🥀*అబద్ధం ఎప్పుడు.. ఏ సమయంలో చెప్పాలి.. ఏంటీ..?*🥀
🔱 *వాల్మీకి చెప్పిన సత్యం* 🔱
🥀 *నీతి కథ :* 🥀
అబద్ధం ఎప్పుడు చెప్పాలంటే.. మనం చెప్పే నిజం వల్ల ఒకరికి నష్టం కలుగుతుందనుకుంటే.. ఆ నష్టం కలగకుండా ఉండేందుకు అబద్ధం చెప్పడమే మేలని అప్పటి గురువులు చెప్పేవాళ్లు. ఒక ప్రాణాన్ని కాపాడే అబద్ధం కూడా నిజంతో సమానమని వాల్మీకి స్వయంగా తన శిష్యులకు బోధించాడు.
అందుకు ఆయన ఓ ఉదాహరణ చెబుతూ.. పిల్లల్ని అడుగుతారు.. మీరందరూ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఆశ్రమంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వ్యక్తి వెనకాలే నలుగురు దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వ్యక్తి గురించి అడిగారు. అప్పుడు ఏం చెప్పాలి? ఆశ్రమంలో దాక్కున్నాడని చెప్పాలా? అడవిలోకి పారిపోయాడని చెప్పాలా?
ఇదేమాటను వాల్మీకి పిల్లలను అడిగినప్పుడు వాళ్లంతా చెప్పిన సమాధానాలు విని.. వాల్మీకి వాళ్లతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి ఆశ్రమంలో ఉన్నాడనే నిజం చెప్పొద్దు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి అడవిలోకి పారిపోయాడంటూ చెప్పే అబద్ధం కూడా నిజం కంటే గొప్పదని చెబుతాడు. అంటే.. అబద్ధం ఆడినా దాని ఫలితం నిజం కంటే గొప్పగా ఉండాలి.
ఈ కాలంలో పరిస్థితులు అలా లేవు.. స్వార్థంతో పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. తాము బతకటం కోసం కోకొల్లలుగా అబద్ధాలు ఆడుతున్నారు. జనం బలహీనతలను ఆసరా చేసుకుని.. వాళ్ల అవసరాలే పెట్టుబడిగా అబద్దాలతో మోసాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల జీవితం ఆనందంగా ఉంటుంది అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. అబద్దాలతో మోసం చేసే వాళ్లు.. నిత్యం భయంతో బతుకుతూ ఉంటారని.. అలాంటి వాళ్లను ఖర్మ వెంటాడుతుందని వాల్మీకి తన శిష్యులకు బోధించాడు.
అందుకే *న బ్రూయాత్ సత్యమప్రియం* అంటారు.
సత్యం బాధించేలా ఉంటే సత్యం చెప్పనవసరం లేదని భావం.
No comments:
Post a Comment