☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
108. ఇచ్ఛన్తి దేవాః సున్వన్తం స్వప్నాయ స్పృహయన్తి
నిద్రించేవాని కోరికలను దేవతలు తీర్చరు (వేదవాక్యం)
సదాచారాన్ని ప్రబోధించే వేదవాక్యమిది.
నిద్రాపరుడు అభివృద్ధి చెందడు. అతినిద్ర బుద్ధిశక్తిని మందగింపజేస్తుంది.
నిద్ర జీవితానికి అవసరమే, కానీ దానికి 'మితి' ఉంది. యోగాది సాధనల ద్వారా, వ్యాయామాల ద్వారా, మితాహారం ద్వారా నిద్రను నియంత్రించవచ్చు.తగినంత నిద్ర శరీరానికి శక్తినిస్తుంది. కానీ మితిమీరిన నిద్ర వలన సోమరితనం,
వాయిదాలు వేయడం, చురుకుతనం కోల్పోవడం జరుగుతాయి.
ఐహిక జీవితానికి గానీ, పారమార్థిక సాధనకి గానీ నిద్ర పెద్ద ప్రతిబంధకం.
పగటి నిద్ర, రాత్రి ఎక్కువ సేపు మేల్కొని ఉండడం, సూర్యోదయానికి మునుపు మేల్కొనలేక పోవడం... ఇవన్నీ దరిద్ర లక్షణాలుగా శాస్త్రం వర్ణించింది.
“ఉభయ సంధ్యలలో నిద్రపోయిన వారిని నేను విడిచిపెడతాను" అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పినట్లు మహాభారతంలోని మాట.
ఇదే విషయం పురాణాలలో కూడా చాలా వివరించారు. వేదం చెప్పిన సదాచారాన్నే పురాణాలు సామాన్యులకు సైతం సుబోధకమయ్యేలా తెలియజేశాయి.
సంధ్యాకాలాలు ఆధ్యాత్మిక సాధనకి, తద్వారా దేవతానుగ్రహ సంపాదనకి
ముఖ్యమైనవి.
ఆ సమయంలో ధ్యాన, ఉపాసనాదులు తప్పనిసరిగా చేయాలని ధర్మగ్రంథాలు
హెచ్చరికగా బోధించాయి.
ఉభయసంధ్యలలో నిద్రపోయినవారి గతంలో చేసుకున్న పుణ్యాలన్నీ నశిస్తాయని పురాణాదులు చెబుతున్నాయి.
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥
అని గీతాచార్యుని మాట. తగిన ఆహారవిహారాలు, తగిన చేతలు, తగిన (నియమితమైన) నిద్ర మెలకువలు కలిగిన యోగులు దుఃఖాలను పోగొట్టుకుంటారు.
అతినిద్ర వలన చురుకుతనం తగ్గి, జ్ఞానం, కర్మాచరణ వంటివి కొనసాగవు. ఏ పనిచేసినా సమర్థవంతంగా, సాఫల్యంగా చేయలేడు.
శ్రీరాముడు, భరతునితో మాట్లాడుతూ
"ఎక్కువగా నిద్రించడం లేదు కదా! అలాగని తక్కువగా నిద్రపోవడం లేదు కదా!సరియైన నిర్ణయాలను, ఆలోచనలను తెల్లవారుజాముననే ఆచరిస్తున్నావు కదా!"అని ప్రశ్నిస్తాడు.
భరతుడు కౌసల్య ముందు ప్రతిజ్ఞ చేస్తూ -
“అమ్మా! నా వల్లనే శ్రీరాముడు అడవికి వెళ్ళినట్లయితే - ఉభయసంధ్యలలో నిద్రించేవాడు పోయే పాపానికి పోతాను" అంటాడు.
ఇలాంటి మాటలన్నీ సదాచారంలో 'తగిననిద్ర' యొక్క ప్రాధాన్యాన్ని
తెలియజేస్తున్నాయి.
“నిద్ర, అతివాగుడు - మాపై పెత్తనం చలాయించకూడదు" - అని వేదంలోనే
ఒక మంత్రం ఉంది.
ధర్మాచరణలో సెలవులుండవు. ప్రతిదినం, ప్రతిక్షణం చాలా విలువైనది.భగవంతుడిచ్చిన ఆయువును ధర్మాచరణతో, సాధనతో సార్థకం చేసుకోవాలి. అందుకే
నిద్రను జయించాలి.
శ్రీకృష్ణుడు, అర్జునుని "గుడాకేశ” అని సంబోధిస్తాడు. ‘గుడాకేశ” అర్జునునికి
భారతంలో మరో పేరు. ఈ పదానికి “నిద్రను జయించినవాడు” అని అర్థం.
అందుకే అతడు 'విజయుడయ్యాడు'. గీతాబోధనకు అర్హుడయ్యాడు.
తమోగుణం ఎక్కువైనవారికి నిద్ర, కునుకుపాటు ఎక్కువగా ఉంటాయి. వారికి ఐశ్వర్యం, జ్ఞానం కలగవు.
నిద్ర, తంద్ర(కునుకుపాటు), భయం, క్రోధం, సోమరితనం, వాయిదాలు వేయడం
- ఈ లక్షణాలున్నవాడు జీవితంలో ఎదగలేడని సుభాషితం.
No comments:
Post a Comment