*భట్టివిక్రమార్క కథలు-10*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
63/374
*2వ బొమ్మ చెప్పిన కథ*
మరొక శుభలగ్నంలో భోజరాజు సింహాసనానికి పూజలూ అవీ చేయించి మొదటి మెట్టు ఎక్కి రెండవ మెట్టుపై అడుగు పెట్టబోయాడు.
ఆ మెట్టు మీదున్న ప్రతిమ - "రాజా! ఆగు. నా మాటలు కాదని ఎక్కబోయావో నీకు కీడు కలిగితీరుతుంది.
విక్రమార్క చక్రవర్తి ఒక్కడే దీనిమీద కూర్చుందుకు అర్హుడు. అతని ప్రజ్ఞావిశేషాలు చెబుతాను. ఆ శుభ లక్షణాలు నీలో ఉంటే అధిష్టించు. లేకపోతే మరలిపో.” అంది.
భోజరాజు చెప్పమన్నట్లు చూసి ఆగిపోయాడు.
"విక్రమార్కుడు భట్టితో కలసి రాజ్యపాలన చేస్తూండగా జరిగిన అద్భుతం చెబుతాను." అంటూ ప్రారంభించింది ప్రతిమ.
ఉజ్జయినీ నగరానికి మూడు యోజనాల దూరంలో ఒక దట్టమైన అరణ్యం ఉంది. అక్కడ క్రూరజంతువులు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.
ఆ భయంకర అరణ్యంలో పురాతనమైన కాళికాలయంలో ఒక సన్యాసి చాలా సంవత్సరాలుగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సుకి మెచ్చి, కాళికాదేవి ప్రత్యక్షమయింది. “సన్యాసీ! నీ తపస్సుకి సంతోషించాను. నీకు వరమిద్దామని వచ్చాను. కావలసిన కోరిక అడుగు" అంది దేవి.
అతను కళ్ళు తెరచి భద్రకాళిని చూసి సంతోషించి... మొక్కి స్తుతించాడు.
"ఆదిశక్తీ! నేను చక్రవర్తిని అవాలి. రాజులందరూ నాకు వశులవాలి. నేను తలచినట్లు జరగాలి. నేను తలచుకోగానే నువ్వు ప్రత్యక్షమై నా కోరికలు తీరుస్తూండాలి.
ఇంతేకాక భేతాళుడు నా అధీనంలో ఉండి నేను చెప్పినట్లు చేస్తూండాలి. ఈ వరాలు ప్రసాదించు." అన్నాడు.
"సన్యాసీ! నువ్విప్పుడు కోరిన వరాలు సామాన్యంగా పొందదగినవి కావు. ఈ వరాలు నేను నీకు అనుగ్రహించాలంటే నేను సంతుష్టిచెందేలా హోమం ఒకటి ప్రారంభించి, నూరుగురు రాజులని హోమగుండంలో అర్పించి దహించాలి.
నూరవ తల ఎంతో ప్రసిద్ధి చెందినవాడూ, రాజాధిరాజూ, ధైర్యసాహసాలూ, వితరణా మొదలైన సుగుణాలన్నీ కలవాడయిన చక్రవర్తిదయి ఉండాలి.
అలాటి రాజుని నువ్విక్కడికి తీసుకువచ్చినప్పుడు ముందుగా భేతాళుడిని పట్టి తెమ్మని నియమించు. అలాటి గొప్పవాడికి గాని భేతాళుడు వశం కాడు.
అలాటి రాజుని నీ దగ్గరకు తీసుకొచ్చాక నా మహిమ వల్ల భేతాళుడు నీకు వశమౌతాడు.
ఇదంతా నీకు అసాధ్యమనిపిస్తే తపస్సంపన్నుడైన ఒక సన్యాసిని తెచ్చి అతని శిరస్సును ఖండించి హోమం చెయ్యి చాలు. నువ్వు తెచ్చే సన్యాసి వల్లనే నీకు భేతాళుడు వశమౌతాడు.
రాజులందరినీ ఒకసారే కాక క్రమంగా తీసుకొచ్చి వారి శిరస్సులతో హోమం చెయ్యవచ్చు. నూరుగురూ ఐతేనే నీ వ్రతం పూర్తవుతుంది. అప్పుడు ప్రత్యక్షమైనీకు వరాలిస్తాను. పో..” అని కాళికాదేవి మాయమైపోయింది.
భద్రకాళి దుస్సాధ్యాలయిన పద్దతులు చెప్పినా సన్యాసి నిరాశచెందలేదు. కర్తవ్యం గురించి ఆలోచించాడు.
'సాధ్యంకాదనీ, అంతరాయాలకు విరక్తితోనూ.. పట్టువదలక - కాళి చెప్పిన ప్రకారం జరిపించి, కోరిన వరాలు సాధించికాని ప్రయత్నంమానను.
నూరుగురుని తెచ్చుట కంటే ఒకరిని తేవడం లెక్కకు సులువే కాని, ఆ దేవి కోరికలాటి లక్షణాలు కల సన్యాసి నాకు దొరకడు. ఒకవేళ దొరికినా తన
తపోమహిమతో అంతా తెలుసుకుంటాడు.
కనుక సన్యాసిని తెచ్చి బలివ్వడం జరిగేపనికాదు.
రాజులని మోసగించి తెచ్చి హోమం చెయ్యడమే సాధ్యం. కర్తవ్యం! అని నిశ్చయించుకుని గుడి ముందు గుండం తవ్వి.. అక్కడక్కడ ఉన్న రాజుల దగ్గరికి పోయి సమయానుకూలమయిన మాటలుచెప్పి కాళికాలయానికి వారు వచ్చేలా చేసి దేవికి మొక్కించి, సాగిలపడినప్పుడు కత్తితో వారి కంఠం నరికి హోమగుండంలో వేయసాగాడు. అలాగ తొంభైతొమ్మిది మంది రాజులను చంపి వారి శిరస్సులని హోమం చేశాడు.
చివరగా చంపబడేవాడు అరవైనాలుగు కళలూ తెలిసినవాడూ,
సకలగుణ సంపన్నుడు, ధైర్యసాహసాలూ, శౌర్యపరాక్రమాలు కల రాజు అయి ఉండాలని భద్రకాళి చెప్పడం వలన - అటువంటి వాడెవడా అని ఆలోచించి, విక్రమార్కుడు తప్ప మరెవరూ లేరని, అతని నెలాగైనా తీసుకొచ్చి చంపి వ్రతం పూర్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.
ఉజ్జయినికి పోయి, పరిసరాలలో నివసిస్తూ, రోజూ రాజుని దర్శించి అతని మనసు చూరగొనేందుకు తన మహిమతో రత్నాలనే గింజలుగా కలిగిన దానిమ్మపండుని పట్టుకుని రాజ సభకి వెళ్ళాడు.
"మహాత్మా! మీ దర్శనం వలన ధన్యుడినయ్యాను.” అని స్వాగతం అని పలికిన రాజుకి -
“రాజేంద్రా! నీ సత్ప్రవర్తన కెంతో సంతోషిస్తూంటాం. నీకు సకల శ్రేయస్సులూ కలగాలి. నిన్ను చూసి సంతోషిద్దామని వచ్చాను." అని దానిమ్మపండిచ్చి వెళ్ళాడు.
అలా నెలరోజుల పాటు జరిగింది. అప్పుడు విక్రమార్కుడు సన్యాసి తనకిస్తున్న పండ్లన్నిటినీ పెడుతూవచ్చిన చోటుకి వెళ్ళి వాటిలో ఒకదానిని పగలగొట్టి చూడగా దానిలోని గింజలన్నీ వజ్రాలని తెలిసింది.
మిగిలిన పండ్లను కూడా పగలగొట్టించి చూడగా అన్నీ రత్నాలు కలిగినవే.
దేవలోకంలో కూడా యిలాటివి ఉండవు అని వాటిని మెచ్చుకుని, 'సన్యాసి ప్రతిరోజూ రావడానికీ, యిలా ఒక పండిచ్చి పోవడానికీ ఏదో కారణం ఉండి తీరుతుంది.
నా వల్ల అతని కేం ఉపకారం కావాలో? రేపతను రాగానే అడిగి తెలుసుకుంటాను.' అని నిశ్చయించుకున్నాడు.
మర్నాడు అలాగే రాజు అడగగా, సన్యాసి “ఓ ప్రభువరేణ్యా! నువ్వు చెప్పింది నిజమే. తెలివైన వాడివి కనుక నా ఉద్దేశం చక్కగా గ్రహించావు. నాపై నీకు దయకలిగేందుకే యిలా చేస్తున్నాను. ఇప్పుడు నువ్వే అడిగావు కనుక చెబుతాను.
మహారాజా! ఈ పురానికి మూడు యోజనాలదూరంగా కల అరణ్యంలో కాళికాలయం ఉంది. నేనాదేవి నారాధిస్తూ అక్కడే ఉన్నాను. దేవికి ప్రీతి కలిగించడానికి వ్రతం పూని, హోమంచేసి ఆ వ్రతాన్ని పరిపూర్ణం చేయడానికి నిశ్చయించుకున్నాను.
ఆ కార్యానికి నాకు సామాన్యులు సహాయం చెయ్యజాలరు. కనుక నీవక్కడికి వచ్చి నా వ్రతం నెరవేరేటట్లు చెయ్యాలి. ఇదే నా కోరిక. దీని కోసమే యింతకాలమూ నిన్నాశ్రయించాను.” అని ప్రార్ధించాడు.
అందుకు విక్రమార్కుడు నవ్వి- “దీనికోసం యిన్నాళ్ళు కాచుకున్నారా! మొదటే చెబితే అప్పుడే సాయం చేసి ఉందును. అనవసరంగా ఆలస్యం చేశారు. ఇదేమంత పని? ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి.” అన్నాడు.
"ఇంకేమీ అక్కర్లేదు. ఇది చాలు.”
“అలా అయితే ఆ గుడి ఉండే స్థలమూ, నేనక్కడ చేయవలసిన పనీ, ఎప్పుడు అక్కడికి రావాలో.. అన్నీ చెప్పండి..
“రాజేంద్రా! రేపు రాత్రికి నేను హోమం ప్రారంభిస్తాను. రేపు సాయంకాలానికి నువ్వొక్కడివే వస్తే చాలు. చెయ్యవలసిన పని స్వల్పం. అక్కడి కొచ్చాక చెబుతాను." అని కాళికాలయం గుర్తులు చెప్పాడు సన్యాసి.
మర్నాడు ఎవరికీ చెప్పకుండా గుర్రంమీద ఆ అరణ్యం చేరుకుని గుర్రాన్ని చెట్టుకు కట్టి సన్యాసి వద్దకు వెళ్ళాడు అప్పటికే హోమం ప్రారంభించిన సన్యాసి రాజుని చూసి... నమస్కరిస్తున్న అతనితో “రాజేంద్రా! వచ్చావా! సత్యశీలుడివి. నువ్విప్పుడు మొదట ఒకపని చెయ్యాలి.” అన్నాడు.
“ఏమిటో సెలవియ్యండి.” అన్నాడు రాజు వినయంగా. సన్యాసి చెప్పసాగాడు.
(సశేషం)
No comments:
Post a Comment