@ సాయంకాలపు ముచ్చట్లు 7 @
ఒకప్పుడు
అందరికీ అందుబాటులో
ఉండేవి కాదుట పుస్తకాలు
రాజాంతఃపురాల్లోనూ
ధనవంతుల ఏకాంత మందిరాల్లోనూ
వివిధ మతాల దేవాలయాల్లోనూ ధర్మశాలల్లోనూ
నలంద తక్షశిల వంటి విశ్వ విధ్యాలయాల్లోనే
ఉంటేవట గ్రంధాలు
**********
అప్పటికింకా
కాగితం కనిపెట్టలేదు మరి
జంతు చర్మాలపైనా .... లోహ రేకుల పైనా
చెట్ల బెరడు లో పైనా ... తాళ పత్రాల పైనా ... మట్టి పలకల పైనా.....
పక్షి ఈకల తోనో ... పదునైన ములుకుల తోనో ... గంటాలతోనే రాసేవారు మరి
అప్పటికింకా
ముద్రణా యంత్రం కూడా
ఆవిష్కరింపబడలేదు మరి
మరీ ....
మరో పుస్తకం
తయారు కావాలంటే ?
ఆయా గ్రంధ యజమానులను బతిమాలో బామాలో ...
ఆ గ్రంథం అడిగి తీసుకుని ఓపికగానూ శ్రద్ధగానూ నకలు రాసుకోవడమే దారి మరి
ఆ రోజుల్లో అలా నకలు రాసే వ్రాయసగాళ్ళకు మంచి గిరాకీ కూడా ఉండేదేమో బహుశా
*********
చైనీయులు
కాగితాన్ని కనిపెట్టారు
జాన్ గూటెన్బర్గ్
ముద్రణా యంత్రాన్ని కనిపెట్టాడు
ఎన్నెన్నో వినూత్న ఆవిష్కరణలు
ముద్రణా రంగంలో పుస్తక ప్రచురణ రంగంలో
ఆథ్యాత్మికమో
లేక వైజ్ఞానికమో
అది ఏదైనా కానివ్వండి
ఇప్పుడు
అందరి చేతుల్లోకీ
వచ్చి వాలాయి పుస్తకాలు
కానీ .....
పుస్తకం ఓ నిత్యవసరం
అని భావించక పోవడం వర్తమాన విషాదం
షోకేసుల్లో
అందం కోసం అలంకరించుకునే
గాజు బొమ్మలకు ఇచ్చిన పాటి విలువ
పుస్తకాలకు ఇవ్వకపోవడం నిజమైన విషాదం
- రత్నాజేయ్ (పెద్దాపురం)
No comments:
Post a Comment