Saturday, April 12, 2025

 *జై హనుమాన్* 

🍁🍁🍁🍁🍁

హనుమంతుడు లేకపోతే రామాయణం  పరిపూర్ణం కాదు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునునికి ప్రియ సఖుడు.. శ్రీరామ దాసుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మ శోకాన్ని హరించినవాడు. ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణనుని గర్వం అణచినవాడు. 

హనుమంతుని ఈ నామాలు ప్రయాణం, నిద్రపోయే ముందు స్మరించినవారికి మృత్యుభయం ఉండదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది. 
ధైర్యం, శక్తి సామర్ధ్యాలకు హనుమత్ రూపం ప్రతీకం.

 ఆకాశ మార్గాన ప్రయాణించి సముద్రం దాటి లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. 

హనుమాన్ జయంతిని కొందరు చైత్ర పౌర్ణమి నాడు, మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుతారు. కేరళలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. 

అతిబల పరాక్రమవంతుడైనా శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారంటే సీతమ్మ తల్లికంటె మిన్నగా రాముని ప్రేమించాడు.

 ఒకసారి సీతమ్మ నుదుటున సిందూరం చూసి ఎందుకు పెట్టుకున్నవు తల్లీ? అని అడిగితే, శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఆమె చిరునవ్వుతో చెబుతుంది. అంతే హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి.

హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజిస్తారు. 

‘కలౌ కపి వినాయకౌ’అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. ‘ *యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర* *కృతమస్తాకాంజిలమ్* , *బాష్పవారి పరిపూర్ణలోచనం -* *మారుతిం నమత రాక్షసాంతకమ్’* 

అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం.

అలాగే భూతప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెబితే భయపడి పారిపోతాయి. మహా రోగాలు మటుమాయం అవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలూ తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది.

 హనుమంతునికి 5 సంఖ్య చాలా ఇష్టం. అందుకే ఐదు ప్రదక్షిణలు చేయాలి. అరటి, మామిడి పళ్లు అంటే ఆయనకు ప్రీతి. హనుమాన్ చాలీసాను చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండలం కాలం పాటు రోజుకు ఒకటి, మూడు, ఐదు, పదకొండు, లేదా 41 సార్లు పారాయణం చేస్తారు. దీని వల్ల చేపట్టిన కార్యం, అనుకున్న పనులు త్వరితంగా పూర్తయి, మనసులోని కోరికలు నెరవేరుతాయి. 

🙏 *జై హనుమాన్*🙏

No comments:

Post a Comment