిజమైతే దానిని నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా, ఆచరించవచ్చు ఇతరులకు చెప్పవచ్చు........... 

ప్రశ్నలు వేయరాని వాడు. 
ప్రశ్నలు వేయుటకు భయపడేవాడు.
సరియైన ప్రశ్న వేయలేని వాడు.
సమాజంలో  అన్ని రంగాలలో వెనకబడి పోతాడు.

                                 -- అడియాల శంకర్.
                                   ముఖ్య సలహాదారులు 
                                  సామాజిక విజ్ఞాన వేదిక 
                                   తెలంగాణ రాష్ట్రం

No comments:

Post a Comment