* హైకు తరహా అభివ్యక్తి...!
* పాలు అనేది అనుగ్రహానికి సంకేతమా?
* కలి యుగంలో కేశవుడు ఎలా పొందబడతాడు?
----------
'సరిగ్గా' తిరుప్పావై
12
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్పావై!
పాసురమ్ 12
ఆణ్డాళ్ పన్నెండో పాసురమ్తో నిద్రలేవని ఆ గోపకన్యను నిద్రలెమ్మంటూ కొనసాగుతోంది. మనమూ పాసురమ్తో పాటు సాగుదాం; రండి...
మూలం
కనైత్ తిళఙ్కఱ్ట్రెరుమై కన్ఱుక్కిఱఙ్గి
నినైత్తు ములైవళ్షియే నిన్ఱు పాల్సోర
ననైత్తిల్లమ్ సేఱాక్కుమ్ నఱ్సెల్వన్ తఙ్గాయ్!
పనిత్తలై వీళ్ష నిన్ వాసఱ్ కడైపఱ్ట్రిచ్
చినత్తినాల్ తెన్నిలఙ్గైక్ కోమానైచ్ చెఱ్ట్ర
మనత్తుక్ కినియానైప్ పాడవుమ్ నీ వాయ్ తిఱవాయ్;
ఇనిత్తాన్ ఎళ్షున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్?
అనైత్తిలత్తారుమ్ అఱిన్దేలోరెమ్పావాయ్!
తెలుగులో
అఱుస్తూ తల్లి గేదె ప్రేమగా దూడను
తలుచుకుని పొదుగు నుండి ధారగా పాలు కురిపించగా
ఇల్లంతా తడిసి చిత్తడికాగా సుసంపన్నుడైన వాడి చెల్లెలా!
తలపైన మంచు కురుస్తుండగా నీ వాకిలి తలుపును పట్టుకున్నాను;
కోపంతో దక్షిణాన ఉన్న శ్రీలంక రాజును చంపిన
మనసుకు మధురమైనవాణ్ణి గానం చెయ్యడానికి నువ్వు నోరు తెఱవడం లేదు;
ఇకనైనా లే, ఇదేం మొద్దు నిద్ర?
ఇళ్లల్లోని వాళ్లందఱికీ తెలిసిపోయింది; ఓలాల నా చెలీ!
అవగాహన
"అఱుస్తూ తల్లి గేదె ప్రేమగా దూడను
తలుచుకుని పొదుగు నుండి ధారగా పాలు కురిపించగా ఇల్లంతా తడిసి చిత్తడికాగా" అని అంటూ సంఘటనను, చిత్రణను కలిపి ఆణ్డాళ్ మనకు చెబుతోంది. ఇలా సంఘటనను, చిత్రణను కలిపి చెప్పే విధానం జపనీయ హైకు శిల్పం లో కనిపిస్తుంది. "తల్లి గేదె అఱుస్తోంది; ఇల్లు పాలతో చిత్తడయింది" అని కొంచెం మార్చి చెబితే ఆ అభివ్యక్తి జపనీయ హైకులా ఉంటుంది. మన మట్టికి చెందిన సంఘటన, చిత్రణల సమ్మేళనం ఇది. ఇలాంటి అభివ్యక్తిని భద్రపఱుచుకుందాం. రానున్న తరాలవారికి కానుకగా అందిద్దాం.
"ఇల్లంతా తడిసి చిత్తడికాగా సుసంపన్నుడు అవడం" అన్న భావన గొప్పగా ఉంది. ఇక్కడ పాలు అనేది అనుగ్రహం అనీ, ఆ అనుగ్రహంవల్ల సుసంపన్నమవడం జరుగుతుంది అనీ మనం అర్థం చేసుకోవచ్చు.
"కోపంతో దక్షిణాన ఉన్న శ్రీలంక రాజును చంపిన
మనసుకు మధురమైన వాణ్ణి" అంటూ రాముడు రావణాసురుణ్ణి చంపిన విషయాన్ని చెబుతూ ఆపై దైవత్వం రాక్షసత్వాన్ని కోపంతో చంపేస్తుందనీ, ఆ చంపడంవల్ల దైవత్వం మనసుకు మాధుర్యాన్ని ఇస్తుందనీ చక్కగా తెలియజెప్పింది ఆణ్డాళ్. మనసుకు మధురమైనవాడు దైవం అని చెప్పకుండానే చెబుతోంది ఆణ్డాళ్.
క్రితం పాసురమ్లో "దైవ నామగానం జరుగుతున్నా ఎందుకు నువ్వు లేవడం లేదు?" అని ప్రశ్నించాక ఈ పాసురమ్లో "గానం చెయ్యడానికి నువ్వు నోరు తెఱవడం లేదు" అని మెత్తగా మందలిస్తోంది ఆణ్డాళ్.
శ్రీమద్భాగవతం 12వ స్కంధం, 3వ అధ్యాయం, 53వ శ్లోకంలో వ్యాసుల వారు ఇలా చెప్పారు:
"ధ్యాయం కృతే యజన్ యజ్ఞయై స్త్రేతాయాం
ద్వాపరేऽర్చన్యాద్ ఆప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్తయ కేశవం"
కృత యుగంలో ధ్యానం చేత, త్రేతా యుగంలో యాగ యజ్ఞాల చేత, ద్వాపర యుగంలో అర్చన చేత, కలి యుగంలో సంకీర్తన లేదా నామగానం చేత కేశవుడు పొందబడతాడు అని ఆ మాటలకు అర్థం. కలి యుగంలో దైవం నామగానం చేత పొందబడతాడు కాబట్టి దైవ నామగానం చెయ్యడానికి మొద్దు నిద్రను విడిచి లేవాలని చెబుతూ "ఇకనైనా లే, ఇదేం మొద్దు నిద్ర?" అని అంటోంది ఆణ్డాళ్. ఈ అనడం మనకు కూడా వర్తిస్తుంది. మనం మొద్దు నిద్రను విడిచి లేద్దాం; దైవ నామగానం చేద్దాం.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 12
https://youtu.be/JsN7ASqcdY0?si=964ZZqnR9ppDwlXK
No comments:
Post a Comment