Tuesday, September 24, 2024

 సెప్టెంబర్ 19  తాపీ ధర్మారావు  జయంతి...
*****************************

 
*" దేవుడివైపు కాళ్ళు పెట్టి చదువుకుంటున్నావేమిటి ? తియ్ ! "* అని కోప్పడిన తల్లితో  *"దేవుడు ' అందుగలడిందులేడని సందేహంబు వలదు '                  అన్నారు కదమ్మా ! మరి కాళ్ళెక్కడ పెట్టుకోవాలి ? " అని కుర్రతనంలోనే అహేతుక భావాలను ప్రశ్నించిన గడుగ్గాయి.           '  నూనె కావడి ఎదురొస్తే అశుభం'*  అని  అందరూ వారించినా లెక్కచేయకుండా వెళ్లి ఎఫ్.ఏ పరీక్ష ఫస్ట్ క్లాసులో పాసైన తెలివైన నాస్తికుడు,
పెద్దయ్యాక  *దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?* అని ఆలొచించడమే కాక ఏకంగా పుస్తకమే రాసి భక్తజనావళికి  చెమటలు పట్టించిన హేతువాది, *1887 సెప్టెంబర్ 19న బరంపురంలో పుట్టిన తాపీ ధర్మారావు*  గారి ఇంటిపేరు బండివారో బండారువారో అని ఉండేదట. *వీరి తాతగారు తాపీ పనిలో పేరు తెచ్చుకోవడం వల్ల* అదే ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. 

 *నూతన పోకడలపై మొదటినుంచీ ఆసక్తే :* బడి రోజుల్లోపంచెకట్టుకోవాలనిపించి అందరూ ఎడమచేతి వైపు గోచీ పెడితే " ఏం ? అలాగే ఎందుకు కట్టాలి ?అంటూ కుడిచేతివైపు పెట్టి కట్టుకుని బడికి వెళ్లారు.అందరూ నవ్వారు.మాస్టారు హెచ్చరించారు." నేనిలాగే కడతానని ఎదురు చెప్పడమే కాదు.జీవితాంతమూ అలాగే కట్టారు.

*తన పెళ్లి విషయంలో ఆనాటి సంప్రదాయం పై తిరుగుబాటు:*  పెళ్లి చూపుల్లో -పిల్లకు చదువు తప్పని సరి.పెళ్ళికిముందు ఒకరినొకరుచూసుకోవాలి.కట్నాల ప్రసక్తి కూడదు.భార్యను ఏమేవ్ ,ఏయ్అనికాకుండాపేరుపెట్టి  పిలుచుకోవాలి.నాటకాలకు వెళ్ళినప్పుడు వెంటతీసుకెళ్లి తన పక్కనకూర్చోబెట్టుకోవాలి.అనే షరతులు పెట్టారు. *ఈనాడివి అల్ప విషయాలు.కానీ 1902-1903 కాలంలో అభ్యుదయ భావాలు.*

*లెక్కల మాస్టారుగా ఉద్యోగం ప్రారంభించి  ఉప్పల లక్ష్మణరావు గారూ వి.వి.గిరి వంటి గారికీ పాఠాలు చెప్పారు.* కొన్నాళ్ళు  సర్వే డిపార్టుమెంట్ లో పనిచేసి,తరువాత ట్యుటోరియల్ కాలేజీ నడిపారు.బొబ్బిలి రాజా సోదరుడికి ట్యూటర్ గా పనిచేశారు.చివరకు పత్రికా రంగంలో స్థిరపడ్డారు.

*దేవాలయాలపై కనిపించే బూతుబొమ్మలన్నీ గుడులలో  జరిగే  సంగమాలను తెలిపేవే*  అంటూ 1936లో ప్రజామిత్ర పత్రికలో రాసిన వ్యాసాలను   *'దేవాలయాలమీద  బూతుబొమ్మలెందుకు ?"* అనే పుస్తకంగాప్రచురించారు.అదే పత్రికలో  ' కొత్తపాళీ '*  వ్యాసాలను ధారావాహికంగా ప్రచురించారు.  *తనకు పుట్టినవాడే తన ఆస్తికి వారసుడు కావాలన్న తపనే* *' ఇనుప కచ్చడాలు'* 'కు మూలం అన్నారు. *'అడగజాలనివాడు* అనే పేరుతొ రాసిన వ్యాసాలను " *ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ"* పుస్తకంగా వెలువరించారు.
 
*ఆదిలో మగపెళ్లి వారూ ఆడపెళ్ళివారూ తప్ప మరొకరితో నిమిత్తం లేకుండా ఒకరికొకరు తమలపాకులు ఇచ్చుకోవడం వంటి అతి సామాన్య తంతులోకి పిలవని పేరంటంగా పురోహితుడు ప్రవేశించి ఏవోవో మంత్రాలు అల్లి నానా రకాల కర్మకాండను కల్పించి పెళ్లిని " పెద్ద భూతంగా ఎలా మార్చాడో   " పెళ్లి-దాని పుట్టు పూర్వోత్తరాలు"* లో వివరించారు.1937లోసినీరంగం లో అడుగుపెట్టి మొదట " మోహినీ రుక్మాంగద " కీ *చివరగా 1962లో " భీష్మ సినిమాకీ* సంభాషణలు రాశారు.చేమకూర వెంకటకవి ' విజయవిలాస' కావ్యానికి *సహృదయోల్లస వ్యాఖ్య* రాసి సంప్రదాయ పండితుల ప్రశంసలందుకున్నారు.

ఏదైతేనేం వెయ్యిముఖాలతో వెలిగిన జీవితం పూలబాటలూ ముళ్లపుంతలూ చవిచూసిందని *" రాళ్ళూ రప్పలూ "*  వర్ణించిన 86 సంవత్సరాల జీవితం అలసిపోయి *1973 మే 8 న శాశ్వత విశ్రాంతి* తీసుకుంది.                                                                                                                                                                                                                                                                                        *సెప్టెంబర్  19,  తాపీ ధర్మారావుగారి జయంతి*...

No comments:

Post a Comment