Thursday, February 20, 2025

 *వేదాంతము... అర్హత.....*

వక్తారమాసాద్య యమేవ నిత్యా సరస్వతీ స్వార్థ సమన్వితాసీత్ |
నిరస్తదుస్తర్క కళంక పంకా నమామి తం శంకరమర్చితాంఘ్రిం ||

మానవుడు అనేక మంది అనేక పండితుల ద్వారా వేదాంతం వింటూనే ఉన్నారు. ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రములలో, భగవద్గీతలో, ఆ వేదాంత తత్త్వం అనేది చాలా విస్తారంగా చెప్పబడింది. దానిని మనం వింటూనే ఉన్నాం. కానీ ఎవ్వరికైన ఆ తత్త్వం అనేది సరిగా వంటబట్టిందా.. ఎవరైనా ఆ తత్త్వాన్ని సరిగా మననం చేయగలుగుతున్నారా.. ఆవేదాంతంలో చెప్పినటు వంటి సాధనములను ఎవరైనా అనుష్ఠిస్తున్నారా...

..అని అంటే దానికి జవాబు ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నిసార్లు ఆ వేదాంతోపన్యాసాలు విన్నా ఆ తత్త్వం సరిగా వంటబట్టడం లేదు. ఎందుకని.. ఎవరిది లోపం.. చెప్పేవాళ్ళ లోపమా.. వినే వాళ్ళ లోపమా.. చెప్పేవాళ్ళు పాపం వేదాంతంలో చాలా పరిశ్రమ చేసే చెబుతున్నారు. చేయకుండా చెప్పే వాళ్ళ విషయం నాకు తెలియదు. ఏదో పైపైన చూసుకొని చెప్పే వాళ్ల విషయం మనకి అక్కరలేదు.

కానీ ఓక మహానుభావుడు చెప్పినట్లు...

"ఆకౌమారాత్ గురుచరణ శుశ్రూషయా బ్రహ్మవిద్యా స్వాస్థాయాస్థాం అహః మహతీం అర్జితం కౌశలం యత్"

..బాల్యం నుంచి గురుకుల వాసం చేసి గురు శుశ్రూష చేసి ఆ గురువుల ముఖం నుండి ఆ వేదాంత తత్త్వాన్ని చక్కగా తెలుసుకొని ఆ వేదాంతంలో పాండిత్యం సంపాదించిన పండితులు చెప్పినప్పటికీ ఎందుకు వంట బట్టడం లేదంటే మనకు వేదాంత శ్రవణ అధికారం రాలేదు. దేనికైనా ఒక యోగ్యత అనేది కావాలి.

ఆరో తరగతి పిల్లవాడిని తీసుకొని వెల్లి బి.ఎ. క్లాసులో కూర్చోబెట్టి అక్కడ పాఠాలు లెక్చరర్లు చెప్తున్నారు వాడికి వంట బట్టడం లేదు అంటే ఎలా వంట బడుతుంది.. బి.ఎ. క్లాసులో కూర్చొని ఆ పాఠాన్ని అర్థం చేసుకొనే యోగ్యత వాడికి రాలేదు. ఆ యోగ్యత వాడు సంపాదించుకోవాలి. ఆ యోగ్యత సంపాదించుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి అర్థమౌతుంది. కానీ యోగ్యత సంపాదించకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి ఏమి అర్థం అవుతుంది.. అలాగే మనకి కూడా వేదాంతం సరిగా వంట బట్టాలంటే దానికి కొంత యోగ్యత మనం సంపాదించుకోవాలి...

|| ఓం నమః శివాయ ||

No comments:

Post a Comment