*_“శ్మశానవాటిక” (జాషువా విశ్లేషణ)_*
¦¦¦¦¦¦¦¦¦¦¦💀☠️👽¦¦¦¦¦¦¦¦¦¦¦
*జాషువా కవీంద్రుని కలం నుండి జాలువారిన మరో అద్భుత ఖండకావ్యం శ్మశానవాటిక.*
_మానవులు జీవించి వుండగా వెళ్ళటానికి చూడటానికి యిష్టపడని ప్రదేశాలు రెండు.. *ఒకటి వైద్యశాల రెండు శ్మశానం/వల్లకాడు/రుద్రభూమి.*_
*********
*_“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |_*
*_తస్మాదపరిహార్యే உర్థే న త్వం శోచితుమర్హసి ||”_*
_[భగవద్గీత 2-27]_
*భావం:--* _పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు. మరణించిన వాడు మరలా పుట్టక తప్పదు. అనివార్యమైన ఈ జనన-మరణాల గురించి చింతించ తగదు._
*ఈ భూమిపై చావును తప్పించుకున్న వాడెవ్వడూ లేడు. ధరణిలో అందరు ప్రస్దానమున కేగవలసిన వారే! అయినను 'శ్మశానం' అనే పేరు వినగానే మనస్సు కీడు శంకిస్తుంది, ఏదో భీతి, మదిలో గుబులు. రాత్రుళ్ళూ, మధ్యాహ్నం పూటా అటువైపు వెళ్ళటానికే జంకు. అట్టి శ్మశానాన్ని తన కవితా వస్తువుగా ఎంచుకున్నాడు గుఱ్ఱం జాషువా.*
_కవి ఎప్పుడూ తనచుట్టూ ఉన్న లోకాన్ని ఇతరులకన్న భిన్నంగా, లోతుగా గమనిస్తాడు, అర్ధం చేసుకుంటాడు. తన భావాలను అక్షరరూపంలో పాఠకుల ముందుంచుతాడు._
¥ ¥ ¥ ¥ ¥
*శ్రీశ్రీ తన "మహాప్రస్ధానము" లో ఒకచోట ఇలా అంటాడు కుక్కపిల్ల, సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల.... కాదేది కవిత కనర్హం....*
_అంతకు కొన్ని దశాబ్దాలముందే, *అవునవును 'శ్మశానం కవితకు అర్హమే..!'* అంటూ జాషువా ఈ ఖండకావ్యాన్ని లిఖించాడు._
*ఈ కావ్యంలోని పద్యాలలోని పదభావం సూటిగా పాఠకుని హృదయం లోతుల్లోనికి చొచ్చుకెళ్లి, గుండె బరువెక్కుతుంది, వైరాగ్యభావం దోబుచులాడుతుంది. జీవిత చరమాంకపు సత్యాన్ని కళ్ళెదుట నిలుపుతుంది. ఈ ఖండకావ్యంలో 8 పద్యాలున్నాయి, అన్నీ అణిముత్యాలాంటి పద్యాలే.*
_దువ్వురి వారి "పానశాల" లో ఒకచోట కవి...*"అంతం లేని ఈ భువనమంతయు నొక విశాల పాంథశాల, విశ్రాంతి గృహంబు, అందు నిరుసంజెలు రంగుల వాకిళుల్......... ధరా క్రాంతులు, పాదుషాలు, బహరాము జమిషీదులు కొంత సుఖించి పోయిరెటకో.. పెరవారికి చోటొసంగుచున్!"* అంటాడు._
--------------------
_జాషువ ఈ కావ్యం మొదటి పద్యంలో ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ఈ శ్మశానవాటికలో కొన్ని వందల వేల ఏండ్లుగా నిద్రిస్తున్నవారు.. ఇంతవరకూ ఒక్కరంటే ఒక్కరుకూడా లేచి రాలేదు కదా! అంటూ ప్రారంభించాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చలనం లేని నిద్ర అంటూ వాపోతున్నాడు. ఈ రుద్రభూమిలో తమబిడ్దలను పొగొట్టుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్ళకు వల్లకాడులోని రాళ్లు క్రాగిపోయ్యాయి అని చింతిస్తున్నాడు. కవి హృదయం చూడండి._
_శార్దూలం._
*_ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్థలిన్,_*
*_గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!_*
*_యెన్నాళ్ళీ చలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!_*
*_కన్నీటం బడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్!_*
_ప్రకృతి గతి తప్పి, ఆకాశంలో కారుమబ్బులు కమ్మి చిమ్మచీకటి నిండి, దయ్యాలు, గూడ్లగూబలు చెరలాడుచు, కాకులు మూకుమ్మడిగా గోలచేసినా జనవాసం భీతిల్లుతుంది. కానీ ఈ శ్మశానవాటికలో భీతికి తావేలేదు. అంతా నిశ్శబ్దం.... శ్మాశాన నిశ్శబ్దం....._
*కవికలం ఏమంటున్నది?*
_శార్దూలం._
*_ఆకాశంబున కారుమబ్బుగము లాహారించె, దయ్యాలతో_*
*_ఘూకంబుల్ చెరలాడసాఁగినవి; వ్యాఘోషించె నల్దిక్కులన్_*
*_గాకోలంబులు ; గుండెఝల్లు మనుచున్నంగాని యిక్కాటియం_*
*_దా కల్లాడిన జాడలే; దిచ్చట సౌఖ్యం బెంత క్రీడించునో!_*
_ఈ రుద్ర భూమికి చెడ్డవాడు, మంచివాడనే తేడాలేదు. యాజమాని, సేవకుడనే వ్యత్యాసం లేదు. హతుడు, హంతకుడు యిద్దరూ సమానమే ఈ నేలలో కవి, రాజు, లేత ఇల్లాలి మాంగల్యం, చిత్రకారుడు ఎవ్వరైతేనేమి ఆయుష్షు తీరాక యిక్కడ విశ్రమించవలసిన వారే!_
_సృష్టికి లయకారుడు శివుడు. ఆయనకిష్టమైనది తాండవం అట్టి శివతాండవానికి అనువైనది ఈ శ్మశానవాటిక కన్నమిన్న ఏమున్నది. ఈ వాటిక శివుడు తన పిశాచ అనుచరగణంతో నాట్యమాడు రంగస్ధలమంటున్నాడు కవి, అంతేకాదు ఈ రుద్రభూమి మరణదూత భూమిని పాలించు బూడితతో చేసిన సింహసనమట! ఎంతలోతు భావం కవిది._
*కవిహృదయం ఏమంటుందో చూడండి.*
_సీసపద్యం._
*_ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని_*
*_కలము, నిప్పులలోనఁ గఱగిఁపోయె!_*
*_యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని_*
*_యధికారముద్రిక లంతరించె!_*
*_యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ_*
*_సలసౌరు, గంగలోఁ గలిసిపోయె!_*
*_యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న_*
*_చిత్రలేఖకుని కుంచియ, నశించె!_*
_తేటగీతి._
*_ఇది పిశాచులతో నిటాలేక్షణుండు_*
*_గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;_*
*_ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ_*
*_నవనిఁ బాలించు భస్మసింహాసనంబు_*
_రాత్రి సమయం... తిమిరం నిండిన శ్మశానం....నిశ్శబ్దం రాజ్యమేలు వేళ.... ఆ మూల కొత్తసమాధి.... సమాధిపై ఆముదపుదీపం ఎలా ఉందంటే, కదులుతున్న మిణుగురులా రెపరెపలాడుతూ వెలుగుతున్నదట. అరే! అదేమిటి? ప్రమిదలో అముదం నిండుకున్నను ఇంకా దివ్వె వెలుగుతున్నదేమిటి?! అది.. ఆ సమాధిలో నిద్రిస్తున్న అభాగ్యురాలి యొక్కహృదయం కాబోలు అనగానే... ఆ దివ్వె వెలుగు!? పాఠకుని గుండెను సూటిగా తాకి ఆర్ధ్రమయ్యే భావం. ఇలాంటి భావన చెయ్యడం చేయి తిరిగిన కవికే సాధ్యం._
_చంపకమాల._
*_ముదురు తమస్సులో మునిఁగిపోయిన క్రొత్త సమాధిమీదఁ బై_*
*-బొదలు మిణుంగురుం బురువు పోలిక వెల్గుచున్నదివ్వె, ఆ_*
*_ముద ముడివోయినన్ సమసిపోవుట లేదది దీప మందుమా?_*
*_హృదయము సుమ్మి, నిల్పి చనియెన్గత పుత్రిక, యే యభాగ్యయో!_*
_కవితా సుధలొలికించిన కవుల కలాలు, శ్రవణాందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు... ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి. పంచభౌతికమైన ఈ మేను కడకు ప్రకృతిలో కలసి పోవలసినదే..! అందులో మమేకం కావలసినదే..! పుట్టుక తల్లిగర్భం నుంచే అయిననూ, తల్లి కూడా ప్రకృతి జనీతమే కదా..! మట్టిలో ఖననము చెయ్యబడిన తనువు క్రమంగా కృశించి,నశించి, జీర్ణించి మట్టిలో మట్టిగా కలసిపోతుంది. మట్టిరేణువులలో రేణువులుగా కలసిపోతుంది. ఔను ఇది నిక్కమే కదా...! అదిగో ఆ కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలో అలనాటి సుకవులు కాళిదాసు, భారవుల మృతరేణువులు కలసి ఉన్నాయేమో కదా!_
*మరి కవిమనస్సు ఏమంటున్నది.*
_చంపకమాల._
*_కవుల కలాలు, గాయకుల కమ్మని కంఠము లీ శ్మశానపుం_*
*_గవనులఁ ద్రొక్కి చూచెడి; నొకానొకనాఁడల కాళిదాస భా_*
*_రవుల శరీరముల్ ప్రకృతి రంగమునం దిపు డెంతలేసి రే_*
*_ణువులయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై_*
_శ్మశానవాటిక వాకిటనుంచొని ఒకపర్యాయం పరికించి చూచిన మనగుండెలు తర్కుపోతాయి. మన మనస్సు కరిగి నీరై పోతుంది. ఆ మూలనున్న గోరిలను చూస్తే... అన్నెం పున్నెం ఎరుగని వయస్సులోనే మృత్యువు గర్భంలో చేరిన చిన్నారులు. ఆ సమాధులలో ఏ చిన్నారి పొన్నారి రూపసి తనువు చాలించిందో? ఏ ముద్దులు మూటలుకట్టు రూపసి అలసిసొలసి నిద్రిస్తున్నదో..! ఏ తల్లి లీలావతి కడుపు తీపి దాగున్నదో?_
_శార్దూలం._
*_ఆలోకించిన గుండిల్గరగు; నాయా పిల్ల గోరీలలో_*
*_నే లేబుగ్గల సౌరు రూపరియెనో! యేముద్దు నిద్రించెనో!_*
*_యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో?_*
*_యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో?_*
_వల్లకాడులో అస్పృశ్యతకు తావు లేదు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్ణమైనా ఇక్కడ ఒక్కటే..! అందరినీ స్వీకరించడంలో సమతా భావం. పులిపక్కన సాధుజంతువు మేకను జేర్చి బుజ్జగించి, ఊరడించు అభేద భావనావని ఈ శ్మశానభూమి._
_మత్తేభం._
*_ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు;విశ్వంభరా_*
*_నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంబు గావించి, య_*
*_త్కటంపు బెబ్బులితోడ మేకఁ నొక్క పక్కజేర్చి జోకొట్టి యూ_*
*_ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్!_*
_మారుతున్న, పరిగెడుతున్న కలికాలంలో ఆర్థిక అవసరాలు, ధనవ్యామోహం-రక్తబంధాలను, పాశాలను త్రెంచుతున్నాయి. తమను కని అల్లారు ముద్దుగా పెంచి పోషించిన తల్లిదండ్రులను వృధ్యాపంలో బ్రతికి ఉండగానే వల్లకాటిలో అర్ధరాత్రి వదిలి వెళ్ళుతున్న రోజులివి. ఆలాంటప్పుడు అనాథ పేదవాని మృతశరీరాన్ని పట్టించుకొని, ఖననము చేయు దాతలెందరు?అన్నింటికన్నా దారుణమైనది, భయంకరమైనది,... దరిద్రము/పేదరికము. శ్మశానంలో ఖననానికి నోచుకోని ఒక అనాథ పీనుగను గూర్చి కవి ఎంత ఆర్తితో హృదయాన్ని పిండే ే విధంగా వర్ణించాడో..! అది కవి వేదనకాదు... పాఠకుని హృదయ ఘోష... కాదంటారా?_
_ఉత్పలమాల._
*_వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలరాతి గో_*
*_రీకడఁ బారవేయబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే_*
*_యాకటి చిచ్చునన్ గుమిలి, యార్చి, గతించిన పేదవాని దౌ_*
*_నో కద! వానికై వగవఁ డొక్కడందు; దాఁచదు కాటినేలయున్!_*
💀👽💀👽💀👽💀👽
*_{ఇది మీకు తెలిసినది కావచ్చు.. అయినా... ఇంకో రెండు రోజులలో.. సెప్టెంబర్ 28..న “జాషువా” గారి జయంతి సందర్భంగా వారి రచనలలో ఒకదానిని ఈరోజు తెలియని వారికి పరిచయము చేస్తున్నాను. ఇప్పటికే తెలిసిన వారికైతే మరోసారి గుర్తుచేస్తున్నానంతే!: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
No comments:
Post a Comment