Thursday, February 20, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


107. న నూనమస్తి నో శ్వః కస్తద్వేద యదద్భుతమ్

నేడు లేదు రేపు లేదు-తెలియని దాని(రేపటి గురించి ఎవరు తెలుసుకోగలరు(ఋగ్వేదం)

ధర్మాచరణలో ఆలస్యం కూడదు. ఈ క్షణం శాశ్వతం కాదు. నిన్న మళ్ళీ రాదు.
రేపు మనకి తెలియదు. అందుకే వర్తమానాన్ని వినియోగించుకోవాలి.

విలంబం నా చరేత్ ధర్మే
చలం చిత్తం వినశ్యతి |
ఇన్ద్రణాగస్త్య సంవాద
ఏష ధర్మ ఉదాహృతః ॥

'ధర్మం విషయంలో ఆలస్యం పనికిరాదు. 
చేయాలని ఇప్పుడు అనిపించిన చిత్తమే
మరుక్షణంలో మారిపోవచ్చు. ఋగ్వేదంలో ఇంద్ర, అగస్త్యుల సంవాదంలో ఇది
ఉదహరింపబడింది'.

( భవిష్యత్తు కోసం ఆశించడం, గతం గురించి తలంచుకోవడం రెండిటి వల్లా ప్రయోజనం లేదు. మంచి పనికి సంకల్పించిన చిత్తం మళ్ళీ మారిపోకుండా వెంటనే ఆచరించాలి.)

ఆ సంవాదంలోని వాక్యమే పై వేదవాక్కు.

అశుభానికి ఆలస్యం మంచిది. శుభానికి మాత్రం ఇసుమంత కూడా జాగు తగదు.

'శుభస్య శీఘ్రం' అనే ప్రసిద్ధమైన వాక్యం దీనినే తెలియజేస్తోంది.

అగస్త్యుడు యజ్ఞం చేస్తున్న ఒక సందర్భంలో ఇన్ద్రుని ఉద్దేశించి హవిస్సునిస్తున్న
సమయంలో రాజ్యాభిమానవశంతో ఇంద్రుడు కాస్త ఆలస్యం చేశాడు. ఆ సమయంలో ఆ హవిస్సు మరుత్తులకి ఇవ్వబడింది. తిరిగివచ్చిన ఇన్ద్రునితో 'కలతపడకు. తరువాత మరొక సందర్భంలో లభిస్తుంది' అన్నాడు అగస్త్యుడు.

అప్పుడు ఇన్దుడు "మహర్షీ! ఇవాళ దొరకవలసింది చేజారాక, తరువాత ఎన్నడో లభిస్తుందని నిశ్చయం ఏమిటి? జరగని దాని గురించి ఎవరికి తెలుస్తుంది క్షణానికి
ఒక విధంగా మారిపోయే చిత్తం గురించి ఏం చెప్పగలం?" అని అన్నాడు.

ఇది ఇన్దుని దోషాన్ని ఎత్తి చూపే కథ కాదు. ఇన్ద్రుని ద్వారా అగస్త్యుడు లోకానికి
చెప్పిన గొప్ప బోధ.

భవిష్యత్తు కోసం ఆశించడం, గతం గురించి తలంచుకోవడం రెండిటి వల్లా
ప్రయోజనం లేదు.

మంచి పనికి సంకల్పించిన చిత్తం మళ్ళీ మారిపోకుండా వెంటనే ఆచరించాలి.

కాలం విలువ గురించి వేదసంస్కృతి చాలా బోధలు చేసింది.

ఆయుః పరిస్రవతి భిన్న ఘటాదివాంభోః
లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రమ్||
"నిత్యం సన్నిహితో మృత్యుః
కర్తవ్యో ధర్మ సంగ్రహః”

నిత్యం మృత్యువు సన్నిహితంగా ఉందనే భావంతో ధర్మాన్ని ఆచరించాలి అని
సుభాషితం 

మంచిపనికి వాయిదాలు కూడదు. నిశ్చలమైన ఏకాగ్రచిత్తంతో ఆచరించడమే
కర్తవ్యం.      

No comments:

Post a Comment