Sunday, June 30, 2024

 శ్రీమద్రామాయణము.

(209 వ ఎపిసోడ్),,

"""""చూచి రమ్మంటే  కాల్చి వచ్చారు""""

""ఏదయినా ఒక పని చేయమంటే చెప్పినదానికంటే ఎక్కువ చేస్తే "వీడు సామాన్యుడు కాడురా చూచి రమ్మంటే కాల్చి వచ్చే రకం" అనటం" సర్వసామాన్యమై పోయింది. మరి రామాయణములో  ఆంజనేయస్వామి వారు సీతా మాతను చూచి లంకను కాల్చి మాత్రమే తిరిగి వచ్చారా ఇంకా ఏమైనా ఘన కార్యాలు సాధించారా  లేదా తెలుసుకుందాము.

"" తతో మయా వాగ్భిరదీన భాషిణా  శివాభిరిష్టారభి ప్రసాదితా|,
జగామ శాంతిం మమ మైథిలాత్మజా  తవాతి శోకేన తథాతిపీడితా"""(సుం.కాం.68-29),

""ఆంజనేయస్వామి వారు లంకాదహన కార్యక్రమము తర్వాత  రాముని చేరి సీతామాత విషయాలు, తాను సాధించిన కార్యాలు తెలియచేస్తు పై విషయాన్ని తెలియచేస్తున్నారు.
"" ఓ రామా? మీ ఇద్దరి ఎడబాటువల్ల మాత శోకము చేతను,రాక్షస్త్రీలు పీడించుటవల్లను మిక్కిలి పరితాపమునకు గురియై యున్న సందర్భములో ఆ తల్లికి నేను ధైర్యము చేకూర్చితిని.తండ్రీ! ఆమెకు ప్రస్తుతము నీ దగ్గరయున్న పరాక్రమవంతుల గూర్చి నీ పరాక్రమము గురించి చెప్పి తల్లికి తృప్తికరమైనవియు శుభముకలిగించు మాటలతో ఆమెను ఓదార్చి ప్రసన్నురాలిని గావించితిని.నేను చెప్పిన మాటలకు ఆ మాత నా సమక్షములోనే మనశ్శాంతి పొందినది. అంతేగాక

""మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః,
మత్తః ప్రత్యవరః కశ్చిత్  నాస్తి సుగ్రీవసన్నిధౌ||,(68-21),

రామా! ఆ తల్లితో నేనిట్లా చెప్పాను.మాతా! మా సుగ్రీవ సన్నిధియందున్న వానరప్రముఖులలో ఏ విధముగ జూచినను నా కంటే ఎంతో గొప్పవారును నాతో సమానలును మాత్రమే గలరు.అంతేగాని నా కంటే తక్కువ వారు నా ప్రభువు వద్దలేరు"

"" అహం తానదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః,
న హి ప్రకృష్టాః ప్రేష్యంతి ప్రేష్యంతి హీతరే జనాః||,(68-22),

ఓ రామా ఆ తల్లికి ఇంకా ఇలా చెప్పాను.
ఓ తల్లీ! రామలక్ష్మణులు, ఆ వానరసేన సముద్రాన్ని దాటి లంకకి ఎలా వస్తారనే అనుమానము మీ కొద్దు తల్లీ "అల్పుడనైన నేనే ఇచ్చటికి అవలీలగ రాగలిగినప్పుడు తక్కినవారి విషయము మరి చెప్పనేల? మాతా! సాధారణముగ యజమానులు ఏ కార్యానికైనా చిన్న వారినే పంపుతారుగానీ గొప్పవారిని పంపరు కదా తల్లీ"యనిచెప్పి మాతకు స్వాంతన చేకూర్చానంటారు.

"" సీతా సందేశాన్ని తెలియ చేస్తున్న సందర్భములో హనుమ రామునికి ఇలా చెపుతున్నాడు.రామా! సీతా మాత  నాతో 'రామలక్ష్మణులు అసహాయ శూరులు సర్వసమర్థులు.వారు నన్నిలా ఉపేక్షించుటకు కారణము నా వలనే ఏదో దోషము వాటిల్లి యుండవచ్చునని విలపిస్తుంటే,అంత నేను,

"" రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణః పరితప్యతే,
కథంచిద్భవతీ దృష్టా న కాలః పరిశోచితమ్,
అస్మిన్ ముహూర్తే దుఃఖానామ్ అంతం ద్రక్ష్యసి భామిని||,(67-26),

ఓ దేవి నా వచనములు నమ్ముము.నీ కోసము శోకిస్తు ఏమియు తోచని స్థితిలో యున్నాడు.అతని స్థితి చూచి లక్ష్మణస్వామి పరితపిస్తున్నాడు.నిన్ను చూచాను కనక నీవు ఇక చింతించవలసిన పనిలేదు.అనతి కాలములో నీ దుఃఖము సమసిపోవునని"ఓదార్చెను.

సముద్రలంఘనము చేసి,లంకని కాల్చి రావణునికి సుద్దులు నిర్భయముగ చెప్పి సీతామాతను ఓదార్చి ధైర్య వచనాలు చెప్పి రామునికి స్వాంతన చేకూర్చిన హానుమంతుల వారి గొప్ప పనులను "చూచి రమ్మంటే కాల్చి వచ్చే రకమనే" జాతీయాన్ని వాడటము నిజముగ మన దురదృష్టము.
ఎంతో గొప్ప విజయాన్ని సాధించి, అందరితో ఘనుడని పేర్గాంచిన హనుమ ఎంతో ఎదిగిపోయినా సీతామాత సమక్షములో ఒదిగి సామాన్యుని వలే అందరికన్నా తాను అల్పుడనని పలకటం వారి గొప్ప సంస్కారానికి మచ్చుతునక.

అందుకే రామాయణము మనకి మనము ఎంత ఎదిగినా ఒదిగియుండటములో గొప్పతనమున్నదని తెలియచేస్తున్నది.అది మనము గమనించుకోవాలి.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment