* నెయ్యి దేనికి ప్రతీక?
* చల్లగా బతకాలంటే?
----------
'సరిగ్గా' తిరుప్పావై
27
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్పావై!
(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్పావై అని అవుతుంది. తమిళ్ష్లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.)
పాసురమ్ 27
ఆణ్డాళ్, ఇరవయ్యేడో పాసురాన్ని ఇదిగో ఇలా ఇస్తోంది; అందుకుందాం రండి...
మూలం
కూడారై వెల్లుమ్ సీర్కక్కోవిన్దా! ఉన్దన్నైప్
పాడిప్పఱై కొణ్డు యామ్ పెఱు సమ్మానమ్;
నాడు పుగళ్షుమ్ పరిసినాల్ నన్ఱాగ
సూడగమే, తోళ్వళయే, తోడే, సెవిప్పూవే
పాడగమే ఎన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్,
ఆడైయుడుప్పోమ్, అదన్పిన్నే పాఱ్సోరు
మూడ నెయ్పెయ్దు ముళ్షఙ్గై వళ్షివార
కూడియిరున్దు కుళిర్న్దేలోరెమ్పావాయ్!
తెలుగులో
పెడసరివాళ్లను ఆకట్టుకునే మామంచి గోవిందుడా! నిన్ను
గానం చేసి, తప్పెటను అందుకుని మేం కానుకలు పొందుతాం;
దేశమే బాగా మెచ్చుకునే తీరులో
గాజులు, దండకడియాలు, దిద్దులు, చెవి పువ్వులు
నాణ్యమైన చెప్పులు వంటివి ధరిస్తాం;
శాలువల్ని కప్పుకుంటాం; అటుపైన పాల అన్నానికి
పైపూతగా
అఱిచేతి నుండి జాలువాఱేట్టు నెయ్యిపోసుకుంటాం;
కలిసి ఉండి చల్లగా బతుకుతాం; ఓలాల నా చెలీ!
అవగాహన
చాల మంది నాస్తికులు ఒకదశ తరువాత తమ తప్పు తెలుసుకుని ఆస్తికులైపోయిన చారిత్రిక సత్యం మనకు తెలుసు. సరిగ్గా ఆ సత్యాన్నే "పెడసరివాళ్లను ఆకట్టుకునే మామంచి గోవిందుడా" అంటూ తెలియజేస్తోంది ఆణ్డాళ్. నిన్ను
గానం చేసి, తప్పెటను అందుకుని "కానుకలు పొందుతాం" అంటూ దైవాన్ని గానం చేస్తూ తామూ "దేశమే బాగా మెచ్చుకునే తీరులో గాజులు, దండకడియాలు, దిద్దులు, చెవిపువ్వులు నాణ్యమైన చెప్పులు వంటివి ధరిస్తాం, శాలువల్ని కప్పుకుంటాం" అని చెబుతోంది ఆణ్డాళ్.
నెయ్యి అత్యుత్తమమైన పదార్థం. ఏ మార్పూ పొందబోని స్థితి నెయ్యి. పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ ఇలా రూపాంతరాలుంటాయి. నెయ్యికి రూపాంతరం ఉండదు. పాలను కాచి తోడుపెడితే పెరుగు, పెరుగును చిలికితే వెన్న, వెన్న కాచాక నెయ్యి వస్తాయి. పాలకు నెయ్యి ఉచ్చస్థితి. ఆణ్డాళ్ నెయ్యిని పరమాత్మకు ప్రతీకగా సూచిస్తోంది. పాల అన్నం వంటి తమ జీవితాలకు పైపూతగా నెయ్యిలాంటి పరమాత్మను నిలుపుకుంటాం అన్నదాన్ని సూచ్యార్థంగా చేసి "పాల అన్నానికి
పైపూతగా అఱిచేతి నుండి జాలువాఱేట్టు నెయ్యిపోసుకుంటాం" అని చెబుతోంది ఆణ్డాళ్.
రెండో పాసురమ్లో నోములో నియమంగా నెయ్యి తినం అని చెప్పిన ఆణ్డాళ్ ఇక్కడ నెయ్యి పోసుకుంటాం అని చెబుతోంది. దైవదర్శనానికి వెళ్లే ముందు నిష్ఠగా ఉపవాసం చెయ్యడం, దైవదర్శనం అయ్యాక తృప్తితో అవసరమైన ఆహారాన్ని తీసుకోవడం అన్న ఆచరణే ఇది.
"కలిసి ఉండి చల్లగా బతుకుతాం" అంటూ 'కలిసి ఉండడమే చల్లగా బతకడం' అన్న గొప్ప సందేశాన్ని
ఇవ్వకుండానే ఇస్తోంది ఆణ్డాళ్.
పెడసరి అన్న మాటతో మొదలయ్యే పంక్తితో పాసురాన్ని మొదలు పెట్టి, కలిసి ఉండి అన్న మాట ఉన్న పంక్తితో పాసురాన్ని ముగించింది ఆణ్డాళ్. భావం, శైలి, శిల్పం వీటి పరంగా ఒక ఉదాత్తమైన రచనగానూ, ఒక విశిష్టమైన రచన విప్పారడానికి సాకారంగానూ ఈ పాసురాన్ని సమర్పించింది ఆణ్డాళ్.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 27
https://youtu.be/7SL7ANqXNZc?si=3eyRMTQ2-tzus6CG
No comments:
Post a Comment