Sunday, April 26, 2026

మనసే మూలం!

 మనసే మూలం!

మనిషి కీర్తినీ, ఆనందాన్నీ పొందాలనుకోవడం సహజం. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అప్పటికి సంతృప్తి లభించకపోతే ఇంకా ఇంకా కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాడు. కానీ అన్నింటికీ మూలమైన అసలు సంగతిని మరచిపోతాడు

సమంతుడు శ్రావస్తిలో ధనిక కుటుంబానికి చెందిన యువకుడు. గృహస్థు జీవితం అతడికి అంతగా ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. భిక్షువుగా మారి ధ్యానసాధన చేసి జ్ఞానాన్ని పొంది ఆనందంగా, గౌరవంగా జీవించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక భిక్షువు దగ్గరికి వెళ్లి మనసులోని మాట చెప్పాడు. ఏదో ఒక ఇబ్బంది తలెత్తినప్పుడు భిక్షువుగా మారాలని వచ్చి, కొంతకాలం తరువాత గృహస్థుగా జీవించడానికి వెళ్లిపోయిన వారిని ఎందర్నో ఆ భిక్షువు చూశాడు. ఆ అనుభవంతో సమంతుడికి వెంటనే దీక్ష ఇవ్వ కుండా 'నాయనా! ముందు నీ ఆస్తిని మూడు భాగాలు చేసి ఒక భాగం నీ కుటుంబం కోసం వినియోగించు, మరో భాగంతో వ్యాపారం కొనసాగించు, మిగిలిన భాగాన్ని పూర్తిగా దానాలకు ఉపయోగించు. నువ్వు కోరుకున్న గౌరవం, ఆనందం లభిస్తాయి' అని చెప్పి పంపాడు. సమంతుడు అలాగే చేశాడు

కొన్నాళ్లకు మళ్లీ వచ్చి 'అయ్యా మీరు
చెప్పినట్లే చేశాను. అయినా నాకు శాంతి
కలగలేదు' అన్నాడు. 'సమంతా! ఈసారి
నేను చెప్పే ఓ అయిదు విషయాల్ని
పాటించు... జీవహింస చేయకు, అబద్ధాలు
చెప్పకు, పరుల సొమ్ము ఆశించకు, వ్యభిచరిం
చకు, మద్యపానం- మత్తుపదార్థాల జోలికి
వెళ్లకు. ఈ అయిదింటినీ 'పంచశీల' అంటారు.
వీటిని పాటించు' అని చెప్పి పంపించాడు
కొన్నాళ్ల తరవాత సమంతుడు మళ్లీ వచ్చాడు. భిక్షువు ఈసారి 'బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి' అనే త్రిరత్నాల్ని శరణువేడమని చెప్పి పంపాడు. అవి కూడా సమంతుడికి శాంతిని ఇవ్వలేక పోయాయి. 'స్వామీ... మీరు చెప్పినవి ఏవీ నాకు మనశ్శాంతిని చేకూర్చలేదు. నా చింత, దుఃఖం తీరలేదు. అని చెప్పాడు. సమంతుణ్ని సరైన దారిలో పెట్టడం తన వల్ల కాదని గ్రహించిన ఆ భిక్షువు అతణ్ని బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్లి విషయమంతా చెప్పాడు. బుద్ధుడు ఆ యువకుడికి ధర్మోపదేశం చేశాడు.

'సమంతా! మనిషికి మనసే మూలం. సుఖదుఃఖాలకు, కోరికలకు అన్నింటికీ అదే కేంద్రం. చిత్తాన్ని సంస్కరించకుండా బాహ్య విషయాలపై ఎంత సాధన చేసినా ఉపయోగం లేదు. మనసు తనకు ఇష్టమైన విషయాల మీదికి వేగంగా పోయి వాలుతుంది. తెలివిగలవాడు ముందుగా దాన్ని మంచి మార్గంలోకి మళ్లించుకుంటాడు. అప్పుడే దుఃఖాన్ని తొలగించుకుని ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చుకోగలుగుతాడు' అన్నాడు. అప్పుడు కానీ సమంతుడికి అసలు విషయం బోధ పడలేదు. మార్పు మూలంలోనే రావాలి. అలాంటి మార్పే సుస్థిరంగా ఉంటుంది. అదుపు చేయాల్సింది కోరికల్ని కాదు, కోరికల మూలమైన చిత్తాన్ని అని తెలుసుకుని ఆ దిశగా ప్రయాణం కొనసాగించాడు.

ఎన్.బి.యస్.శ్రీనివాస్ పోలిశెట్టి

No comments:

Post a Comment