Sunday, June 30, 2024

*****దేవుడున్నాడు

 *దేవుడున్నాడు!!!* 

              *ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను సామాన్య మానవుల వలె దేవుడిని నమ్మేవాడు.*

              *ఎలా అంటే పూలు, పళ్ళు, దీపం ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు..*

           *అతనికి అలా ఏమీ లభించలేదు. దానితో కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది. అప్పుడు అప్పుడు కొంచెం కోపం కొంచెం ఏదో తెలియని అసహనం వచ్చేంది. అలాటి టైమ్ లో ఒకసారి ఒక గొప్ప సద్గురువు జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు.*

             *ఏదైనా మంత్రజపం సద్గురువు ద్వారా దీక్ష తీసుకుని చేయాలని ఎవరో చెప్పగా అతను విన్నాడు..*

             *ఆ జ్ఞాని అయిన సాధువు వద్దకు ఎంతో ఆశగా వెళ్ళి , దర్శనం చేసుకుని , తన కోరిక వెల్లడించాడు.....*

               *సాధువు అంతా శాంతంగా విని, " నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను కానీ నీ తపన చూస్తుంటే.......సరే..." అన్నారు.*

          *భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు..*
 
             *కానీ జప  విధానం  కొంచెం కష్టం.  నీవు చేయగలవో లేదో...." ఎంత కష్టమైనా నేను చేయగలను.. మంత్రం ఫలిస్తే చాలు " అన్నాడు భక్తుడు ఆనందంగా.అయితే విను. నేను చెప్పే మంత్రం పఠించ నవసరం లేదు కానీ రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి .... అలా తొమ్మిది రోజులు. ఆ మంత్రం ఏమిటంటే.*

                          *దేవుడున్నాడు*

            *భక్తుడు అయోమయంగా చూసాడు.. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు.... చాలా మంత్రాలు విని ఉన్నాడు కానీ ఇదేమిటి పైగా పంచాక్షరీ మంత్రమట ఏమిటది ?దేవుడున్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది ...మళ్ళీ ప్రత్యేకంగా  చెప్పేదేమిటి....????అదీ ఇంకొకరితో  అలా చెబితే తనను పిచ్చివాడి క్రింద జమ కడతారేమో వామ్మో ఎలా*

                  *నా ఆలోచన సాధువు గారికీ చెబుదాం  అంటే నన్ను పిచ్చివాడిలా చూస్తారు కదా. కానీ సాధువు ఒకటేచెప్పారు ఇప్పుడు నన్నేమీ ప్రశ్నించ వద్దు...మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి ,ఆపై నాకు కనిపించు అని.*

               *ఇంక చేసేదేమీ లేక  భక్తుడు ఇంటికి వెళ్ళాడు. ప్రతీసమయంలో ఎవరితోనైనా  " దేవుడున్నాడు "  అని ఎలా అనటం ? అన్నదే ఆలోచన.*

             *ఇంతలో అతని భార్య వచ్చి , పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. ఇతను ప్రయత్నంపూర్వకంగా పలికాడు " దేవుడున్నాడు" అని.  అంతే! ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.*

          *ఇతనికి చాలా ఆనందం వేసింది....వెంటనే అతనికి ఏదో అర్థం అయినట్లు భావన కలిగింది.*

              *ఆ పై ఇంక ఏ  మనిషి కనిపించినా " దేవుడున్నాడు "  మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో.....*

            *ఏదైనా చెడు కనిపిస్తే దేవుడున్నాడు" అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతో.. అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే "దేవుడున్నాడు" శిక్షిస్తాడనే అర్థంతో*

            *పూజలు అనే విషయం వస్తే " దేవుడున్నాడు" అని భక్తివిశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు.*

           *తొమ్మిది రోజులు గడిచాయి. అంతా నెమరువేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు... సాధువు అన్నాడు.*

                *" నువ్వు ఎప్పుడు ,ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించిదేమిటో నాకు చెప్పు ." అని అన్నాడా సాధువు. భక్తుడు తెల్లబోయాడు. అయినా వెంటనే తేరుకుని అన్నాడు.*

                *"నాకు తెలిసింది ఏమిటంటే దైవం సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది కానీ మనం దాచగలిగేది కానీ ఏమీ లేదు. నిష్పక్షపాతంగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు. దయాసాగరుడు, ఆనందస్వరూపుడు" అని అంటూఉండగా*

           *అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు "ఇప్పుడు చెప్పు నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు"*

            *అప్పుడు భక్తుడు తన్మయత్వం తో కళ్ళు మూసుకుని అన్నాడు "ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులోనుండి దేవుడున్నాడు" అనే భావం చెదరకుండా స్థిరంగా  ఉండేలా చేస్తే చాలు "అన్నాడు.*

             *దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది కర్మఫలం, స్వర్గం- నరకం, త్యాగం, కరుణ సానుభూతి, ప్రేమ, సేవ, మానవత్వం, సత్యం, ధర్మం మొదలైన ఉదాత్తమైన భావాలకి ఆలంబన  ఆధారం... "దేవుడున్నాడు" అని మనసారా విశ్వసించటమే !!*
             *ఈ పంచాక్షరీ మంత్రాన్ని పరమాత్మ పాదాల చెంత చేరువరకు నిత్యం జప్పిద్దాం. ప్రతి క్షణం ఆ తండ్రి మనతోనే మనలోనే ఉన్నాడు  అని ఆనందంగా ఉందాం.*

No comments:

Post a Comment