ధర్మజలాలు- ఘర్మజలాలు
'ప్రతిజ్ఞ' అనే తన ప్రసిద్ధ కవితలో మహాకవి శ్రీశ్రీ-కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే స్వేదధారలకు ధర్మజలమనీ, ఘర్మ జలమనీ రెండు విశేషణాలు వాడారు. అవి అమూల్యమైనవి కాబట్టి వాటికి ఖరీదుకట్టే షరాబులు ఉండరని ఆయనే అన్నారు.
జలాల్లో ధర్మ, అధర్మ జలాలనే తేడాలుంటాయా! అని అనుమానం వస్తుంది మనకు. మహాకవుల ప్రయోగాల్లో సాధారణంగా వ్యర్థ పదాలుండవు. మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంతే! కట్టెలు కొట్టి చేపట్టే ధనానికి, కడుపులు కొట్టి చేజిక్కించుకునే దానికి స్వభావంలో ఏ రకమైన తేడా ఉంటుందో-అలాంటిదే ధర్మ, అధర్మ జలాల మధ్యా ఉంటుంది. కాయకష్టంలోంచి పుట్టుకొచ్చే చెమట బిందువులన్నీ-ధర్మ జలాలు! పల్లెల్లో కొందరు భూకామందులు పేదరైతుల నోళ్లు నొక్కి తమ పొలాలకు దౌర్జన్యంగా పంటకాల్వల నీరు మళ్లిస్తుంటారు
నగరాల్లో పేదల కాలనీలకు వెళ్లాల్సిన వాటర్ ట్యాంకులను పెద్దలు తమ ఇళ్లకు తోలుకుపోతుంటారు. వాటిని అధర్మ జలాలుగా చెప్పుకోవాలి. ఘర్మజలం వేడిగా ఉంటుంది. అన్యాయానికి బలై, ఆవేదనకు లోనైనప్పుడు గుండెల్లోంచి ఉబికే లావా- కళ్లలో బరువైన నీటి బిందువై నిలుస్తుంది. నిప్పు కణమై ఎప్పటికైనా అధర్మాన్ని కాలుస్తుంది. ఆ మరిగే నీటిబిందువులు, శ్రమలోంచి పుట్టే స్వేదజలాలు... ఘర్మజలాలే! కండల్ని కరిగిస్తూ, రక్తాన్ని మరిగిస్తూ శ్రమించే కష్టజీవి దేహంపై మెరిసే వైడూర్యాలవి. వాటికి విలువ కట్టడం సాధ్యం కాదని కవి భావం.
పవిత్రమైన గోవుల్లోనూ- ధర్మధేనువులు, ఘర్మధేనువులనే రెండు రకాలుంటాయని వేదం చెబుతోంది. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలూ, విష్ణుపురాణంలో వెన్నెలకంటి సూరనా- ఆ రెండింటి గురించి ప్రస్తావించారు. యజ్ఞసంస్కృతిలో గోవులు, దర్భలు, అగ్ని... మూడూ పరమ పవిత్రాలు. యజ్ఞయాగాదుల్లో వినియోగించే ఆవు పాలు, ఆవు నెయ్యి వంటి వేదోక్తమైన హవిస్సులను ఎంపిక చేసిన కొన్ని గోవుల నుంచి సేకరిస్తారు. అలాంటి ప్రత్యేకమైన గోవులకు ధర్మధేనువులని పేరు. ధర్మధేనువుల పాలు హోమాల్లోనే తప్ప ఇతరత్రా వాడరు. అలాగే, యజ్ఞం పూర్తయ్యేలోగా ధర్మధేనువు ఏ కారణం వల్లనో మరణిస్తే- యజ్ఞమే ఆగిపోయే దుస్థితి ఎదురవుతుందని ఆముక్తమాల్యద చెబుతోంది. అదీ ధర్మధేనువు ప్రత్యేకత!
ఖాండిక్య, కేశిధ్వజుల కథలో ఆముక్తమాల్యద చెప్పిన ధర్మధేనువునే విష్ణుపురాణంలో సూరన ఘర్మధేనువుగా చెప్పాడు. క్రతువు మధ్యలో ఘర్మధేనువు పులివాత పడిందన్నాడు. ఆ క్రతువు పేరు ప్రవర్గ్యం! ఆ విశేష యాగంలో సలసల కాగే నేతిలో ఆవుపాలు పోసి హవిస్సుగా వినియోగిస్తారు. కాబట్టి ఆ సందర్భంలోని ధర్మధేనువునే ఘర్మధేనువు(ఘర్మార్ధా ధేనుః) అంటారని వేదవేత్తలు చెబుతారు. ఘర్మ శబ్దంలోని వేడిమి అర్థాన్ని బట్టి ధర్మధేనువునే సూరన కవి ఘర్మధేనువుగా పేర్కొన్నాడని వ్యాఖ్యాతల అభిప్రాయం. అంటే ధర్మ, ఘర్మ శబ్దాలు తమలో ఎనలేని పవిత్రతను నింపుకొన్నాయని ఆ కథల సారాంశం!
- ఎర్రాప్రగడ రామకృష్ణ
No comments:
Post a Comment