తిరుపతి వెంకన్న దర్శనం 24×365 చాలా రద్దీగా ఉంటుంది. మిగతా దేవాలయాల్లో అలా ఉండదు, ఎందుకు?
తిరుపతి వెంకన్న దర్శనం 24×365 రద్దీగా ఉండడానికి కారణం ఒక్క మాటలో చెప్పాలంటే - "నమ్మకం + ప్రకృతి + సౌకర్యం = తిరుమల మహాత్మ్యం".
ఒక ఉదాహరణ తీసుకుంటే, రాహు-కేతు పూజ అన్ని గుళ్లల్లో చేసినా కాళహస్తి అంటేనే ఒక ఫీలింగ్. షిరిడీ అనగానే సాయిబాబా గుర్తొస్తారు. అలాగే "కలియుగ దైవం" అనగానే తిరుమల వెంకన్నే. ఎందుకు?
1. స్థల మహిమ - భూమి ఎంపిక:
శంకరాచార్యులు, రామానుజులు లాంటి మహానుభావులు ఏ కొండ ఎక్కితే పడితే గుడి కట్టలేదు. తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడి అవతారం అని పురాణం. వాయు పురాణంలో "వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన" - ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన స్థలం లేదు అని ఉంది. అంటే ఆ కొండ మీద అడుగు పెడితేనే వైబ్రేషన్ మారిపోతుంది. సైన్స్లో చెప్పాలంటే "జియోమాగ్నెటిక్ ఫీల్డ్" ఎక్కువ ఉన్న ప్రదేశాలు. అక్కడ ధ్యానం చేస్తే మనసు తొందరగా శాంతిస్తుంది.
2. సంకల్ప బలం - కోట్లాది మంది నమ్మకం:
ఒక దీపం వెలుగుతుంది, కోటి దీపాలు కలిస్తే సూర్యుడే అవుతుంది. తిరుమలకి 2000 ఏళ్లుగా కోట్లాది మంది "గోవిందా" అని మొక్కుతున్నారు. ఆ సంకల్పం, ఆ కన్నీళ్లు, ఆ మొక్కులు అన్నీ ఆ గాల్లోనే ఉన్నాయి. అందుకే కొత్తగా వెళ్లిన వాడికి కూడా గుండె బరువు దిగిపోయినట్టు ఉంటుంది. దీన్నే మన పెద్దలు "క్షేత్ర మహాత్మ్యం" అన్నారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అక్కడి ఎనర్జీ నిన్ను పట్టుకుంటుంది.
3. సర్వం సిద్ధం - ప్రకృతి + సౌకర్యం: అక్కడ అనేకమైన ప్రత్యేకతలు ఉంటాయి అందులో జపాలి ఆంజనేయుడు, పాపవినాశనం, ఆకాశగంగ, శిలాతోరణం - ఒక గుడి కాదు, ఒక లోకం. పైన కొండలు, కింద మేఘాలు, చుట్టూ అడవి. నగరం గోల వినపడదు. పైగా TTD వాళ్లు అన్నదానం, బస్సు, క్యూ లైన్, లడ్డూ - భక్తుడు తిన్నాడా, పడుకున్నాడా అని చూసుకుంటారు. "కలియుగంలో ప్రత్యక్ష దైవం" అంటే భయం వేయకూడదు కదా, భరోసా ఇవ్వాలి. తిరుమల అదే చేస్తుంది.
4. జియోగ్రఫీ - అందరికీ అందుబాటు:
AP, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర - అన్ని రాష్ట్రాలకు 1 రాత్రి జర్నీ. "వీకెండ్లో వెళ్లొద్దాం పద" అనేంత దగ్గర. అది కూడా ఒక కారణం.
మరి మిగతా గుళ్లల్లో ఎందుకు లేదు?
ప్రతి గుడికీ శక్తి ఉంటుంది. కానీ కొన్ని గుళ్లు "పవర్ హౌస్" లాంటివి. కరెంట్ అన్ని ఇళ్లల్లో ఉన్నా, పవర్ స్టేషన్ దగ్గరే లోడ్ ఎక్కువ. తిరుమల అలాంటి పవర్ స్టేషన్. కలియుగంలో మనిషి అరిషడ్వర్గాలతో, టెన్షన్లతో సతమతం అవుతున్నాడు. "ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడేవారు?" అని ఏడ్చినప్పుడు "నేనున్నాను" అని ఆ కొండ మీద నుంచి ఒక భరోసా వినిపిస్తుంది. ఆ భరోసా పేరే వెంకటేశ్వరుడు.
అందుకే 24×365 క్యూ ఉంటుంది. అది రద్దీ కాదు, కోట్ల గుండెల నమ్మకం లైన్గా నిలబడింది. నువ్వు వెళ్లేది రాయితో చేసిన విగ్రహం దగ్గరికి కాదు, నీ కోసం ఎదురుచూస్తున్న తండ్రి దగ్గరికి. అందుకే ఎంత రద్దీ ఉన్నా కాలు లాగుతూ అయినా వెళ్తాం.
"వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి" - వెంకన్న లాంటి దేవుడు లేడు, రాడు. అందుకే ఆ క్యూ ఎప్పటికీ తగ్గదు. గోవిందా!
ఇవి నాతో చూసినట్టు అంశాలు మిగిలినవి మీకు తోస్తే వాటిని కూడా చెప్పొచ్చు …ఎవరి నమ్మకం వారిది🙏
✍️TMS RAO
No comments:
Post a Comment