Sunday, January 18, 2026

 *సంక్రాంతి పండుగ:*
         ➖➖➖
ప్రాణికోటికి ప్రత్యక్షంగా కనిపిస్తూ, వెలుగును అనుగ్రహించే దైవం సూర్యుడు. ఈ సృష్టి మనుగడకు ఆయనే మూల కారకుడు. దివాకరుడికి స్వాగతం పలుకుతూ చేసుకునేదే సంక్రాంతి పండుగ. 

సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ పుణ్య ఘడియల విలువలు పెరుగుతుంటాయని మన శాస్త్ర వచనం. రెండు ఆయనాలుగా సాగే సూర్యుడి ప్రయాణంలో ధనుర్మాసంతో దక్షిణాయనం పూర్తవుతుంది.

మకర సంక్రాంతితో ఉత్తరాయనం మొదలవుతుంది. 
ఈ పుణ్యకాలానికి ఆరంభ సూచకంగా, ప్రత్యక్ష నారాయణుడికి ఆహ్వానం పలుకుతూ ముంగిళ్లను ముగ్గులతో అలంకరించే సంప్రదాయం ఏర్పడింది.

సంక్రాంతి పండుగ ప్రారంభం అయిందంటే చాలు తెలుగు వారి ప్రతీ ఇంటి ముందు రంగవల్లులు  కనిపిస్తాయి.  
ఈ రంగురంగుల  ముగ్గుల వెనుక  బలమైన శాస్త్రీయ సాంప్రదాయ కోణాలు ఉన్నాయి. ఇంటి ముందు వేసే ముగ్గు ఆ ఇంటిలోని సంతోషాలకు అద్దం పడుతుంది. అందమైన ముగ్గలు వేస్తే ఆ ఇంటిలో లక్ష్మి ఆవాసం ఉంటుందంటారు. అదృష్టం ఆ ఇంటిని వరిస్తుందంటారు. ఇంటి ముందు వేసిన అందమైన ముగ్గు ఇంటిలోకి దేవతలను ఆహ్వానించటానికి   గుర్తు అని కుడా పెద్దలు చెపుతూ ఉంటారు.

తొలి సంధ్య వేళలో లేలేత సూర్యకిరణాలు వాకిట్లో విస్తృతంగా ప్రసరిస్తాయి. ఈ సమయంలో ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యానికి అవసరమయ్యే సూర్యశక్తి లభిస్తుంది. అంతేకాదు, నడుం వంచుతూ, కూర్చుంటూ, లేస్తూ, చేతులు ఆడిస్తూ ముగ్గు పెట్టేక్రమంలో శారీరక వ్యాయామం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చలి అధికంగా ఉండే ధనుర్మాసంలో సూర్యకాంతి చాలా అవసరం. ఈ మేరకు సంక్రాంతి వేళ ముగ్గులు పెట్టే సంప్రదాయం తప్పనిసరి చేశారు మన పెద్దలు.

ముంగిలిని నిర్మల ఆకాశానికి ప్రతీకగా భావిస్తారు. ముగ్గుకోసం వేసే చుక్కలను నక్షత్రాలుగా, వాటిని కలుపుతూ వేసే గీతలు ఖగోళంలో మార్పులుగా భావిస్తారు. ముగ్గు కేంద్రకాన్ని సూర్యుడికి సంకేతంగా చెబుతారు.

సంక్రాంతి నాడు సూర్యభగవానుణ్ని ఆహ్వానిస్తూ రథం ముగ్గును విధిగా వేస్తారు. ఇలా ముగ్గుల వెనుక ప్రాధాన్యాన్ని తెలియజేశారు మన పెద్దలు. అంతేకాదు, వాకిట్లో పేడనీళ్లతో చల్లే కళ్లాపి క్రిమికీటకాలకు విరుగుడుగా పని చేస్తుంది. ముగ్గుపిండి కూడా అందుకు తోడ్పడుతుంది.

పురాణకథల ప్రకారం ఒకానొకప్పుడు ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడు. కాబట్టి ఆరాజు బ్రహ్మదేవుడిని తన కుమారుడిని బ్రతికించమని ప్రార్ధించాడు. దీర్ఘ తపస్సు తరువాత బ్రహ్మదేవుడు బాలుడిని బ్రతికించటానికి అంగీకరించాడు. బ్రహ్మదేవుడు నేలపైన బియ్యపు ముద్దతో రాకుమారుడు యొక్క బొమ్మను గీయమని రాజుని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి రాకుమారుడికి జీవం పోస్తానని చెప్పాడు. ఆ సమయం నుండి రంగోలీ అన్నది జీవితం, అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా మారి మన జీవితాలలో ఒక ఆచారంగా మారింది అని కూడ అంటారు.

సంక్రాంతి మాసంలో వేసే ముగ్గుల వెనుక  ఆధ్యాత్మిక సాంస్కృతిక శాస్త్రీయ ధృక్పధాలు ఉన్నాయి అని అంటారు. ఒక పద్ధతి ప్రకారం పెట్టబడే చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్య స్థానానికి సంకేతం అని జ్యోతిష్య శాస్త్రం చెపుతోంది. 

ఇక ఈ పండుగ మాసంలో వివిధ ఆకారాలతో వేసే ముగ్గుల వివరాల్లోకి వెళితే విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ, పాము ఆకారము ఆశ్లేష నక్షత్రానికి, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకూ సంకేతాలుగా కూడా జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

ఇక పండుగల చివరిరోజు వేసే రధం ముగ్గు సామాజిక ఐక్యతను చాటి చెబుతుంది. మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు.

అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోయే సాంప్రదాయం  అందరు ఒకటే అనే సంకీతాలు ఇస్తుంది.

పండుగ రోజుల్లో పెట్టే ముగ్గులు, గొబ్బిళ్ళు లక్ష్మీదేవికి ప్రీతికరం. ఇలా ఎన్నో విషయాలు జీవితానికి ముడిపడినవి ఈముగ్గులలో నిక్షిప్తమై ఉన్నాయి.






No comments:

Post a Comment