Thursday, February 20, 2025

 *వేదాంత శాస్త్ర యోగ్యత.....*

"నావిరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః!
నాశాంత మానసోవాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్!!"

...అని కఠోపనిషత్తు చెప్పింది.

"దుశ్చరితాత్ అవిరతః యేనం న ఆప్నుయాత్" 

మనం ఆ మంత్రార్థాన్ని సులభమైన భాషలో తెలుసుకోవాలి అంటే చెడ్డ అలవాట్లు వీడని వాడు వేదాలను, వేదాంతమును అర్థం చేసుకొలేడు. శాస్త్రం దేనిని నిషేధించిందో దానినే మనం చాలా అపేక్షిస్తున్నాం. ఇది లోకంలో చాలా విచిత్రమైన విషయం.

"ప్రాయో నేతి శృతి విషయతా విశ్వ మాధుర్య హేతుః"..అన్నారు పెద్దలు...

"న్యాయయాగర్థా అపి కిం అధికం లభ్యం ఉన్మార్గ వృత్యా"

..డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరి అవసరం. దానిని కాదనం. కానీ దానికి ఒక రీతి ఉన్నది. న్యాయమైన మార్గం ఒకటున్నది.

"న్యాయోపార్జిత విత్తేన కర్తవ్యం హ్యాత్మరక్షణం"  

..దానిని వదిలిపెట్టి అన్యాయమార్గంతో ఏదైతే సంపాదిస్తున్నాడో అది సరికాదు. న్యాయమార్గంలో సంపాదించినా, అన్యాయ మార్గంలో సంపాదించినా నువ్వు తినేది ఎంత.. అన్యాయంగా ఎక్కువ సంపాదించిన వాడు ఎక్కువ తినగలడా.. లేనప్పుడు అన్యాయ మార్గంలో సంపాదించి నువ్వు కేవలం పాపాన్ని మూట గట్టుకుంటున్నావు. అది ఎవడి మనసుకి అర్థం కావడం లేదు.

"దారా ఇమేమే పశవశ్చ మేమే ధనాని మేమే ఇత్థం నరో మేష సమాన కంఠః అహోహ్యయం కాలవృకేణనీతః"

..సంస్కృతంలో మే అనగా నాకు, మేమే అని మేకపోతు లాగా అరుస్తూ చివరకు మృత్యువు రూపమైన తోడేలుతో గ్రహించబడ్డాడు. తోడేలు ఎలాగైతే మేకపోతును మింగేస్తుందో అలాగే మృత్యువు వీడిని మింగేస్తుంది. వీడు మేమే అని అంటూనే ఉన్నాడు. ఏం ప్రయోజనం చెప్పండి.. ఈ మనిషి యొక్క ఆశకు అంతులేదు. ఎంత సంపాదించినా నాకు చాలు అనేవాడు ఎవడైనా ఉన్నాడా.. ఎవడికైనా అలంబుద్ధి అనేది వస్తున్నదా.. లేదు కదా.. అలంబుద్ధి అనేది రానందువల్ల ఎంత అన్యాయ మార్గానికి పోవాలో అంత అన్యాయ మార్గానికి పోతున్నాడు. దానివల్ల వాడికి ఒరిగేదేమీ లేదు. కేవలం పాపం మూట గట్టుకోవలసి వస్తోంది. అన్యాయం చేయకూడదు అని శాస్త్రం చెప్పింది. అన్యాయం చేయకూడదని దేనినైతే శాస్త్రం చెప్తోందో అటువైపే వీడు మొగ్గు చూపుతున్నాడు.

అలాగే... "భార్యా భోగాదపి కిం అధికం పణ్యకాంతాసు భోగ్యం వైధాదన్నాదపి కిం అధికం పర్యుదస్తేషు భోజ్యం"

...ఇంట్లో తల్లో భార్యో వంట చేసి ఈశ్వర నైవేద్యం చేసి దానిని భుజిస్తే అది పవిత్రమైనది అవుతుంది. కానీ ప్రతివాడికీ ఇంట్లో మడిగా వంట చేయడం, శివపూజ చేయడం, భగవంతునికి నైవేద్యం చేసినది తీసుకోవడం అనే దాంట్లో రుచి లేదు. కటిక్కిన హోటలుకి పోయి తింటే అక్కడ రుచి. అక్కడ ఉండే రుచి ఇంట్లో మా అమ్మో, ఆవిడో చేస్తే ఉండదండీ అంటారు. దానిని శాస్త్రం నిషేధం చేసింది.

"నాపణీయ మన్నమస్నీ యాత్"

...అన్న విక్రయం చేసే చోట అన్నం తినకూడదు. ఇది శాస్త్రంలో ఉన్న విషయం. ఈ విధంగా మనిషి యొక్క ప్రవృత్తులను చూస్తూంటే శాస్త్రం దేనిని నిషేధించిందో అదే చాలా రుచిగా ఉన్నది అంటే మనమేం చెప్పాలి. ఇదే దుశ్చరితం. ఈ దుశ్చరితాన్ని ఎవడైతే నిలిపి వేస్తాడో వాడికి ఒక యోగ్యత ఉన్నది. దీనిని ఆపాలంటే మనసు పరిశుద్ధంగా ఉండాలి. అపరిశుద్ధమైన మనసు గలిగిన వానిని ఈ దుశ్చరితం నుంచి ఆపడానికి వీలుకాదు. పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు ఈ దుశ్చరితం నుంచి బయటికి రాగలుగుతాడు.

ఎవడైతే చెడు అలవాట్లను మాని సదభ్యాసములను చేస్తాడో అనగా శాస్త్రం నిషేధించినటు వంటి విషయాల జోలికి పోకుండా,  దుశ్చరితం నుంచి బయటికి వస్తాడో.. వాడు దీనికి అధికారి అవుతాడు.

ఎవడైతే శాస్త్రంలో చెప్పినటువంటి యోగ్యతను సంపాదించుకుంటాడో యెటువంటి దుశ్చరితం, దురభ్యాసం లేకుండా, ఇంద్రియ లౌల్యం లేకుండా ఇంద్రియనిగ్రహం కలిగి ఉండి దేనిలోనూ ఆశ లేకుండా ఉంటాడో అటువంటి వాడికి వేదాంత శాస్త్రం వినే యోగ్యత వస్తుంది...

No comments:

Post a Comment