----------
'సరిగ్గా' తిరుప్పావై
29
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్పావై!
(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్పావై అని అవుతుంది. తమిళ్ష్లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.)
పాసురమ్ 29
సామాన్యులమూ, పామరులమూ అయిన మాకు అనుగ్రహాన్ని ఇచ్చేసెయ్ అని భగవంతుణ్ణి అడిగాక ఆణ్డాళ్ ఇరవైతొమ్మిదో పాసురమ్గా ఇంకేం కావాలో కూడా అడుగుతోంది ఇలా...
మూలం
సిఱ్ట్రఞ్సిరుకాలే వన్దున్నైచ్ చేవిత్తున్
పొఱ్ట్రామరైయడియే పోఱ్ట్రుమ్ పొరుళ్ కేళాయ్;
పెఱ్ట్రమ్ మెయ్తుణ్ణుమ్ కులత్తిల్ పిఱన్దు నీ
కుఱ్ట్రేవల్ ఎఙ్గళైక్ కొళ్ళామఱ్పోగాదు;
ఇఱ్ట్రై పఱైకొళ్వాన్ అన్ఱుకాణ్ గోవిన్దా!
ఎఱ్ట్రైక్కుమ్ ఏళ్షేళ్ష్ పిఱవిక్కుమ్ ఉన్దన్నోడు
ఉఱ్ట్రోమే యావోమ్; ఉనక్కేనామ్ ఆట్సెయ్వోమ్
మఱ్ట్రైనమ్కామఙ్గళ్ మాఱ్ట్రేలోరెమ్పావాయ్!
తెలుగులో
లేసంజలో వచ్చి నిన్ను పూజించి నీ
బంగారు పాదాల్ని ఎందుకు కీర్తిస్తున్నామో విను;
గోవుల్ని మేపుకుని పొట్టపోసుకునే కులంలో పుట్టిన నువ్వు
చిన్న చిన్న ఉపచారాల్ని చేస్తున్న మమ్మల్ని స్వీకరించకుండా ఉండద్దు;
ఈనాడు తప్పెటను తీసుకోవడానికి మాత్రమే కాదని గ్రహించు గోవిందా!
ఏనాటికీ, ఏడేడు జన్మలకూ నీతో
బంధుత్వం కలవాళ్లమై ఉంటాం, నీకే సేవ చేస్తూంటాం;
మా తక్కిన కోరికల్ని తొలగించెయ్; ఓలాల నా చెలీ!
అవగాహన
మేం పశువుల్ని మేపుకునే పామరులం, అని క్రితం
పాసురమ్లో చెప్పిందానికి కొనసాగింపుగా ఇక్కడ "చిన్న చిన్న ఉపచారాల్ని చేస్తూ ఉన్న మమ్మల్ని స్వీకరించకుండా ఉండద్దు" అంటూ కృష్ణుణ్ణి వేడుకుంటోంది ఆణ్డాళ్.
"ఈనాడు తప్పెటను తీసుకోవడానికి మాత్రమే కాదని గ్రహించు గోవిందుడా" అంటూ లేసంజలో వచ్చి నిన్ను పూజించి, నీ బంగారు పాదాల్ని కీర్తిస్తున్నది ఎందుకో వినమని "ఏనాటికీ, ఏడేడు జన్మలకూ నీతో బంధుత్వం కలవాళ్లమై ఉంటాం, నీ సేవ చేస్తూంటాం" అని చెబుతోంది ఆణ్డాళ్. "మా తక్కిన కోరికల్ని తొలగించెయ్" అని కృష్ణుణ్ణి ప్రార్థిస్తోంది ఆణ్డాళ్. ఇది మహోన్నతమైన ప్రార్థన! ఆణ్డాళ్ వంటి మహోన్నతమైన భక్తులు మాత్రమే ఇలా దైవాన్ని ప్రార్థించగలరు!! నీతో బాంధవ్యం వినా మా మఱో కోరికను తొలగించెయ్ అని దైవాన్ని ప్రార్థించడం పండిన భక్తికి తార్కాణం. ఇది పూర్తిగా భగవంతుడితో సమన్వయ్వం అయ్యే స్థితి. "తత్తు సమన్వయాత్" అని ఒక బ్రహ్మసూత్రం (1-1-4) తెలియజేస్తోంది. అంటే బ్రహ్మం సమన్వయంవల్లే (సుసాధ్యమౌతుంది) అని అర్థం. ఇక్కడ సమన్వయం అంటే సంయోగం అని. మఱే కోరికా లేకుండా దైవంతో సంయోగ స్థితిని కోరుకుంది ఆణ్డాళ్.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 29
https://youtu.be/Mo7gyopNKbg?si=K0jStY0FvjG4zPET
No comments:
Post a Comment