ఆ రాత్రి పూరి రాజు ఒక అద్భుతమైన, మనసును కలచివేసే స్వప్నం చూశాడు. ఆ స్వప్నం అంత సజీవంగా అనిపించింది.అది నిజంగా జరుగుతున్నట్లే. అందులో శ్రీ జగన్నాథుడు బాధతో కుంగిపోయి ఉన్నాడు. ఆయన ముఖం మ్లానంగా ఉంది. కళ్లలో కరుణతో పాటు స్వల్పమైన ఆవేదన కనిపిస్తోంది. ఆయన రాజుతో ఇలా అంటున్నారు.
“నా తల్లిని ఆలయం నుంచి తిరస్కరించారు… ఆమె నా కోసం ఔషధం తీసుకువచ్చింది… మీరు ఆమెను అవమానించారు… ఇప్పుడు నాకు బాధగా ఉంది…”
అంత చెప్పి ఆయన మాయమయ్యారు. కానీ ఆ వేదన రాజు హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉండిపోయింది.
రాజు మేల్కొని వెంటనే కంగారుగా లేచాడు. శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. మనసులో ఒక్కటే ప్రశ్న తిరుగుతోంది.“దేవుని తల్లి? ఆమె ఎవరు?”
ఆ రహస్యం అతనికి అసహనంగా మారింది.
కొన్ని రోజుల క్రితం పూరీలో ఒక పేద వృద్ధ మహిళ ఉండేది. కుటుంబం లేదు, ఆశ్రయం లేదు. చిరిగిన చీర, చెప్పులు లేని కాళ్లు, చిన్న గుడిసె… అయినా ఆమె హృదయం అపారమైన భక్తితో నిండి ఉండేది.
ఆమె ప్రతి రోజు ఆలయానికి వెళ్లి, విగ్రహం ముందు ప్రేమగా కూర్చొని ఇలా అనేది.
“నా లల్లూ… నీ కోసం నేను ఏమి చేయగలను… నేను ఎలా తల్లిని అయ్యాను?”
ఆమెకు దేవుడునీ చూడగానే దేవుడిగా కాదు, తన సొంత బిడ్డగా అనిపించేవాడు.
ఒక రోజు ఆలయంలో గొప్ప ఉత్సవం జరిగింది. దేవుడికి 56 రకాల నైవేద్యాలు సిద్ధం చేశారు. చుట్టూ ఆనందం నెలకొంది. కానీ ఆ వృద్ధ మహిళ మాత్రం ఆందోళన చెందింది.
“ఇన్ని ఆహారాలు తింటే నా బిడ్డకు కడుపు నొప్పి వస్తుందేమో…”
ఆమెకు చిన్ననాటి జ్ఞాపకం వచ్చింది.నిమ్మ చెట్టు ఆకులతో చేసిన పొడి. అది చేదుగా ఉన్నా వెంటనే ఉపశమనం ఇస్తుందని ఆమె నమ్మకం.
ఆమె ప్రేమతో నిమ్మ ఆకులు సేకరించి, వాటిని నూరి చిన్న డబ్బాలో పెట్టింది.
“ఇది నా లల్లూకి అవసరమైతే ఇస్తాను…”
తరువాత రోజు ఆమె ఆలయానికి వెళ్లింది. కానీ ద్వారం వద్ద సైనికులు ఆమెను ఆపారు.
“ఇందులో ఏముంది?”
“నిమ్మ పొడి… నా లల్లూ కోసం…”
సైనికులు నవ్వేశారు.
“దేవుడికి ఇలాంటి చేదు మందు ఇస్తావా?”
అని ఆ డబ్బాను తీసేసి పారేశారు.
ఆ పొడి నేలపై చిందిపోయింది… ఆమె హృదయం కూడా అలాగే విరిగిపోయింది.
ఆమె నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుని వెనుదిరిగింది. ఆ తరువాత ఎప్పుడూ ఆలయానికి రాలేదు.
ఇంకోవైపు రాజు స్వప్నం తర్వాత నిజం తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించాడు. సైనికులు జరిగిన విషయాన్ని వివరించారు.
ఇది విని రాజు ఆశ్చర్య మయ్యాడు.
“మనమే దేవుని తల్లిని అవమానించామా?”
అని అతని హృదయం కదిలిపోయింది.
రాజు వెంటనే ఆ వృద్ధ మహిళను వెతికేందుకు బయలుదేరాడు.
ఆమె చిన్న గుడిసెకు చేరుకున్నప్పుడు, ఆమె పాదాలపై వంగి ఇలా అన్నాడు.
“తల్లీ… నన్ను క్షమించండి… మీ భక్తిని నేను గుర్తించలేకపోయాను…”
వృద్ధ మహిళ కళ్లలో కన్నీళ్లు వచ్చాయి.
“నేను నా లల్లూ కోసం మాత్రమే ఆందోళన పడ్డాను…”
అని ఆమె చెప్పింది.
రాజు ఆమెను గౌరవంగా ఆలయానికి తీసుకురావాలని కోరాడు.
ఆ రోజు ఆలయం దృశ్యం పూర్తిగా మారిపోయింది. పూలతో అలంకరణ, గౌరవం, భక్తి వాతావరణం.
ఆ వృద్ధ మహిళ మళ్లీ నిమ్మ పొడిని తయారు చేసి తన చేతులతోనే దేవునికి సమర్పించింది.
అని చెబుతారు ఆ రోజు నుంచి ఒక కొత్త సంప్రదాయం ప్రారంభమైంది. 56 భోగాల తరువాత దేవునికి నిమ్మ పొడిని కూడా అర్పించడం ప్రారంభమైంది.
ఆ వృద్ధ మహిళను ప్రజలు “లింగి మాత” అని గౌరవించసాగారు.
కథ సందేశం:
దేవుడు వైభవాన్ని కాదు, నిజమైన ప్రేమను కోరుకుంటాడు.
నియమాల కంటే భావమే ముఖ్యము.తల్లి ప్రేమతో కలిసిన భక్తి ఉంటే, దేవుడు కూడా నమస్కరిస్తాడు.
No comments:
Post a Comment