చరిత్ర చదవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి ?
మంచి ప్రశ్న. ఓ ఉపోద్ఘాతం.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు ఓ మారు తమ గురువైన కట్టమంచి రామలింగారెడ్డి గారితో మాట్లాడుతున్నారు. ప్రస్తావవశాన రామాయణం ప్రసక్తి వచ్చిందట. బౌద్ధ దశరథజాతకం లో రాముడు, సీత అన్నాచెల్లెళ్ళు. అలాగే భార్యాభర్తలు కూడా.
దీనిని రాళ్ళపల్లి వారు గర్హిస్తే, రెడ్డి గారు అన్నారట - "ప్రాచీన గ్రీక్ రాజ్యంలో ఇలాంటి సందర్భం ఉంది. ఓ రాజు తన వారసులే, అంటే తన రక్తమే సిమ్హాసనం ఎక్కాలని చెప్పి సొంత చెల్లెల్ని పెళ్ళాడాడు".
ఆపై రాళ్ళపల్లి వారు వ్రాసుకొస్తారు.
"కేవలం వాస్తవాలు చదవడమే చరిత్ర ఆని కొందరంటారు. కానీ - ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణను వట్టి వాస్తవాల తాలూకు సమాచారజ్ఞానం మాత్రమే చెప్పజాలదు. ఆ శక్తి వాస్తవాలకు లేదు."
******
చరిత్ర ను భారత వర్షంలో ఇతిహాసం అన్నారు. ఇతిహాసం అంటే -
ధర్మార్థ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితమ్ |
పూర్వవృత్తం కథాయుక్తం ఇతిహాసం ప్రచక్ష్యతే ||
ధర్మాధర్మ విచక్షణే ఇతిహాసం. ధర్మం వల్లే వ్యక్తులకు, కుటుంబాలకు దేశానికి కూడా అస్తిత్వం ఏర్పడుతుంది. భాగవతంలో బలిచక్రవర్తి - ఓ ధర్మాన్ని చెప్తాడు. ఇచ్చినమాట వెనక్కు తీసుకోకూడదని ఆ ధర్మం. ఆ ధర్మం గురించి చెప్తూ బలి మహారాజు శిబిప్రముఖుల గురించి చెప్తాడు.
కారే రాజులు? రాజ్యముల్ కలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వా
రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై
పేరైనం గలదే? శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా!
ఎందరో పుడతారు, గిడతారు. కానీ కొందరు ఉన్నతులే నిలుస్తారు. నిలవాలి. వారి ఔన్నత్యాన్ని భావితరాలు సంభావించాలి, అనుసరించాలి. వారి చరిత్ర ఉపాదేయం కావాలి.
*******
భారతదేశాన్ని పాలించి దారుణంగా దోచిన ఆంగ్లేయులకు, ఆపై వచ్చిన , న్యస్త స్వార్థ శక్తులకు ఈ విషయం బాగా తెలుసు. ఆ కారణానే చరిత్రని ఓ పద్ధతి ప్రకారం నాశనం చేశారు. వ్యక్తుల ఔన్నత్యం కన్నా, వ్యక్తుల ఆధార్ కార్డుల వంటి శుష్క వాస్తవాలతో నింపారు. ఈ కుట్ర ఎన్నో వందల ఏళ్ళుగా సాగుతోంది.
పాశ్చాత్యులకు చరిత్ర అంటే "విజయం". విజయం సాధించిన వారి వివరాలు. అందుకనే చెల్లెళ్ళను పెళ్ళి చేసుకున్న రాజు చారిత్రక పురుషుడయ్యాడు.
మార్క్సిస్టులకు - గత చరిత్ర మొత్తం చెత్త. "ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?" కాబట్టి - గడచిన చరిత్రని తగలెట్టండి.
ఈ రెండు ఆలోచనలే గత 300 ఏళ్ళుగా భారతదేశంలో చరిత్రని శాసిస్తున్నాయి. అనుబంధశక్తులు మరిన్ని.
ఈ విధమైన సోషియల్ సైన్స్ ను చదవడం వల్ల ప్రజల్లో మానసిక బానిసత్వం తప్ప మరే ఉపయోగమూ ఉండదు. మన ప్రస్థానం ఎక్కడికో తెలియాలంటే అస్తిత్వ మూలాలు తెలియాలి. చెట్టు ఎదగాలంటే మూలాలు స్థిరంగా ఉండి తీరాలి.
కొందరంటారు - "మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి" అని ఏదో ప్రాచీన ఔన్నత్యాన్ని చదువుకుంటే ఏం ప్రయోజనం? శాస్త్ర విజ్ఞానం పెరగాలి. అందువల్లే దేశం బాగుపడుతుంది ఆని వాదన.
చాలా తెలివైన, మోసపూరితమైన, డొల్ల వాదన ఇది. శాస్త్ర పరిశోధనలు పెరగవలసిందే. చరిత్ర, శాస్త్రపరిశోధనా ఒకదానికి ఒకటి అనుబంధమైన విషయాలు. శాస్త్ర పరిశోధనలో ఎంతో ముందంజ వేసిన జపనీసు వారు తమ సమురాయ్ జాతి ఔన్నత్యాన్ని, పౌరుషాలను పట్టించుకోక ఉండలేదు. నిజానికి వారికి కావలసిన మానసికశక్తిని వారు తమ సమురాయ్ వీరుల మొక్కవోని ధైర్యసాహసాలు, ఓటమికన్నా చావు ముఖ్యంగా భావించే తెగువ - వీటి ద్వారానే సంపాదించుకొంటారు.
భారతదేశంలో మాత్రం - ఇలా ఉండదు. చరిత్ర పాఠాల్లో ఎక్కడా దేశ ఔన్నత్యం, త్యాగం, తెగువ, వీరత్వం, కళా స్ఫూర్తి, నిష్కామత్వం - ఇవేవీ ఉండవు. పిచ్చి రాజుల పేర్లు, కాలాలు, యుద్ధాలు, పూర్తిగా అబద్ధపు సిద్ధాంతాలు - ఇవే ఉన్నాయి.
*****
ప్రశ్నకు వస్తే - ఇప్పుడు భారతదేశంలో పిల్లలు తమ పాఠ్యపుస్తకాలలో చదువుకుంటున్న చరిత్ర సబ్జెక్ట్ వల్ల ఏ ఉపయోగమూ లేదు. ఈ చరిత్ర పూర్తిగా తిరిగి వ్రాయాలి. కొత్త చరిత్ర - భారతదేశపు అస్తిత్వాన్ని చెప్పాలి. ఎవిడెన్సులు స్పష్టంగా చూపుతూ, సిద్ధాంతాలు గల అన్ని పార్శ్వాలను స్పష్టంగా ప్రస్తావించాలి. సమాధానం తెలియని ప్రశ్నలను ప్రశ్నలుగానే ఉంచాలి.
అటువంటి చరిత్ర కనుక ఒకటి ఏర్పడితే, ఆ చరిత్ర జాతికి ఇచ్చే మానసిక శక్తి - ప్రజలను అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రోత్సాహం ఇస్తుంది.
అటువంటి నెరేషన్ - భారతదేశానికి ఎప్పుడొస్తుందో ?
No comments:
Post a Comment