* భక్తుల లక్ష్యం ఏమిటి?
* 'ఆణ్డాళ్'... అంటే?
----------
'సరిగ్గా' తిరుప్పావై
28
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్పావై!
(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్పావై అని అవుతుంది. తమిళ్ష్లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.)
పాసురమ్ 28
ఆణ్డాళ్ కృష్ణుడితో నీ గానం చేస్తూ కావాల్సినవి పొంది కలిసి ఉండి చల్లగా బతుకుతామని చెప్పుకున్నాక కొనసాగుతూ ఇరవయ్యెనిమిదో పాసురమ్లోకి వెళ్లింది; మనమూ వెళదాం రండి...
మూలం
కఱవైగళ్ పిన్సెన్ఱు కానం సేర్న్దుణ్బోమ్;
అఱివొన్ఱుమ్ ఇల్లాద ఆయ్క్కులత్తు ఉన్దన్నై
పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యాముడైయోమ్;
కుఱైవొన్ఱుమ్ ఇల్లాద గోవిన్దా! ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కిఙ్గొళ్షిక్క ఒళ్షియాదు;
అఱియాద పిళ్ళైగళోమ్ అన్బినాల్ ఉన్దన్నై
సిఱుపేర్ అళ్షైత్తనవుమ్ సీరియరుళాదే;
ఇఱైవా! నీ తారాయ్ పఱైయేలోరెమ్పావాయ్!
తెలుగులో
పాడి పశువుల్ని కాచుకుంటూ అడవిలో తింటాం;
ఏ మాత్రమూ చదువులేని గోప కులంలో నువ్వు
పుట్టడంవల్ల మాకు పుణ్యం వచ్చింది;
ఏ లోపమూ లేని గోవిందుడా! నీతో ఉన్న
బంధం పోగొట్టుకున్నా పోదు;
ఎఱుక లేని పిల్లలం అనురాగంతో నిన్ను
అమర్యాదగా పిలిచినా కోప్పడకు;
భగవంతుడా! తప్పెటను ఇచ్చేసెయ్; ఓలాల నా చెలీ!
అవగాహన
పశువుల్ని మేపుకునే పామరులం మేం అందువల్ల మా పిలుపులు అమర్యాదగా ఉండుంటే కోప్పడకు అని కృష్ణుణ్ణి కోరుకుంటోంది ఆణ్డాళ్. "నీతో ఉన్న బంధం పోగొట్టుకున్నా పోదు" అనడం ఒక ఉన్నతమైన భావానికి అభివ్యక్తి. 'భగవంతుడితో ముడిపడి ఉన్నాం' అని అనుకోవడం ఒక ఉన్నతమైన స్థితి. భగవంతుడితో బంధుత్వాన్ని పొందడం భక్తుల లక్ష్యం. భక్తులు ఎప్పటికీ దైవానికి వీడిపోని బంధువులు.
అన్నమయ్య ఇలా అంటారు:
"పామరుల కెంతైనా ఫలియించనేరదు
శ్రీమాధవ నీవు దయసేసితే నీడేరును"
'భగవంతుడి దయ ఉంటేనే సిద్ధి కలుగుతుంది'. ఈ నిజం తెలిసిన ఆణ్డాళ్ "భగవంతుడా! తప్పెటను ఇచ్చేసెయ్" అని అడుగుతూ అనుగ్రహాన్ని అభ్యర్థిస్తోంది. దైవానుగ్రహాన్ని పొందడమే సిద్ధి పొందడం. రెండో పాసురమ్లో "సిద్ధి కలగాలని అనుకుని సంతోషిస్తూ ఉందాం" అని అన్న ఆణ్డాళ్ ఇక్కడ సూటిగా దైవాన్ని ఆ సిద్ధిని ఇచ్చెయ్యమంటోంది.
భక్తి లోతుల్లోకి వెళ్లి అక్కడ మసలూతూ ఉండే పురుషుణ్ణి 'ఆళ్ష్-వార్ ' అనీ, మహిళను 'ఆళ్ష్-వాళ్' అనీ (తమిళ్ష్ భాషలో) అంటారు. ఆ ఆళ్ష్-వాళ్ ఈ 'ఆణ్డాళ్. ఒక ఆణ్డాళ్గా నీతో ఉన్న బంధం పోగొట్టుకున్నా పోదు అని దైవంతో చెప్పుకుంటోంది.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 28
https://youtu.be/QXf7L_xgWKs?si=gqB55wMlwJp3bcfr
No comments:
Post a Comment